గద్వాల/టౌన్, జూన్ 8: కరోనా కట్టడి కావాలంటే ప్రతిఒక్కరూ టీకా తప్పని సరిగా వేయించుకోవాలని గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్వేశ్వరయ్య పాఠశాలలో సూపర్స్రైడర్స్కు టీకా వేసే కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనాను కట్టడి చేసే చర్యలో భాగంగా ఇటీవల ప్రభుత్వ దవాఖాన ఆవరణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించామని అయితే అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్ధేశంతో 31వార్డులోని లింగంబాగ్ కాలనీలో ఉన్న పాఠశాలలో మరో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నరహరి శ్రీనివాసులు, శ్రీమన్నారాయణ, నాయకులు నజీర్, రిజ్వాన్ పురపాలక అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.