తిరుమల : స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో శ్రీవారి భక్తులకు మరింత ఉన్నతంగా సేవలు అందిస్తామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ( EO Venkaiah Chowdary ) తెలిపారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం ( Independence Day ) సందర్భంగా శనివారం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ టీటీడీలో భక్తుల సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత, పారదర్శకత, సమర్థవంతమైన పరిపాలనకు అనేక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు.
తిరుమలలో పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను పెద్దఎత్తున ప్రవేశపెట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం తిరుమలకు 10 వేల నుంచి 14 వేల వరకు వాహనాలు వస్తున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణ అత్యంత అవసరమన్నారు.దాతల సహకారంతో మరో 37 ఎలక్ట్రిక్ బస్సులకు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రానున్న బ్రహ్మోత్సవాలకు సుమారు 25 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
ఎన్ఆర్ఐ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) రెండో దశ కూడా విజయవంతంగా అభివృద్ధి చెందిందని అదనపు ఈవో తెలిపారు. భక్తులు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతసేపు వేచి ఉన్నారు, ప్రతి గంటకు ఎంతమంది చేరుతున్నారు, ఎంతమందికి దర్శనం కల్పిస్తున్నారనే సమాచారాన్ని రియల్టైమ్లో తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. టీటీడీ అన్నప్రసాదాల కోసం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుపతిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కోల్డ్ స్టోరేజ్ తదితర సదుపాయాలతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వేర్హౌస్ ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు.
చరిత్ర, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే తిరుమల
తిరుమలలోని వీధులకు స్వామివారి భక్తులు, ఆల్వార్లు, చారిత్రక వ్యక్తులు, ఆధ్యాత్మిక ప్రముఖుల పేర్లను పెట్టడం ద్వారా తిరుమల ఆధ్యాత్మికతను మరింత పెంచే చర్యలు చేపట్టామని అదనపు ఈవో తెలిపారు. వీరి సేవలు, చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.