లోక్సభ ఎన్నికలను తమ పాలనకు, పనితీరుకు రెఫరెండంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొనడం విస్తృత చర్చకు దారితీస్తోంది. ఎన్నికల షెడ్యూలు నాటికి మూడున్నర నెలల పాలనను చూసి ఓటేయాలని రేవంత్ కోరడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పాలన ఆరంభ దశలోనే ఉండగా.. మైండ్గేమ్తో విపక్షాలను దెబ్బతీయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో విభిన్న ఫలితాలు ఉంటాయనే అంచనాలున్నాయి. ప్రజాతీర్పు దానికి ప్రామాణికం కానున్నది.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ గ్యారెంటీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. రైతు రుణమాఫీ చేయనేలేదు. రైతుబంధు స్థానంలో తెస్తామన్న రైతు భరోసా ఊసేలేదు. రైతుబంధు కింద పెట్టుబడి సాయం కూడా మూడెకరాల వరకే అందించినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకానికి రూ.10 లక్షల చికిత్స పరిమితిని బీఆర్ఎస్ ప్రభుత్వమే వారి హయాంలో పెంచినందున అది కాంగ్రెస్కు అంతగా లాభించలేదు.
CM Revanth Reddy | గతేడాది డిసెంబరు ఏడో తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ గ్యారెంటీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. రైతు రుణమాఫీ చేయనేలేదు. రైతుబంధు స్థానంలో తెస్తామన్న రైతు భరోసా ఊసేలేదు. రైతుబంధు కింద పెట్టుబడి సాయం కూడా మూడెకరాల వరకే అందించినట్టు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకానికి రూ.10 లక్షల చికిత్స పరిమితిని బీఆర్ఎస్ ప్రభుత్వమే వారి హయాంలో పెంచినందున అది కాంగ్రెస్కు అంతగా లాభించలేదు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుకు కోటి మంది దరఖాస్తు చేసుకుంటే 40 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయడంతో మిగిలినవారు అసంతృప్తితో ఉన్నారు. రూ.500 సిలిండర్ పథకం ప్రారంభమే కాలేదు. రాష్ట్రంలో గత పదేండ్లుగా కరెంటు, సాగు, తాగునీటి సమస్యలు లేవనేది నిర్వివాదాంశం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు ఉంటున్నాయనేది నిజం.
తాగునీటి సరఫరాలో ఆటంకాలున్నాయి. సాగునీటి వ్యథ నెలకొంది. మేడిగడ్డ బరాజ్లోని మూడు పిల్లర్లు కుంగితే మొత్తం రిజర్వాయరే కుంగిపోయిందని చెప్పి.. కాళేశ్వరం నీళ్లను వినియోగించకపోవడంతో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ఫలితంగా పంటలు ఎండిపోయాయి. పేదింటి ఆడపిల్లల పెండ్లికి కళ్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. కానీ, దాని ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతిపై మాట మార్చేశారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రయత్నించలేదు. బీఆర్ఎస్ హయాంలో నియామక పరీక్షలు, ఎంపికలు పూర్తయిన వారికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపత్రాలు ఇచ్చింది. వాటిని ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంది తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగ నియామకాన్ని చేపట్టలేదు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీకి సైతం నిజం చెప్పకుండా తామే నియామకాలు చేశామని చెప్పించడం సహేతుకమే కాదు.
ప్రతీకారేచ్ఛతో…
అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై కంటే అధికంగా ప్రతీకారేచ్ఛపైనే దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. ఐదేండ్లు పాలించే అవకాశం ఉన్నా.. విపక్ష బీఆర్ఎస్ నుంచి ముప్పు ఉందనే ప్రచారం చేసి, ఆ పార్టీని దెబ్బతీయడానికి కాంగ్రెస్ పూనుకుంది. పాలనాంశాలను రాజకీయాలకు ముడిపెట్టింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు మూసేసి గాంధీభవన్ గేట్లు తెరిచి బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకుంది. బీఆర్ఎస్ గెలిచిన జడ్పీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్లు, మున్సిపాలిటీలు చివరికి ప్రాథమిక సహకార సంఘాల్లోని సభ్యులను పార్టీలోకి చేర్చుకొని ఆయా స్థానాలను దొడ్డిదారిన కైవసం చేసుకుంటోంది. గత ప్రభుత్వ హయాంలోని పథకాలు, కార్యక్రమాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఇలా అన్నింటిపైనా విచారణలకు ఆదేశించింది. విచారణ ప్రారంభం కాకముందే వాటిపై లీకులు ఇచ్చి అవే నిజాలని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సమీక్ష సమావేశాల కంటే విపక్షాన్ని విమర్శించడంపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.
వ్యూహం ఫలిస్తుందా?
గతేడాది నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 64 స్థానాలను గెలిచిన కాంగ్రెస్ లోక్సభలో మెజారిటీ స్థానాలు వస్తాయనే అతి నమ్మకంతో ఉన్నది. తాము ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని ప్రజలు నమ్ముతారనే భావన ప్రభుత్వంలో కనిపిస్తోంది. అయితే 2018 శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 9 స్థానాలే గెలిచిందనే విషయాన్ని మరిచిపోవద్దు. ప్రజలు విజ్ఞులు. వారు ఏది మంచి, ఏది చెడో తెలుసుకొని విలక్షణ తీర్పు ఇస్తారని పాలకులు గుర్తించాలి.
సమీక్షించుకోవాలి…
బీఆర్ఎస్ ప్రభుత్వం తమ పదేండ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చేసినా.. ప్రజలు మార్పును ఆశించి కాంగ్రెస్కు పట్టం గట్టారు. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? తాము ఎందుకు గెలిచాం? తామేం చేయాలి? అంటూ నాలుగు నెలల పాలనను సమీక్షించుకునే ప్రయ త్నం ప్రభుత్వం చేయలేదు. తమను తాము ప్రశంసించుకుంటే, అందరూ అదే నమ్ముతారనే భావన సరికాదు. విపక్షంపై పగ, ప్రతీకారాల మీద దృష్టి పెట్టకుండా రాష్ర్టాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పాలకుల ఆలోచన విధానాలు రాష్ర్టానికి మేలు చేస్తేనే ఓటర్లు ఆదరిస్తారు. ఐదేండ్ల తర్వాతే ప్రజలు మారుతారని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. తమకు సరైన పాలన అందడం లేదని భావిస్తే నెలల్లోనే వారి తీర్పు మారుతుందని పాలకులు గుర్తించి, అందుకు తగ్గట్టుగా నడుచుకోవాలి.
-డాక్టర్ బీఎన్ రావు