స్వానుభవం దండం లేదు.. దస్తకం లేదు.. అయ్యా… బాంచెను.. అసలే లేదు.. మండల్ ఆఫీస్ చుట్టూ తిరిగేది లేదు.. స్లాట్ బుక్ చేసుకొని, సమయానికి పోయి రిజిస్టర్ చేసుకోవడమే.. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అంతా సవ్యంగా జరిగింది. లొల్లి లేదు.. జనం రష్ లేదు.. మేమే ఒకింత లేటు… సిబ్బంది కూడా కూల్గా సౌమ్యంగా పని సాగించారు. 15 రోజులల్ల బెంగళూరులో ఇచ్చిన అడ్రసుకు పాస్బుక్ వచ్చింది. తెలంగాణ ‘ధరణి’తో ఇది నా స్వానుభవం. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫామ్స్కు చక్కని నిదర్శనం. దేశానికి చుక్కాని.
ఉన్న భూములను బాపు మా చదువుల కొరకు, సంసారపు మిగతా అవసరాల కొరకు అమ్మేసిండు. ఎైట్లెనా చేసి సొంత రాష్ట్రంల ఒక్క ఎకరమైనా కొనుక్కోవాలి అని ఒక కోరిక. ‘నువ్వు మళ్లా హన్మకొండకు వచ్చేదా, సచ్చేదా! నీకు ఎందుకురా భూమి?’ అన్నవాళ్లు ఉన్నారు. కొన్ని కోరికలకు జస్టిఫికేషన్ ఉండదు. అదో ఆర్తి. నా విషయంలో భూమి అంతే. కానీ హన్మకొండకు 15 కి.మీ. చుట్టూ కొనే ఔకాత్ లేదు. ఎంత చెట్టుకు అంత గాలి.. పిండి కొద్దీ రొట్టె.. చెద్దరు ఎంత ఉంటె కాలు అంతే జాపుకొవాలి అనే తీరులో వెతికితే 28 కిలోమీటర్ల దూరంల దొరికింది. కొనుకున్న.. కోరిక తీరింది.. సంతృప్తి.
అయితే ధరణి లేకుంటే ధైర్యం చేసే వాణ్ని కాదు. రిటైర్మెంట్ డబ్బులు తీసే ధైర్యం చెయ్యకపోదును. ఎన్నో చోట్ల చూసినం. ఒక చోటైతే అడ్వాన్స్ ఇవ్వడానికి తయారైన. అయితే దాని గురించి లీగల్ ఇష్యూ ఉన్నది అని ధరణిలోనే చదివి వెనక్కు తగ్గిన. ఇట్ల ధరిణిల అన్ని రికార్డులు వెతుక్కోవచ్చు. పాసుబుక్ కాపీ రిజిస్ట్రేషన్ వెంటనే ఇచ్చిన్రు.. అసలు పాసుబుక్ పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చింది. ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్గా, ఇదొక అద్భుతం అని చెప్పక తప్పదు.
భూమి యాజమాన్యం, పంపిణీ, దాని ఉపయోగం, ఒక ఆస్తిగా దాని ఉత్పాదకత.. దీని మీద ఎంత చర్చన్నా చెయ్యొచ్చు. కానీ, ఆ ఆస్తి చుట్టూ జరిగే లావాదేవీలను సులువుగా మార్చే విషయానికొచ్చినప్పుడు ఈ చర్చలన్నింటినీ పక్కనపెట్టొచ్చు. నా వరకు ఇదే నిజమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆస్తుల బదిలీ, కొనుగోలు-అమ్మకాల లావాదేవీలు ఎంత సులువుగ ఉంటే అంతగ పెరుగుతయి. అంతేకాదు ఆస్తుల విలువ కూడా పెరుగుతది. సింపుల్గా చెప్పాల్నంటే ఇది మైక్రో ఎకనామిక్ ప్రిన్సిపుల్ . తెలంగాణల వ్యవసాయ భూముల విలువ పెరిగేతందుకు నీళ్లు, కరెంటు విస్తారంగా అందుబాటులోకి వచ్చుడు ఎంత కారణమో.. ఈజ్ ఆఫ్ డూయింగ్ ట్రాన్శాంక్షన్స్ (లావాదేవీలు) కూడా అంత కారణం. ధరణి తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి భూముల రిజిస్ట్రేషన్ మీద రూ.1500 కోట్ల ఆదాయం లభించిందని నేను చదివిన. దాని అర్థం ఏమిటి? రిజిస్ట్రేషన్ చార్జీ కింద భూమి అధికారిక విలువల ఆరు శాతం వసూలు చేస్తున్నరు. ఈ లెక్కన రూ.1500 కోట్ల ఆదాయం లభించిందంటే.. రూ.25 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగి ఉండాలె. ఇది ప్రభుత్వ విలువ ప్రకారం. మార్కెట్ రేటు లెక్కన చూస్తే.. కనీసం రెండు మూడు రెట్లు ఎక్కువ ఉంటది. అంటే, అంతమొత్తం డబ్బు జనం చేతులు మారుతూ వినియోగం, పొదుపు, పెట్టుబడి తదితర రూపాలల్ల తెలంగాణల చెలామణిల ఉంది. డబ్బు వినియోగం అవుతున్నదంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరింత ఆదాయం లభిస్తున్నట్లే. ఈ దార్శనికత కారణంగనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన రైతుబంధు, దళితబంధు వంటి భారీ పథకాలను ధైర్యంగా ప్రారంభించి అమలు చేయగలుగుతున్నరని నేను అనుకుంటూ ఉంటా.
పట్టణ, వక్ఫ్, పోడు భూములను ధరణి కిందికి ప్రభుత్వం తీసుకురావల్సి ఉన్నది. పట్టణ, వక్ఫ్ భూములకు చాలా విలువ ఉంటది. వాటిని ధరణి కిందికి తీసుకొస్తే తెలంగాణ స్థానిక ఆర్థికవ్యవస్థలో నగదు లావాదేవీలు స్థిరంగా కొనసాగుతయి. ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతది.
నా వరకైతే.. ఒక చిన్నపాటి వ్యవసాయ భూమి కొనుగోలుదారునిగా నా అనుభవం ఏందో చెప్పమంటే.. అద్భుతం (absolutely TOP NOTCH) అని చెప్త. తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలించినవాడిగా, తెలంగాణ మేలును నిండు మనస్సుతో కోరుకునే వ్యక్తిగా ధరణిని ఒక మార్గనిర్దేశక భూ సంస్కరణగా నేను వేనోళ్ల పొగడుతా.
Hats off to KCR !! Hats off to Telangana Govt and Telangana Administration!!
-మంగళపల్లి విశ్వేశ్వర్