రామాయంపేట, మే 25: వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకుడు గజవాడ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేసిన ఘటన రామాయంపేట పట్టణంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజుకు కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేశ్కు కొంతకాలంగా భూమి విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పట్టణంలోని పెద్దమనుషుల సమక్షంలో ఓ ఆలయం వద్ద మాట్లాడుతుండగా మధ్యలో 5 లీటర్ల పెట్రోల్ డబ్బాతో వచ్చి నాగరాజుపై దాడికి దిగడమే గాకుండా ఒంటిపై పెట్రోల్ పోశాడు.
అక్కడే ఉన్నవారు విషయం గ్రహించి వెంటనే పోచమ్మల గణేశ్ను పక్కకు తోసేశారు. దీంతో గజవాడ నాగరాజు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి దవాఖానలో చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ బెదిరింపులతో నిలువరించలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజుపై కాంగ్రెస్ నాయకుడు పోచమ్మల గణేశ్ దాడిచేసిన విషయం తెలుసుకున్న హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఇలాగే ఉంటే ప్రతిదాడులు ఉంటాయన్నారు.
కాంగ్రెస్ అండ చూసుకుని బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగడం మానుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నియోజక వర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ యాదగిరి హెచ్చరించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న నాగరాజును పరామర్శించారు.
పెట్రోల్ దాడికి గురైన కౌన్సిలర్ గజవాడ నాగరాజును మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పరామర్శించారు. కాంగ్రెస్ దాడులను ఇకపై సహించేది లేదన్నారు. సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి గానీ వ్యక్తిగత కక్షలతో, పార్టీ పేరుతో దాడులు చేయడం సరికాదన్నారు.