రెండు సమాన గీతల్లో ఒకదాన్ని సగం చెరిపేస్తే.. రెండోది ఏమీ చేయకుండానే పెద్ద గీత అయిపోతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారటం కూడా అచ్చం అలాగే జరిగింది. ఐదో స్థానంలో ఉన్న బ్రిటన్.. కిందికి పడిపోవటంతో, ఆ స్థానాన్ని భారత్ భర్తీ చేసిందే కాని.. భారీగా వృద్ధి సాధించి ఆ స్థాయికి చేరలేదని అనేక ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థల గణాంకాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) పెరగటం అంటే పది మంది ఆస్తులు పెరగటం కాదని, ఆ దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో గుణాత్మక మార్పు రావటమని గుర్తుచేస్తున్నాయి.
బ్రిటన్ను దాటి ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినట్టు అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘బ్లూమ్బర్గ్’ ఇటీవల ప్రకటించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ నుంచి సేకరించిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లుగా, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ఆ మరుక్షణం నుంచే బీజేపీ అనుకూల మీడియా రెచ్చిపోయింది. బ్లూమ్బర్గ్ నివేదిక గురించి తమ పతాక శీర్షికల్లో ఊదరగొట్టింది. దేశంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతున్నదని కమలదళం బాకా ఊదింది. ప్రధాని మోదీ ఏకంగా మరో అడుగు ముందుకేసి.. ఇది అసాధారణ విజయమని పేర్కొన్నారు. ఇదంతా తమ ప్రభుత్వ ఘనతేనని జబ్బలు చరుచుకొన్నారు. కానీ, వారం తిరక్కుండానే సీన్ తిరగబడింది. అసలు విషయాన్ని వెల్లడిస్తూ స్వయంగా ‘బ్లూమ్బర్గ్’ సంస్థే మరో నివేదికను విడుదల చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 13.5 శాతానికే పరిమితమైందని, రిజర్వు బ్యాంక్ అంచనా (16.2 శాతం) కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదికలో స్పష్టం చేసింది. నిజానికి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో పరుగులు తీయడం లేదని, డాలర్తో పౌండ్ మారకం విలువ భారీగా పతనమై బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం తగ్గడం వల్లనే భారత్కు ఐదో ర్యాంకు లభించిందని పరోక్షంగా తేల్చింది. యాదృచ్ఛికంగా దక్కిన ఈ ర్యాంకులో భారత్ ఎంతో కాలం నిలవకపోవచ్చని ‘బ్లూమ్బర్గ్’ సందేహం వ్యక్తం చేసింది.
అందుకే ముందుకు..
అంతర్జాతీయ కరెన్సీగా చెలామణి అవుతున్న అమెరికన్ డాలర్ను ప్రామాణికంగా తీసుకొని ‘బ్లూమ్బర్గ్’ ఈ నివేదికను రూపొందించింది. అంటే.. డాలర్తో బ్రిటన్ కరెన్సీ పౌండ్, భారత కరెన్సీ రూపాయి మారకం విలువలో వచ్చిన మార్పును ప్రాతిపదికగా చేసుకొని ఈ నివేదికను వెలువరించింది.
ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్1 మధ్యకాలంలో డాలర్తో పౌండ్ మారకం విలువ 17.1 శాతం, రూపాయి మారకం విలువ 7.02 శాతం పతనమైంది. అంటే.. రూపాయి కంటే పౌండ్ విలువ 10.08% ఎక్కువ క్షీణించింది.
ఈ విషయం ఆధారంగానే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని లెక్కగట్టామని, అందుకే భారత్ కంటే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం తగ్గిందని ‘బ్లూమ్బర్గ్’ స్పష్టం చేసింది.
అయితే, కరెన్సీ మారకం విలువల్లో వచ్చే మార్పులను ప్రామాణికంగా తీసుకొని దేశాల ఆర్థిక పరిమాణాలను లెక్కగట్టడటం సరికాదని, ప్రజల కొనుగోలు శక్తిని ప్రాతిపదికగా తీసుకొని గణిస్తేనే కచ్చితమైన లెక్కలు వస్తాయని ఆర్థిక నిపుణులతోపాటు ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది. ఉదాహరణకు.. అమెరికాలో డజను గుడ్లు కొనాలంటే రెండు డాలర్లు ఖర్చు చేయాలి. కానీ.. భూటాన్, వియత్నాం, భారత్లలో రూ.60కే (0.75 డాలర్లకే) డజను గుడ్లు వస్తాయి. దీన్నిబట్టి కరెన్సీల అసలు విలువను, వస్తు-కొనుగోళ్లను ఆధారంగా చేసుకొని దేశ ఆర్థిక వ్యవస్థల పరిమాణాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
అలా జరిగితే, మళ్లీ కథ మొదటికి..
కరోనా కారణంగా ఆర్థికంగా కుదేలైన దేశాల్లో బ్రిటన్ ఒకటి. అనంతరం దేశంలో ఏర్పడిన రాజకీయ అస్థిరత ఆ దేశాన్ని మరింతగా దెబ్బతీసింది. దీనికి తోడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఐరోపా దేశాలపై రష్యా ఆంక్షలు, ఆర్థిక మాంద్యంపై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలు బ్రిటన్ను కోలుకోలేని విధంగా ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ కారణాల వల్లే బ్రిటన్ ఆర్థిక ప్రగతి మందగించింది. ఇదే సమయంలో బ్రిటన్తో పోలిస్తే భారత్లో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉండటం వల్లే ప్రపంచ ర్యాంకుల్లో భారత్ సాంకేతికంగా ఐదో స్థానానికి చేరింది. ఒకవేళ, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడితే ఈ ర్యాంకులు తారుమారై బ్రిటన్ మళ్లీ ఐదో ర్యాంకుకు చేరుకోవచ్చన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి గత మూడేండ్లలో భారత జీడీపీ వృద్ధిరేటు 3 నుంచి 4 శాతంలోపే ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మన జీడీపీ వాస్తవిక వృద్ధి రేటు 7 శాతానికి చేరకపోవచ్చని, అయినా మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరిగిందని భ్రమించడం హాస్యాస్పదమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి బలంగా మారడం, వస్తు ఉత్పత్తి, సేవల్లో వృద్ధి, దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరగడంతోపాటు ప్రజల జీవన ప్రమాణాలు, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో పురోగతి సాధిస్తేనే భారత్ బలమైన ఆర్థికశక్తిగా ఎదగగలదని, అంతే తప్ప ఇతర దేశాల ఆర్థిక పరిమాణాల్లో హెచ్చుతగ్గుల వల్ల కాకతాళీయంగా వచ్చే ర్యాంకులు ఎక్కువకాలం నిలబడబోవని ఆర్థిక నిపుణులు తేల్చిచెప్తున్నారు.
‘సూపర్ రిచ్’ మేడిపండు
దేశంలో కొవిడ్ ప్రబలిన (మార్చి 2020 నుంచి నవంబరు 2021 మధ్య కాలం) తర్వాత ప్రజల ఆదాయం తీవ్రంగా పడిపోయింది. ఇందుకు భిన్నంగా సంపన్నులు, కార్పొరేట్ల ఆదాయం ఊహకందనంతగా పెరిగిపోయింది. కొవిడ్ కాలంలో దేశంలోని బిలియనీర్ల సంపద విలువ రూ.23.14 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ.53.16 లక్షల కోట్లకు పెరిగింది. అదే సమయంలో 4.06 కోట్ల మంది భారతీయులు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి జారుకున్నారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం కొవిడ్ ప్రబలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి జారుకున్న వారిలో సగం మంది భారతీయులే ఉన్నారు. సూపర్ రిచ్ అవుతున్న భారత దేశంలో ఏ దేశంలో లేనంతమంది పేదలెందుకు ఉన్నారు? సంపదలోనే కాదు పేదల సంఖ్యలోనూ భారత్ సూపర్ రిచ్ ఎందుకవుతుందో ఆలోచించకపోతే ఈ అంకెల గారడీనే నిజమైన అభివృద్ధి అని భ్రమలో పడతాం. ఆర్థిక అభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మధ్య అంతరాలను కొలిచే ఆర్థిక గణాంకాలను ప్రతి పౌరుడూ గుర్తించాలి. దారితప్పి దౌడు తీస్తున్న ట్రబుల్ ఇంజిన్కి బ్రేకులు వేయాలి. 2021 లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఒక్క శాతం ఉన్న సంపన్నుల దగ్గరే 20 శాతం సంపద పోగుపడింది. జనాభాలో సగంగా ఉన్న పేదలు, దిగువ మధ్య తరగతికి చెందిన వారి వద్ద కేవలం 13 శాతం ఆదాయం మాత్రమే ఉంది. భారతీయుల తలసరి ఆదాయం రూ.2,04,200 కాగా, పేదలు, దిగువ మధ్యతరగతి వారి తలసరి ఆదాయం రూ.53,610 మాత్రమే.