తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు పూర్తి మార్కులు పడితే, ఇచ్చిన పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్కు పడేది సున్నా మార్కులే! తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన పార్టీ తమదేనని, ఇది సోనియమ్మ ప్రసాదించిన వరమని తెలంగాణ నేతలు పదేపదే వేదికలపై ప్రకటిస్తుంటే నవ్వే కాదు, ఏడుపు కూడా వస్తున్నది. ఆ మాట చెప్పుకొనే అర్హత కాంగ్రెస్కు ఏమాత్రం లేదు. అదే నిజమైతే తెలంగాణ ప్రజలు 2014లో ఆ పార్టీకే పట్టం కట్టేవారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 49 చోట్ల గెలిచిన కాంగ్రెస్.. స్వరాష్ట్రం సిద్ధించాక 2014లో జరిగిన ఎన్నికల్లో 21 స్థానాలకు పరిమితమయ్యేది కాదు.
Congress | టీడీపీని ఓడించేందుకు వైఎస్ఆర్ ప్రణాళికల్లో భాగంగా 2004లోనే తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ ఆటాడుకున్నది. ఆనాటి టీఆర్ఎస్తో జతకడితే తప్ప తెలంగాణలో చంద్రబాబును కట్టడి చేయలేమని స్వరాష్ర్టాన్ని ఆశ చూపి పొత్తుకూడింది. ఆ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు 48, టీఆర్ఎస్కు 26 సీట్లు రాగా.. టీడీపీకి 11 స్థానాలే దక్కాయి. 1999 ఎన్నికల్లో అదే టీడీపీ తెలంగాణ ప్రాంతంలో 50 స్థానాల్లో గెలుపొందింది. ఈ రకంగా ఆనాటి టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పాలనకు మూలకారణమైంది. తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు బద్ధ వ్యతిరేకి కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తే అయినా అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టవచ్చని, పార్లమెంట్లో అనుకూలంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందనే భరోసాతో తెలంగాణ ప్రజలు 2004లో కాంగ్రెస్ను గెలిపించారు. చివరకు పాలు పోసిన చేతినే కాటేసినట్లు నమ్మి ఓటేసిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై వైఎస్ఆర్ నీళ్లు చల్లారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చకుండా, కాంగ్రెస్కు సహకరించిన టీఆర్ఎస్ ఉనికే లేకుండా చేసే కుట్రలకు తెరలేపారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్తో విసిగి వేసారిన టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది.
ఆనాటి నుంచే వైఎస్ఆర్కు తెలంగాణ పట్ల చులకనభావం ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటు అంశం అనగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అంగీకారం కావాలని, ఎన్నో అంశాలపై చర్చలు జరగాలని, రెండు రాష్ర్టాలా? మూడు రాష్ర్టాలా? అనేది తేలాలని.. ఇలా రకరకాల అడ్డంకులు సృష్టించి ఐదేండ్ల పాటు కాలయాపన చేశారు. అలా తాత్సారం చేసిన కాంగ్రెస్ సీఎం 2009 ఫిబ్రవరిలో కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణ డిమాండ్ ఎప్పుడూ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, ఉభయసభల్లో నుంచి అన్ని పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తుందని, ఆ నివేదిక రాగానే తగిన నిర్ణయాలు తీసుకుంటుందని వైఎస్ఆర్ నమ్మబలికారు. అలా కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన టీఆర్ఎస్ తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా 2009 ఎన్నికల్లో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. అప్పుడు తొలి దశలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ పూర్తయిన వెంటనే ఆంధ్రా ప్రాంతంలో ప్రచారానికి వెళ్లిన రాజశేఖర్రెడ్డి.. అక్కడ తెలంగాణపై తన కడుపులో ఉన్న విషాన్ని కక్కారు. ‘తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే కోస్తా, రాయలసీమ నుంచి వెళ్లి హైదరాబాద్లో స్థిరపడ్డవారు విదేశీయులైతారు. అక్కడికి వెళ్లడానికి వారికి పాస్పోర్ట్ అవసరమవుతుంది’ అని నంద్యాలలో జరిగిన ప్రచార సభలో కాంగ్రెస్ నిజస్వరూపాన్ని మరోసారి బయట పెట్టారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరిస్తామని మాట్లాడిన నోటితోనే మరుక్షణమే నాలుక మడిచి ఆంధ్రాలో వారికి అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు.
ఆయన వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒకే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను ప్రేరేపిస్తున్నారని ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ‘దమ్ముంటే ఆ మాట తెలంగాణలో ఓట్లు పడకముందే మాట్లాడి ఉండాల్సింది. రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయి ఇలా ఒక ప్రాంత ప్రజలను నమ్మించి గొంతు కోయడం ఘోరమైన అన్యాయం’ అని నిలదీశారు.
2009లోనూ కాంగ్రెస్ గెలవడం, వైఎస్ఆర్ మరోసారి సీఎం కావడంతో తెలంగాణకు మళ్లీ కష్టకాలం మొదలైంది. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో రాజశేఖర్రెడ్డి టీఆర్ఎస్ సభ్యుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడారు. తెలంగాణ డిమాండ్ను ఎద్దేవా చేశారు. ఊహించని రీతిలో 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ దుర్మరణం పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది. వారు ఆంధ్రా ప్రాంతం వారే కావడం, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకులు కావడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. నిరాశతో యువత ఆత్మబలిదానాలు చేసుకోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. తెలంగాణ అట్టుడుకుతున్న సమయంలో ఆంధ్రా నాయకులు ఢిల్లీ వెళ్లి తెలంగాణ ఇవ్వవద్దని సోనియాగాంధీతో కచ్చితంగా చెప్పారు. అయితే వివిధ ఐకాసల నేతృత్వంలో ఉద్యమం వెయ్యి రెక్కలు విప్పుకోవడంతో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛకు కాంగ్రెస్ తలొగ్గక తప్పలేదు. చివరకు అది కూడా 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారు. అలా 2014 జూన్ 2న తెలంగాణ ప్రజల కల సాకారమైంది.
ఇదంతా చూశాక కాంగ్రెస్ పార్టీ దశాబ్దం పాటు తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టిందా? లేదా నోరిడిచి అడగంగానే ‘పట్టండి’ అని రాష్ర్టాన్ని చేతిలో పెట్టిందా? అనేది స్పష్టమవుతున్నది. సోనియాను తెలంగాణ ఇచ్చిన మహాతల్లి అని కాంగ్రెస్ నేతలు సభాముఖంగా అనడం చరిత్ర తెలిసి కూడా బుకాయించడమే అవుతుంది.
బ్రిటిష్ వాడితో వందేండ్లకు పైగా పోరాడి, ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చుకున్నట్టే.. అంతకంటే కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో పద్నాలుగేండ్లు యుద్ధం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారు. 2004లోనే హామీ ఇచ్చినట్టు తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే ఆ గౌరవం కాంగ్రెస్కు దక్కేది. కానీ, హామీ ఇచ్చిన తర్వాత కూడా పదేండ్ల పాటు ప్రజలను అరిగోస పెట్టి, పార్టీ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు ఆ పేరు వాళ్లకెలా దక్కుతుంది? తెలంగాణ చరిత్రలో తెచ్చిన పార్టీ పేరు మాత్రమే లిఖితమవుతుంది. కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని విలన్గా పేర్కొనవచ్చు.
-బి.నర్సన్
94401 28169