తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు.రాష్ట్ర శాసనసభలోని సుమారుగా మూడింట ఒక వంతు అంటే 34 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోరు ఇంకా మిగిలే ఉండటమే అందుకు కారణం.
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ ఉప ఎన్నిక బరిలో ఉన్నప్పటికీ అసలైన పోరు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మధ్యేనన్నది జగమెరిగిన సత్యం. ఐదు నెలల తమ పాలననే రెఫరెండమని పేర్కొంటూ పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పును కోరిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ పాత పాటే పాడుతున్నది. గులాబీ కంచుకోటను కైవసం చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఓ గాడిదలా తీన్మార్ మల్లన్న ప్రచార భారమంతా మోస్తున్నది. 2021లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అప్పటి కేసీఆర్ సర్కార్ను లక్ష్యంగా చేసుకొని ముప్పేట దాడి చేస్తూ.. ప్రశ్నించే గొంతుక పేరిట విషం చిమ్మిన మల్లన్నను పట్టభద్రులు ఆనాడే తిరస్కరించారు.
పెద్దల సభ గౌరవాన్ని తగ్గించే కుట్రకు కాంగ్రెస్ తెరలేపింది. ‘నేను ఇచ్చిందే నినాదం.. నేను చెప్పిందే విధానం’ అంటూ నయా నయింగా చెలామణి అవుతున్న స్వయం ప్రకటిత మేధా వి మల్లన్నకు టిక్కెట్ కేటాయించి పెద్దల సభ గౌరవాన్ని ఆ పార్టీ మంట కలిపింది. తులసి వనంలోకి గంజాయి మొక్కను పంపాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు బుద్ధిచెప్పాలి.
పెద్దల సభకు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. వివిధ రంగాలకు చెందిన మేధావులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో రాజ్యసభను, రాష్ట్ర అసెంబ్లీల లో శాసనమండలిని రాజ్యాంగకర్తలు ఏర్పాటుచేశారు. అం దుకనుగుణంగా గతంలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, కపిలవాయి దిలీప్ కుమార్, రామచందర్రావు లాంటి మేధావులు శాసనమండలికి ప్రాతినిధ్యం వహించారు. కానీ, గొప్ప ఆశయంతో ఏర్పాటైన ఈ సభలు రాజకీయ పార్టీలకు పునరావాస కేంద్రాలుగా మారిపోతుండటం శోచనీ యం. ఎందరో మహానుభావులు అడుగిడిన సభకు ఒక యూ ట్యూబ్ చానల్ ద్వారా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడే వ్యక్తిని కాంగ్రెస్ పోటీలో నిలిపి ఈ విష సంస్కృతిని మరింత ముందుకుతీసుకెళ్లాలని చూస్తున్నది. పట్టభద్రులైన మేధావు లు విజ్ఞతను ప్రదర్శించాలి. పెద్దల సభకు గద్దలను రానీయకుండా అడ్డుకోవాలి.
‘నిజం గడపదాటేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది’ అని పెద్దలంటారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్పై వ్యక్తిగతంగా దాడిచేసిన తీన్మార్ మల్లన్న సరిగ్గా అదే పని చేశా రు. విష ప్రచారం చేస్తూ నాటి సంక్షేమ సర్కార్పై బురదజల్లారు. ఆ అబద్ధపు ప్రచారాలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ప్రజలను కష్టాలపాలు చేసింది. ప్రశ్నించే గొంతుకగా చెలామణిలో ఉన్న మల్లన్న ఏ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండో పట్టభద్రులు ఆలోచించాలి. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్, పరీక్ష ఫీజు లేకుండా దరఖాస్తుల స్వీకరణ, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా, గురుకుల ఉద్యోగార్థుల సమస్యల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న విషయాన్ని పట్టభద్ర సోదరులు పరిగణన లోకి తీసుకోవాలి.
ప్రశ్నించడం పక్కనపెడితే తన యూట్యూబ్ చానల్ ద్వారా రైతులపై తీన్మార్ మల్లన్న అక్కసు వెళ్లగక్కారు. ‘రైతుబంధు వేయలేదని ఎవరైనా అడిగితే చెప్పుతో కొడతా’ అని అన్నదాతలను అవమానించారు. అలాంటి వ్యక్తి పట్టభద్రుల ఎమ్మెల్సీగా అర్హుడా? యూట్యూబ్ చానల్ వీక్షణల కోసం బాధిత వర్గాల కష్టాలను ఆసరాగా చేసుకుని అంగీలాగు సిద్ధాంతం నుంచి విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి ఎలా ఎదిగారనేది పట్టభద్రులు, మేధావులకు ఎప్పుడో అవగతమైంది.
ఇది గ్రహించిన మల్లన్న ‘ఓటేసి గెలిపిస్తే ఎమ్మెల్సీగా శాసనమండలికి పోతా.. ఓడిస్తే శ్మశానానికి పోత’నని బ్లాక్మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టాడు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్న మల్లన్న అవకాశవాదాన్ని తిప్పికొట్టాలి. ‘ఎమ్మెల్సీగా గెలిపిస్తే నా గౌరవ వేతనంతో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తా’నని చెప్తున్న ఉన్నత విద్యావంతుడు, రైతు బిడ్డ ఏనుగుల రాకేష్రెడ్డికి పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాజకీయ అవసరాలకు తెలంగాణను వాడుకుంటాయే తప్ప రాష్ర్టాన్ని బాగుచేయవు. ఆ పార్టీలకు తెలంగాణ పట్ల ప్రత్యేకమైన అభిమానం ఏమీ ఉండదు. బీఆర్ఎస్, తెలంగాణది పేగు బంధం. అందుకే తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని, సమస్యలను పరిష్కరించేవారినే ఎన్నుకుందాం. పట్టభద్రులుగా విజ్ఞతను చాటుకుందాం.
పిన్నింటి విజయ్కుమార్
90520 39109