విశ్వవిద్యాలయ ఆచార్యులలో మహా మహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి (1943-2023) విలక్షణ పాండిత్య సముపార్జితులు. పాణినీయ అష్టాధ్యాయి లాంటి కఠిన వ్యాకరణ గ్రంథానికి దాదాపు 2 వేల పేజీలలో వ్యాఖ్యానం సమకూర్చి వ్యాకరణాధ్యయనాన్ని సులభతరం చేసిన వైయాకరణి. మూడు పదుల వయసులోనే వ్యాకరణ పదకోశ నిర్మాణం చేయడం అసామాన్యం.
శ్రీహరి నిఘంటువు, సంకేత పదకోశం, అన్నమయ్య పదకోశం, నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం లాంటి విశేష నిఘంటు నిర్మాణాలతో తమ అసాధారణ పాండితీగరిమను ప్రదర్శించిన సాహితీమూర్తి ఆచార్య రవ్వా శ్రీహరి. వారి సంస్కృతాంధ్ర సాహిత్యాధ్యయనం చాలా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. నాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా మొత్తానికి ఉన్నత పాఠశాలలు మూడు మాత్రమే ఉండేవి. చదువుకోవడమే అపురూపమైన ఆ రోజుల్లో ఉర్దూ మీడియం పాఠశాలలే ఎక్కువగా ఉండేవి. తెలుగు మీడియం పాఠశాలలు అప్పుడప్పుడే ఏర్పాటవుతున్నాయి. ఆ పరిస్థితిలో నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన శ్రీహరి.. ఉచిత భోజన వసతి లభిస్తుందన్న ఆశతో యాదగిరిగుట్టలోని సంస్కృత పాఠశాలలో చేరారు. నాడు వారి కుటుంబంలో గానీ, బంధువర్గంలో గానీ పెద్దగా చదువుకున్నవారు లేరు. సంస్కృతం నేర్చుకోవాలన్న భావన ఊహకందని విషయం. పదేండ్ల పసిప్రాయంలో ఉన్నప్పుడే మాతృమూర్తి రవ్వా వెంకట నరసమ్మ అనంత లోకాలకు వెళ్లిపోవడంతో దిక్కుతోచని ఆ స్థితిలో యాదగిరీశుడే దిక్కయ్యాడు.
ఆ పసి వయసులో మూడు నెలల్లో కొన్ని శబ్దాలు, ధాతువులు నేర్పి, పరీక్ష పెట్టడం, ఉత్తీర్ణత సాధించకపోతే ఇంటికి పంపిస్తామని చెప్పగా.. అప్పటివరకు నేర్పిన శబ్దాలను నిత్య సాధన చేసి అక్కడే చదువుకోవడానికి స్థిరమైన అవకాశాన్ని పొందిన ప్రతిభాశాలి శ్రీహరి. నాడు సంస్కృతం నేర్పిన అధ్యాపకుల చలవ వల్లనో, చదువుకోకపోతే ఇంటికి వెళ్లి కులవృత్తిలో మగ్గిపోవలసి వస్తుందన్న భయం వల్లనో, చదువుకోవడం వల్లనే చనిపోయిన తల్లి సంతోషపడుతుందన్న స్మరణ వల్లనో గానీ శ్రీహరికి చదువే జీవితమైంది. నాంపల్లి సీతారాంబాగ్లోని సంస్కృత కళాశాలలో చేరిన నాటి నుంచి బీవోఎల్ పూర్తయ్యేంత వరకు సంస్కృతాధ్యయనం నిత్య ధ్యానమైంది. ఒకవైపు చదువుకుంటూనే సంస్కృ తం ట్యూషన్ చెప్పేవారు. తద్వారా ఆర్థిక కష్టాల నుంచి కొంతవరకు గట్కెక్కారు. అనంతరం వివేకవర్ధని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన ప్రస్థా నం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తులో కొంతకాలం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయా ల్లో ఆచార్యులుగా ఉద్యోగ ప్రస్థానం కొనసాగింది. అధ్యాపకుడిగా కొనసాగడం ఆయన జీవితంలో ఒక పార్శ్వం మాత్రమే. నిత్య పరిశోధకుడిగా, అనువాదకుడిగా, నిఘంటుకర్తగా శ్రీహరి చేసిన కృషి ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చింది.
నిరంతరం సంస్కృత అధ్యయన అధ్యాపనాల్లో జీవించే పండితులకు మాండలిక పదాలపై మనసు పోవడం చాలా అరుదు. వ్యాకరణం, తర్కం, మీమాంస లాంటి అంశాల ను అధ్యయనం చేసేవారికి కావ్యాధ్యాయనమే చాలా అల్పమైంది. అందులోనూ మాండలిక పదాలను గురించిన అంశం గాని, అటువంటి పదకోశాలను రూపొందించడం గాని గౌరవప్రదమైనది కాదు. అటువంటి స్థితికి భిన్నంగా నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం రూపొందించి సామాన్య ప్రజానీకం ఉపయోగించే పదజాలం పట్ల అచంచలమైన గౌరవాన్ని ఆయన ప్రదర్శించారు.
భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలన అనే అంశంపై ఆచార్య బిరుదురాజు రామరాజు వద్ద శ్రీహరి పీహెచ్డీ చేశారు. 70వ దశకం నాటికి భాస్కర రామాయణానికి సంబంధించిన అనేక తాళపత్ర గ్రంథాలను, ముద్రిత ప్రతులను పరిశీలించి సిద్ధాంత వ్యాసరచన చేశారు. ఆ నాటి కి విశ్వవిద్యాలయాల్లో ఆయా సాహితీ ప్రక్రియలోని పరిణామాలను అధ్యయనం చేసే సంప్రదా యం కొనసాగుతున్న కాలంలో రామాయణంపై పరిశోధన జరిపి పీహెచ్డీ పొందారు. వారి గురువు ఆచార్య బిరుదురాజు రామరాజు ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఆ వృత్తికి విశిష్ట గౌరవాన్ని కల్పించారు. అనేక కావ్యాలను పరిశీలించి కవులు ఎటువంటి మాండలిక పదాలను తమ కావ్యాల్లో ఉపయోగించారో ప్రాచీన కావ్యాలను పరిశీలించి వాటిలోని విశేషాలను అందించారు. పాండురంగ మహత్యం కావ్యంలో ఏతులబోవు అనే శబ్దం ఉపయోగించారని మనం ఊహించలేం. ఆయన ప్రయోగం చూపించేంతవరకు ‘ఏతులబోవుచున్ విరుగునిప్పటి మంత్రుల’ అనే పద్యపాదం గుర్తించడం ఎంత కష్టం. అలాగే ‘పెండ ఎత్తునట్టి ముండకిచ్చి’ అనే భావనను సింహాసన ద్వాత్రింశికా కర్త ప్రయోగించాడని మనం ఊహించడం సాధ్యం కాదు. ఎన్నెన్నో మాండలిక పదాలను పూర్వ కవులు ఉపయోగించారని, అందువల్ల అన్ని శబ్దాలకు కావ్య ప్రయోగార్హత ఉందని, ఏ శబ్దాన్ని నీచ శబ్దంగా పరిగణించడానికి వీల్లేదని విశదపరిచారు. ఇటువంటి పరిశోధనా వ్యసని కావ్యానువాదశీలి కావడం అత్యంత అరుదు.
వేమన పద్యాలను, ధర్మపురి శేషప్ప కవి నరసింహ శతకాన్ని, సినారె ప్రపంచ పదులను శ్రీహ రి సంస్కృతీకరించారు. జాషువా ఫిరదౌసి కావ్యా న్ని, గబ్బిలాన్ని సంస్కృతీకరించి అంటరాని వ్యక్తి ఆవేదనను అమర భాషలో వినిపిస్తే తప్ప అమరులకు అర్థం కాదని గబ్బిలాన్ని ‘తైలపాయికా’ చేశారు.
‘నరుని కష్టపెట్టి నారాయణుని గొలుచు’ అన్న పద్యాన్ని ఇలా అనువదించారు…మానవం ప్రబాధ్య మాధవం త్వర్చద్భిరాస్థితే తు ధర్మభాగ్బిరిహ చ భూతలే క్షమా పదం న్యస్తుమేకైవ తైలపాయికా దివం ప్రయాతి జాషువా ఈ పద్యాన్ని ఆటవెలదిలో రచిస్తే అదే ఛందంలో సంస్కృతీకరించారు శ్రీహరి.
సంస్కృతంలో లేనివైనా అచ్చతెనుగు ఆటవెలది, తేటగీతి సీస పద్యాలను సంస్కృతీకరించి తమ ప్రయోగ దక్షతను ప్రదర్శించారు. అధ్యయన అధ్యాపనలకు భిన్నంగా శాఖ అధ్యక్షులుగా, ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా స్వచ్ఛమైన పరిపాలన అందించారు. పాలనాపరమైన బాధ్యతలు ఎన్ని నిర్వహించినా అధ్యాపనమే గొప్ప ఆనందంగా భావించి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా ఉన్న కాలంలో కూడా వ్యాకరణం బోధించిన ఉత్తమ అధ్యాపకులు. జీవన చరమాంకంలో కూడా పరిశోధనాశీలంతో తూము రామదాస కవి పద్య నిఘంటువుకు అకారాద్యనుక్రమణిక సంతరించిన నిత్య చైతన్యశీలి శ్రీహరి.
అటువంటి విశిష్ట సాహితీ మూర్తి ప్రథమ వర్ధంతి సందర్భంగా మిత్రులు, శిష్యులు, సాహితీ ప్రియు లు, కుటుంబ సభ్యులు కలిసి ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేశారు. సంస్కృతాంధ్రాలలో విశేష కృషి చేసిన సాహితీవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు అందించాలన్న సంకల్పంతో, ఆ రంగాలలో సేవలందించిన ఆచార్య శలాక రఘునాథ శర్మకు, బహు భాషలు నేర్చి తెలంగాణ నిఘంటువును కూర్చి, కావ్య సృజనలో తమదైన ముద్రవేసిన నలిమెల భాస్కర్కు పురస్కారాలు అందిస్తున్నందుకు ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఆనందిస్తున్నది. సంస్కృతం నేర్చుకుంటున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందిస్తున్నది.
పురస్కార ప్రదానోత్సవం
ఆచార్య రవ్వా శ్రీహరి సంస్కృతాంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26న ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వా శ్రీహరి జీవన సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం జరుగనున్నది. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ కె.యాదగిరి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. డాక్టర్ కొండలరావు వెల్చాల, కె.రామచంద్రమూర్తి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆచార్య ఎ.రాములు, డాక్టర్ రంగాచార్య, డాక్టర్ కె.శ్రీనివాస్, డాక్టర్ భాగవతం రామారావు, రవ్వా రమేశ్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. పురస్కార గ్రహీతలు ప్రముఖ సంస్కృత పండితులు ఆచార్య శలాక రఘునాథ శర్మకు, ప్రముఖ తెలుగు భాషా సాహిత్య పరిశోధకులు డాక్టర్ నలిమెల భాస్కర్లకు రూ.50 వేల చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. దాంతో పాటు సంస్కృత అధ్యయనంలో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.1,116 చొప్పున ప్రతిభా పురస్కారాలు అందిస్తారు. తూము రామదాస కవి ఆంధ్రపదనిధానానికి ఆచార్య రవ్వా శ్రీహరి అకారాద్యనుక్రమణికలో రూపొందించిన నిఘంటువు ఆవిష్కరణ జరుగుతుంది.
– డాక్టర్ అప్పం పాండయ్య
-ఆచార్య పిల్లలమర్రి
శ్రీరాములు