హనుమకొండ చౌరస్తా, మే 25 : ప్రతిపక్షం నుంచి ప్రశ్నించే నాయకుడిని మండలికి పంపిస్తే నిరుద్యోగులు, యువత సమస్యలపై కొట్లాడుతానని నల్గొండ-వరంగల్-ఖమ్మం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారెవరో, ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నవారెవరో విద్యావంతులు, మేధావులు గ్రహించి ఓటువేయాలని ఆయన కోరారు. శనివారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో విద్యావంతులు, మేధావులు భవిష్యత్ గురించి ఆలోచించి తీర్పునివ్వాల్సి ఉంటుందన్నారు. జీవో46పై మడమ తిప్పని పోరాటం చేస్తానని, ఇప్పుడే హైకోర్టుకు పిల్పై పిటిషన్ వేసి పంపినట్లు చెప్పారు.
కాంగ్రెస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేసిందని, అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరాడుతానన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలంటే మేధావులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల సభ నిర్వహించామని, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ఇతర శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతి కార్యకర్త 12 రోజులు క్షేత్రస్థాయిలో పనిచేశారన్నారు. మంచి చేసేవారెవరో? చెడు చేసే వారెవరో గమనించాలని కోరారు.
దేశంలో చట్టసభలకు సంబంధించి ఒక సంప్రదాయం ఉందని, గొప్ప గొప్ప మేధావులు వెళ్లారని ఇప్పుడు ద్రోహులు, బ్లాక్ మెయిలర్లు పోటీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా ఉద్యోగులు పనిచేయాలన్నా, ప్రశాంతంగా ఎవరి వ్యాపారాలు వారు చేసుకోవాలన్నా మేధావులు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారెవరో, ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నవారెవరో గ్రహించాలన్నారు. తాను రైతు బిడ్డనేనని అమెరికాలో ఏడేళ్లు పనిచేసి పుట్టినగడ్డ రుణం తీర్చుకునేందుకు సేవ చేయాలని తిరిగివచ్చానని చెప్పారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వదించి పంపిన ఏనుగుల రాకేశ్రెడ్డిని గ్రాడ్యుయేట్లు, మేధావులు గెలిపించాలి. పెద్దల సభలో కచ్చితంగా ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి. కాంగ్రెస్ను ప్రశంసించే వ్యక్తి కాకుండా హక్కుల కోసం కొట్లాడే రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, వరంగల్ లోక్సభ అభ్యర్థి మారపెల్లి సుధీర్కుమార్, మాజీ చైర్మన్లు సర్దార్ రవీందర్సింగ్, వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు జెట్టి రాజేందర్, బైరపాక ప్రశాంత్, కొమురయ్య, పిన్నింటి విజయ్కుమార్, బీఆర్ఎస్ నాయకుడు చాగంటి రమేశ్ పాల్గొన్నారు.
– హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్