భూత్పూర్, మే 12 : దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మండలంలోని తాటిపర్తికి చెందిన దళితబంధు లబ్ధిదారుడు కాశీపాండే రూ.12లక్షలతో కొనుగోలు చేసిన డిజిటల్ సర్వే యంత్రాన్ని గురువారం భూత్పూర్లో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ భూమిని సర్వే చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలోనే ఇలాంటి మిషన్ను తీసుకున్నది కాశీపాండే ఒక్కడే అని అన్నారు. దళితబంధు నిధులతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు బోరింగ్ నర్సింహులు పాల్గొన్నారు.
పట్టుదలతో ఉద్యోగం సాధించాలి
దేవరకద్ర రూరల్, మే 12 : ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన సందర్భంగా యువత పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేవరకద్రలో ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం ఆర్వోబీ పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే వివిధ గ్రామాలకు చెందిన ఏడుగురికి రూ.2,20,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
మార్కెట్యార్డులో పని చేస్తున్న దడవాయిలు, హమాలీలకు సర్టిఫికెట్లు, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం పెద్దఎత్తున నోటిఫికేషన్లు జారీ చేస్తున్నదన్నారు. యువత సమయాన్ని వృథా చేయకుండా పట్టుదలతో చదవాలని సూచించారు. టెట్లో ఉత్తీర్ణత సాధించి డీఎస్సీకి సన్నద్ధం కావాలన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణను ఇప్పించి మెటీరియల్ను పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.