Dalit bandhu | దళితులు, పేదల సంక్షేమం కోసమే ఉన్నామని చెప్పుకొనే బీజేపీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీల నిజస్వరూపం బయటపడింది. నోటికాడి బుక్కను కాలదన్నినట్లు..‘ దళితబంధు ( Dalit bandhu )’ పథకాన్ని దళితులకు అందకుండా హుజూరాబాద్ ఎన్నికల ( Huzurabad elections ) సాకుతో అడ్డుకోవటం గర్హనీయం. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ( TRS )కు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దళితబంధు పథకాన్ని నిలిపేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ( central election commission )కు ఫిర్యాదు చేసి బీజేపీ తన దళిత వ్యతిరేకతను చాటుకున్నది.
నిజానికి తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావం నుంచి అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం వినూ త్న పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్, ఆ క్రమంలోనే దళితబంధు పథకానికి రూపకల్పన చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఊసేలేని కాలంలో దళితబంధు పథకాన్ని తెచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్నది. దానిలో భాగంగానే హుజూరాబాద్లోనూ అమలుచేస్తున్నది. అలాంటప్పుడు ఎన్నికల ప్రయోజనం కోసమే తెచ్చారనటంలో అర్థం లేదు.
‘దళితబంధు’ పథకం ఒక్క హుజూరాబాద్ ఎన్నికల కోసం పుట్టింది కాదు. యావత్ తెలంగాణ దళితుల సమగ్రాభివృద్ధి కోసం పుట్టింది. దళితుల ఆశాకిరణమైన ఈ పథకం ఒక గ్రామంలో మొదలై హుజూరాబాద్ నియోజకవర్గానికి విస్తరించింది. ఇప్పుడు నాలుగు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో ఈ పథకం అమలుకు కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణబద్ధులై ఉండటం ప్రతిపక్షాలకు మింగుడుపడటం లేదు. ‘దళితబంధు’ పథకం అమల్లోకి రాగానే అనేక అపోహలు, అనుమానాలతో దళితుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఎన్నికలు అయిపోగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి తీసుకుంటారని, మిగిలినవారికి ఇవ్వరని, డబ్బులు ఖర్చుపెట్టుకోకుండా షరతులు పెట్టారని, ఎన్నికలయ్యాక ‘దళితబంధు’ను ఎత్తేస్తారంటూ ఆరోపణ లు చేస్తూ లబ్ధిదారులను పక్కదారి పట్టిస్తున్నారు. ఓట్ల కోసం దిగజారి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇలా తప్పుదోవ పట్టించటం ఎంతవరకు సబబు? వీలైతే మంచి సూచనలు, సలహాలివ్వాలి తప్ప, అసత్య ప్రచారాలతో దళిత సమాజంలో భయాందోళనలు రేపొద్దు.
దళితులు ఎన్నో ఏండ్ల నుంచి ఊరికి దూరంగా సామాజిక, ఆర్థిక వివక్షతకు గురవుతున్నారు. వారికి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, వెట్టిచాకిరి, దినసరి కూలీలుగా బతుకుబండి లాగుతున్నారు. అలాంటి దళితజాతిని 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వర కు ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. పేదరికపు కుంపట్లో ఉన్న దళితవర్గాల బతుకులను గాడిలో పెట్టే ఆలోచనలు చేయలేదు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల జీవితాల్లో మార్పు రాలేదు. తరాలుగా వివక్షకు గురైన దళితుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే ‘దళితబంధు’ పథకాన్ని కేసీఆర్ తెచ్చారు.
‘దళిత బంధు’ అమలులో ఓ పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. అన్ని మండలాల్లోని దళిత కుటుంబాల వివరాలను, స్థితిగతులను ప్రత్యేక సర్వేలు చేపట్టి 20,929 మంది, అదేవిధంగా వాసాలమర్రిలో 76 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారు.
‘దళిత బంధు’ లబ్ధిదారులు తమకు అనుభవం ఉన్న రంగాలను ఎంచుకొని యజమానులై ఉపాధి పొందుతూ నలుగురికి పని కల్పిస్తూ ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి దళితజాతి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు లబ్ధిదారుడి భాగస్వామ్యంతో ‘రక్షణ నిధి’ని కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాటుచేసింది. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి అండగా నిలుస్తుంది. ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం, దళితుల అభ్యున్నతి పట్ల ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
దీంతో దళితుల అభివృద్ధికి ఎంత ఖర్చయినా భరిస్తామని, దళితుల్లో భరోసా నింపడం వల్ల రాబోయే రోజుల్లో దళిత సమాజం అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కలిగింది. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన పథకం కాబట్టి అన్నివర్గాల వారు ప్రభుత్వానికి, దళితులకు అండగా నిలువాలి. వారి అభివృద్ధికి సామాజిక సహకారం అందించాలి. అప్పుడే ‘దళితబంధు’ పథకం విజయవంతమవుతుంది. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆశయంతో అమల్లోకి తెచ్చిన పథకంపై ప్రతిపక్షాలు అసత్యఆరోపణలు చేయడం విడ్డూరం. వారి తీరు ‘అమ్మ పెట్టదు- అడుక్కొని తిననీయదు’ అన్న చందంగా ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దళితుల అభివృద్ధి కోసం నయాపైసా ఇవ్వదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మానవత్వంతో దళితుల దారిద్య్రం నుంచి విముక్తి చేయడానికి వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఇవ్వకుండా అడ్డుకోవటం ఆక్షేపణీయం.
కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా అవి అమలు కావని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని అమలుచేసి చూపించారు. ఉదాహరణకు ‘రైతుబంధు’ పథకాన్ని చెప్పుకోవచ్చు. అంబేద్కర్ స్ఫూర్తితో ‘దళిత బంధు’ను కూడా దృఢ సంకల్పంతో అమలు చేస్తున్నారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపుతున్న పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడమంటే దళితులను అవమానించడమే. దళితుల అభివృద్ధిపై వారికి చిత్తశుద్ధి ఉంటే ‘దళితబంధు’ పథకం అమలుకు సహకరించాలి. ఎవరెన్ని విమర్శలు చేసినా లబ్ధిదారులు మాత్రం కేసీఆర్పై అపార నమ్మకంతో ఉన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పి కేసీఆర్కు అండగా నిలవాల్సిన చారిత్రక బాధ్యత దళిత సమాజంపై ఉన్నది.
(వ్యాసకర్త: అధ్యాపకులు అర్థశాస్త్ర విభాగం, కేయూ)
బొల్లికొండ వీరేందర్
98665 35807
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Narendra modi | ప్రజలంటే మోదీకి ఇంత ఈసడింపా?
Gellu Shwetha | క్యాంపస్ టూ కమలాపూర్.. ఉద్యమం కలిపిన సోపతి
Harish Rao | కేసీఆర్నే మోసం చేసిన ఈటల రాజేందర్కు ప్రజలు ఓ లెక్కనా