దుర్గ్: చత్తీస్ఘడ్లో విచిత్ర ఘటన జరిగింది. 33 ఏళ్ల ఓ వ్యక్తి తన నాలుకను కోసేసుకున్నాడు(Chops Off Tongue). ఆ కోసిన నాలుకను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ఈ ఘటన దుర్గ్ జిల్లాలో ఇవాళ ఉదయం తనౌడ్ గ్రామం.. అంజోరా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాజేశ్వర్ నిషాద్ అనే వ్యక్తి గ్రామంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి, కొన్ని మంత్రాలు వల్లించి, తన నాలుకను కత్తితో తానే కోసుకున్నాడు. ఆ చెరువు వద్ద ఉన్న ఓ రాయిపై ఆ కోసిన నాలుకను ఉంచాడు. రక్తం బ్లీడింగ్తో ఉన్న అతన్ని గ్రామస్తులు చూసి అంబులెన్స్కు కాల్ చేశారు. జిల్లా ఆస్పత్రికి అతన్ని షిఫ్ట్ చేశారు.
గ్రామస్థుల కథనం ప్రకారం.. నిషాద్ భార్య మూగది. ఆమెకు మాటలు రావు. అయితే ఏదో కోరికతో శివుడికి అతను తన నాలుకను సమర్పించినట్లు అనుమానిస్తున్నారు. కానీ నాలుక కోసుకోవడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియదు. నిషాద్ వాడిన కత్తిని పోలీసులు రికవరీ చేశారు. ఇదో మూఢనమ్మకానికి చెందిన ఘటన అని, విచారణలో మరిన్ని విషయాలు తెలియనున్నట్లు పోలీసులు చెప్పారు.