ఎక్కడికక్కడ వాహనాలు సీజ్
నిబంధనలు పాటించని ఫార్మా కంపెనీ బస్సులు
జడ్చర్లలో లాక్డౌన్ అమలును పరిశీలించిన ఎస్పీ వెంకటేశ్వర్లు
జడ్చర్లటౌన్, మే 24 : లాక్డౌన్ నేపథ్యంలో సోమవారం జడ్చర్ల పట్టణంలో పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. ఉదయం 10గంటల తర్వాత రోడ్లమీదకు ఎవరూ రాకుండా చర్యలు చేపట్టారు. పట్టణ ప్రధాన రహదారులపై పోలీసులు తనిఖీలు నిర్వహించి అనవసరంగా రోడ్లమీదకొచ్చిన వారిని హెచ్చరిస్తూ వాహనాలను సీజ్ చేశారు. నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, కొత్తబస్టాండ్ ప్రధాన కూడళ్లలో బారీకేడ్లను ఏర్పాటు చేశారు. జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎస్పీ వెంకటేశ్వర్లు లాక్డౌన్ అమలును పర్యవేక్షించారు. రోడ్లపైకి వాహనాలు రాకుండా పకడ్బందీగా అరికట్టాలని సీఐ వీరాస్వామిని ఆదేశించారు. నేతాజీచౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వద్ద అడిషనల్ ఎస్పీ రాంకుమార్, మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షించారు.
మిడ్జిల్, జడ్చర్ల ఎస్సైలు జయప్రసాద్, శంషొద్దీన్ ప్రధాన రహదారులపై పెట్రోలింగ్ చేస్తూ అనవసరంగా రోడ్ల మీదకొచ్చే వారిని ఆపి వాహనాలను సీజ్ చేశారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కడిక్కడ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సీఐ వీరాస్వామి, ఎస్సైలు శంషొద్దీన్, జయప్రసాద్ ప్రధాన కూడళ్ల వద్దకు చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నిత్యం రైల్వేగేటు కూరగాయల మార్కెట్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్న నేపథ్యం లో పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పోలేపల్లి ఫార్మా కంపెనీలకు చెందిన బస్సుల్లో భౌతికదూరం పాటించకుండా కంపెనీల ఉద్యోగులు ప్రయాణిస్తున్న విషయాన్ని పోలీసులు దృష్టిసారించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.