కమలాపూర్/కమలాపూర్ రూరల్, అక్టోబర్ 19: ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవకాశమిచ్చి రాజకీయ జీవితాన్నిచ్చిన సీఎం కేసీఆర్నే మోసం చేసిన ఈటల రాజేందర్కు ప్రజలు ఓ లెక్కనా అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నా రు. అబద్ధాలు చెప్తూ మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం, ఉప్పల్ గ్రామాల్లో నిర్వహించిన ధూంధాంలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దళితబందు పథకం రాలేదని ఏ ఒక్క దళిత బిడ్డ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరికి మంజూరుచేయించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచితే.. పీఎం మోదీ పేదలను దంచి కార్పొరేట్ పెద్దలకు 10 లక్షల కోట్లు మాఫీ చేసిండని చెప్పారు. బీజేపీ పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి, బట్టకాల్చి మీదేసి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని ఈటల చూస్తున్నాడని విమర్శించారు. గెల్లును గెలిపిస్తే పదిహేను రోజులకోసారి హుజురాబాద్ వస్తానని, మీ స్వంత జాగాలో ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఝూటా మాటలు చెప్తూ ఈటల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మంత్రి హరీశ్రావు విమర్శించారు. గ్యాస్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం రూ.291వసూలు చేస్తున్నదన్న దానిపై చర్చకు పిలిస్తే తోకముడిచారని ఎద్దేవాచేశారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దోస్త్ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందితే, టీఆర్ఎస్పై బట్టకాల్చి మీద వేశాడని మండిప డ్డారు. రైతుబంధు కడుపు నింపదని విమర్శించిన ఈటల.. తాను మాత్రం 10.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ నల్ల చట్టాలను విమర్శించిన ఈటల.. ఇప్పుడు నోరుమెదపట్లేదని, నల్ల చట్టాలు తెల్ల చట్టాలుగా మారాయా అని ప్రశ్నించారు. నెల 30న జరిగే ఉప ఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా గెల్లు ఎన్నికల ఖర్చు కోసం ఉప్పల్కు చెందిన అక్కా చెల్లెల్లు బొమ్మల రిషిత, చిద్విలాసిని తాము పోగు చేసుకున్న రూ.2,016ను విరాళంగా అందించారు.
బీజేపీ నాయకులు ఆపితే దళితబంధు పథకం ఆగుద్దా. మహాఅంటే ఎన్నికలు అయ్యేవరకు ఆగుతది. పది పదిహేను రోజులు ఆలస్యం అవుద్ది. ఎన్నికల కోడ్ ముగియగానే నేనే దగ్గరుండి యూనిట్లను గ్రౌండింగ్ చేయిస్తా.
-మంత్రి హరీశ్రావు