గద్వాల: గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గద్వాల మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నదని అందుకు నిదర్శనం గద్వాల మున్సిపాలిటీలో జరుగుతున్న పనులే నిదర్శనమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 2వ వార్డులో రూ.20లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే పురపాలక చైర్మన్ బీఎస్ కేశవ్, వార్డు కౌన్సిలర్ లక్ష్మీనర్సమ్మతో కలిపి భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో గద్వాల మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అన్ని వార్డుల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. కర్నాటక ప్రాంతంలోని రాయచూర్ ఎమ్మెల్యే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును అభినందించారని తెలిపారు. రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనం చేయాలని సభా వేదికగా తెలిపారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు.
ప్రతి పక్షాలు ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావా లని పిలుపునిచ్చారు. భవిష్యత్లో మంత్రి కేటీఆర్ సాయంతో గద్వాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బాబర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, కౌన్సిలర్లు శ్రీను, నాగిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోవిందు నాయకులు కృష్ణకుమార్రెడ్డి, సాయిశ్యాంరెడ్డి, ధర్మానాయిడు, రత్నసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.