భువనేశ్వర్: ఒక స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల సమయంలో విషాద సంఘటన జరిగింది. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఐరన్ పోల్కు విద్యుత్ వైర్ తగిలింది. దీంతో కరెంట్ షాక్తో టీచర్ మరణించగా, ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. (Teacher killed, students injured) ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్కు చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) ప్రియబ్రత బెహెరా కొందరు విద్యార్థులతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జెండా ఆవిష్కరణ స్టాండ్కు ఐరన్ పైపు అమర్చడానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడు అనుకోకుండా పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్కు అది తగిలింది. ఈ నేపథ్యంలో ఆ టీచర్, ముగ్గురు విద్యార్థులు విద్యుతాఘాతానికి గురయ్యారు.
కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పీఈటీ ప్రియబ్రత బెహెరా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విద్యుతాఘాతం వల్ల గాయపడిన ముగ్గురు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.