న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చెన్నైకి వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు షెడ్యూల్ ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏప్రిల్ 26న బోరిస్ భారత్ చేరుకోనున్నారు. త్వరలోనే యూకే నుంచి బృందాలు ముందస్తుగా చెన్నైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బ్రిగ్జిట్ అనంతర పరిస్థితుల్లో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో యూకే వాణిజ్య అవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ పర్యటనకు సిద్ధమయ్యారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత బోరిస్ తొలి అంతర్జాతీయ పర్యటన ఇదే కానుంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య చర్చలను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జనవరిలోనే భారత పర్యటనకు సిద్ధమవగా.. కరోనా ఉధృతి పెరగడంతో రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్లో బ్రిటన్లోని కార్న్వాల్ ప్రాంతంలో జీ7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదస్సుకు ముందే ఇండియాలో పర్యటించాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారు.