సిద్దిపేట టౌన్, మే 4 : మహిళలను గౌరవించడం మన సంస్కృతి.. అమ్మగా, ఆలిగా ప్రత్యక్ష దైవంగా కొలుస్తాం. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం ఆమె సొంతం. మంచితనాన్ని ఆసరాగా చేసుకొని కొందరు వేధింపులు, దాడులు, అత్యాచారాలకు పాల్పడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారు. వారి నిండు జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఒంటరి, మతిస్థిమితం కోల్పోయి ఇల్లు వదిలి వెళ్లిన అభాగ్యులను చేరదీసి మేమున్నామని బాధ్యతగా ముందుకు వస్తూ వారిలో నవకాంతులను నింపుతున్నది సిద్దిపేట సఖీ కేంద్రం. ఈ నేపథ్యంలో సఖి కేంద్రంలో అందుతున్న సేవలపై ప్రత్యేక కథనం…
తెలంగాణ సర్కారు మహిళలకు అన్ని వేళలా రక్షణగా, అండగా నిలువాలనే సంకల్పంతో సఖీ కేంద్రాలను నెలకొల్పింది. ఇందులో భాగంగానే సిద్దిపేట పాత ఎంసీహెచ్ దవాఖానలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సఖీ కేంద్రం సేవలను 2019 జూన్ 12న ప్రారంభించింది. సేవలు పూర్తిగా మహిళా సిబ్బందితోనే అందుతున్నాయి. సఖీ కేంద్రానికి చైర్మన్గా కలెక్టర్ ఉన్నారు. ప్రగతి మహిళా సంక్షేమ సంఘం చైర్పర్సన్ స్వరూపారాణి నేతృత్వంలో సఖీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సఖీ సెంటర్ అడ్మినిస్ట్రేషన్గా ప్రతిమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాదాపు రెండేండ్ల కాలంలో అభాగ్యులకు అండగా నిలిచింది. సఖీ కేంద్రానికి వ్యక్తిగత సహాయం కోసం వచ్చే వారికి న్యాయపరమైన సేవలు, సూచనలు, వేధింపుల బారిన పడిన వారికి తక్షణమే నేషనల్ హెల్త్ మిషన్ సహకారంతో వైద్య సేవలు అందిస్తున్నారు.
అండగా ఉంటూ ఆత్మైస్థెర్యాన్ని నింపుతూ..
సిద్దిపేట పాత ఎంసీహెచ్ దవాఖానలో సఖీ కేంద్రం వన్స్టాఫ్ సెంటర్గా కొనసాగుతుంది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్నప్పటికీ అన్ని శాఖల భాగస్వామ్యంతో సేవలు అందుతున్నాయి. బాధిత మహిళలకు తాత్కాలిక వసతి, న్యాయపరమైన సేవలు, పోలీస్ సహాయం అందుతుంది. మహిళల అక్రమ రవాణా, మోసపోవడం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, దాడులు, అదృశ్యం, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, ఈవ్ టీజింగ్ బారిన పడిన వారికి బాసటగా నిలుస్తుంది.
310 కేసుల పరిష్కారం..
సిద్దిపేట సఖీ కేంద్రాన్ని ఆశ్రయించిన బాధిత మహిళలకు బాసటగా నిలుస్తూ వారి సమస్యలను సావధానంగా విని కౌన్సిలింగ్ ద్వారా పోలీసు సేవలు, న్యాయపరమైన సూచనలు, సలహాలు అందిస్తూ 90 శాతం కేసులను పరిష్కరించారు. 351 కేసులు రాగా, అందులో గృహహింస 229, అదనపు కట్నం 30, ప్రేమ పేరిట మోసగించడం, సైబర్ క్రైమ్ 17, అదృశ్యం, అపహరణ 14, వేధింపులు 15, బా ల్య వివాహాలు 2, ఈవ్టీజింగ్ 2, ఆస్తికి సంబంధించినవి 12, ఇతర కేసులు 40 ఉన్నాయి. ఇందులో 310 కేసులను పరిష్కరించారు. అందుబాటులో ఉన్న హెల్ప్లైన్ నంబర్ ద్వారా 184 కేసులను పరిష్కరించారు. 79 మందికి వైద్య సదుపాయం, 78 మందికి పోలీసుల సహాయం, 140 మందికి తాత్కాలిక వసతి, 360 మందికి కౌన్సెలింగ్, 99 మందికి న్యాయపరమైన సేవలు, సలహాలు అందించారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 378 అంగన్వాడీ సెంటర్లకు ఆన్లైన్ ద్వారా న్యాయపరమైన సూచనలు, సలహాలు అందజేశారు. వివిధ గ్రామాల్లోని 485 సర్పంచ్లకు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో 89 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సఖీ కేంద్రంలో అందుతున్న సేవలపై ప్రచారం చేశారు.