పోచంపాడ్ జల ప్రమాదంలో ఆరుగురి మృతి మూడు కుటుంబాలను తీవ్రంగా దెబ్బతీసింది. మృతుల్లో రెండు కుటుంబాలకు చెందిన తండ్రి, కొడుకులుండడం విషాదాన్ని నింపింది. గుత్పకు చెందిన భూమన్న, చిన్నరాజు దంపతుల పెద్ద కుమార్తె వసంతకు మాక్లూర్ మండలంలోని డీకంపల్లి గ్రామానికి చెందిన జిలకర సురేశ్తో వివాహం జరిపించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరు అన్యోన్యంగా కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. వీరికి ఒక కొడుకు, కూతురు కాగా… శుక్రవారం జరిగిన ప్రమాదంలో వసంత భర్త సురేశ్, కొడుకు యోగేశ్ ఇద్దరూ మృత్యువాత పడ్డారు. ఇంటి పెద్ద దిక్కును, చేతికొచ్చిన కొడుకును పోగొట్టుకుని వసంత తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. వసంతకు సోదరి వరుసయ్యే మా నస పరిస్థితి మరింత దారుణం. గుత్పకు చెందిన మానసకు ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కొడుకులు. సిద్ధార్థ్(16), శ్రీకర్(14) ఇరువురిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కలలు కన్న మానసను విధి కాటేసింది. జల ప్రమాదంలో తనకు తోడే లేకుండా కట్టుకున్న భర్తను, కన్న కొడుకులిద్దరినీ గంగమ్మ తీసుకు పోవడంతో మానస ఒంటరైంది. భర్త సాయంతో స్వశక్తితో కుటుంబ పోషణను సాగిస్తూ వచ్చిన మానస పరిస్థితి కూడా ఇప్పుడు అగమ్యగోచరంగానే మారింది.
మానస పరిస్థితి ఏమిటి?
మానసకు పదిహేడేళ్ల క్రితం నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్తో వివాహమైంది. మానస స్వస్థలం గుత్ప కాగా భూమన్న, చిన్నరాజు పిల్లలతోనే కలిసి మెలిసి పెరిగింది. వారితో ఉన్న చనువు, అన్యోన్యత మూలంగా ప్రతి ఫంక్షన్కూ వెళ్లడం పరిపాటిగా ఉండేది. రాధ కొడుకు పుట్టువెంట్రుకల కార్యక్రమానికి ఆహ్వానం రావడంతో భర్త శ్రీనివాస్, కొడుకులు శ్రీకర్, సిద్ధార్థ్లతో కలిసి వెళ్లింది. అనుకోని ఘటనతో భర్త, ఇద్దరు పిల్లలు మృత్యు ఒడికి చేరడంతో మానస పరిస్థితి దయనీయంగా మారింది. పుష్కరఘాట్లో కట్టుకున్న భర్త, కన్న కొడుకులను విగత జీవులుగా చూసి తీవ్రంగా విలపించింది. ఇంటి పెద్ద దిక్కును, చేతికొచ్చిన పిల్లలను కోల్పోయిన మానస ఇప్పుడు ఒంటరిగా మారింది. ఎల్లమ్మగుట్టలో భర్తతో కలిసి బ్యాంగిల్ స్టోర్ను నిర్వహిస్తున్నది. ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబం పోషణ సాగుతున్నది. అంతులేని విషాదంతో మానస తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. నేనేం పాపం చేశాను… గంగమ్మ తల్లీ అంటూ మానస రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
అరె నాని… నేను అమ్మనురా…
పోచంపాడ్ వద్ద గోదావరిలో ఆరుగురు మృతి వార్త దావనంలా వ్యాప్తించింది. ప్రజలంతా పెద్ద సంఖ్య లో ఘాట్ పరిసరాలకు చేరుకున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపడుతున్న సమయంలో ఒక్కో మృతదేహం వస్తున్న క్రమంలో కుటుంబీకులంతా తమ వారిని కాపాడాలంటూ వేడుకోవడం కన్నీళ్లు తెప్పించింది. అప్పటికే నదిలో మునిగి మృతి చెందారనే వార్తను కుటుంబీకులు జీర్ణించుకోలేక పోయారు. బావను బతికించండంటూ చేసిన ఆర్తనాదాలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. నీళ్లు మింగిండు… తీయుండ్రి అంటూ ఛాతి భాగంలో చేతితో రుద్దారు. గట్టిగా కడుపులో నొక్కి నీళ్లను కక్కించే ప్రయత్నం చేశారు. మృతదేహం కదలికలను చూసి బతికే ఉన్నాడంటూ చివరి ఆశలకు ప్రాణం పోసేందుకు మహిళలు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. కానీ అప్పటికే వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లారనే సంగతి అక్కడున్న వారందరికీ తెలిసినప్పటికీ రక్త సంబంధీకులు, కట్టుకున్న వారు మాత్రం ఏ క్షణంలోనైనా లేచి వస్తారేమో అని ఎదురు చూశారు.
మురిపెంగా పెంచి పెద్ద చేసిన పిల్లలు అర్ధాంతరంగా లోకం వదలి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక భూతల్లిపై పడి మహిళలంతా విలవిల్లాడుతూ రోదించారు. ‘అరె నాని మాట్లాడురా… నేను అమ్మనురా…’ అంటూ మానస తన ఇద్దరు పిల్లలను చూస్తూ రోదించింది. భర్తను పక్కన పెట్టుకుని నేనెట్లా బతకాలి బావా… ఒంటరి చేసి పోతివా? అంటూ దుఃఖసాగరంలో మునిగిపోయింది.
ఇవీ కూడా చదవండి..
ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ ఏదో తెలుసా?
ఆకస్మిక వరదలు.. వేల మంది తరలింపు
జపాన్లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కరోనా పాజిటివ్
బ్రిటన్ ప్రధాని టూర్ : ఏప్రిల్లో చెన్నై రానున్న బొరిస్ జాన్సన్!
ఏప్రిల్ 26న భారత్కు బ్రిటన్ ప్రధాని.. చెన్నైలోనూ పర్యటన!
శ్రీలంక లోయలో పడ్డ బస్సు.. 13 మంది మృతి