ఖమ్మం రూరల్, మే 25 : పంట పొలాల్లో అదును, పదును చూసి విత్తనాలను విత్తుకోవాలని ఏవో వీ నాగేశ్వరరావు రైతులకు సూచించారు. శనివారం మండలంలోని గుర్రాలపాడు, బారుగూడెం, పోలెపల్లి, కాచిరాజుగూడెం, కస్నాతండ, కొండాపురం గ్రామాలలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.
పొడి దుక్కులలో విత్తనాలు విత్తుకోవద్దన్నారు. లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని, బిల్లులు తప్పకుండా తీసుకోవాలన్నారు. కాలం చెల్లిన విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా తల్లంపాడులోని పురుగుమందుల షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
కూసుమంచి, మే 25 : మండలంలో వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే శనివారం మండలంలోని గోరీలపాడుతండ, రాజుపేట బంజర గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో ఆర్.వాణి రైతులకు అవగాహన కల్పించారు. మరికొద్ది రోజుల్లో వానకాలం సీజన్ పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి దుక్కులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రైతులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
8
ముదిగొండ, మే 25 : విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రత్తలు పాటించాలని ఏవో రాధ అన్నారు. మండలంలోని గోకినేపల్లిలో శనివారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుర్తింపు పొందిన దుఖానాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. సూదూర ప్రాంతంలో ఉన్న షాపుల్లో, ఆన్లైన్లో విత్తనాలు కొనుగోలు చేస్తే సమస్యలు ఉత్పన్నమవుతాయని, కేసులు నమోదు చేయడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, అనుమానాలు ఉంటే ఏఈవోను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవో మౌనిక తదితరులు పాల్గొన్నారు.
కారేపల్లి, మే 23: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం విజయనిర్మల విత్తన షాపు యజమానులను హెచ్చరించారు. శనివారం కారేపల్లిలోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయశాఖ అధికారి కే ఉమామహేశ్వర్రెడ్డితో కలిసి తనిఖీలు చేపట్టారు. షాపుల్లోని రికార్డులను పరిశీలించారు. నిల్వ ఉన్న సరుకు వివరాలను ప్రతీ రోజు నోటీస్బోర్డుపై అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా నాణ్యమైన విత్తనాలను నిర్ణీత ధరలకు అమ్మాలన్నారు. ప్రతి కొనగోలుదారులకు రసీదులు ఇవ్వాలన్నారు. అనుమతులు లేని బీజీ 3 విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పెనుబల్లి, మే 25: పెనుబల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, కారాయిగూడెంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఉల్లోజు నర్సింహారావు ఆధ్వర్యంలో రైతులకు సబ్సీడీపై పచ్చిరొట్ట విత్తనాలను శనివారం పంపిణీ చేశారు. జీలుగులు 30 కేజీలు రూ.1116, జనుము 40 కేజీలు రూ.1448 లకు అందజేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రసాదరాజు, ఏఈవోలు పాల్గొన్నారు.