‘మీరు ఏ విధమైన ఆందోళనకూ గురికావొద్దు’ అని ఒక్క మాటలో చెప్పదలచుకున్నాను. ఇది నేను రాజకీయవాదిగా చెప్పడం లేదు. బాధ్యత కలిగిన పౌరునిగా, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల కోసం చదువుతూ కష్టపడుతున్న, భవిష్యత్పై కోటి కలలతో ఉన్న ఇద్దరు పిల్లల తండ్రిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నిరుద్యోగులు అయిన ఒకరిద్దరు నాయకులు మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తున్నరు. భవిష్యత్పై సందిగ్ధంలో పడవేస్తున్నరు. వాళ్లకు ఏం చెప్పినా లాభం లేదు. అందుకే మీతో నా సంభాషణ.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఏఈ పరీక్ష పేపర్ లీక్కు సంబంధించి జరుగుతున్న పరిణామాలు నేనూ, నా 24, 22 ఏండ్ల ఇద్దరు పిల్లలూ నిశితంగా గమనిస్తూ ఉన్నాం. ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్న, ఎన్నికల డ్యూటీలో కూడా అనుభవం ఉన్న మా శ్రీమతీ, నేనూ ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ ఉన్నాం కూడా. ఎక్కువ సమయం స్కూలు పిల్లలతో గడిపే టీచర్లు పిల్లల ఆందోళనలు, పరీక్షలకు ముందూ, తర్వాత వారి మానసిక స్థితి; 7, 10, ఇంటర్, డిగ్రీ తదితర ప్రాముఖ్యమైన తరగతుల వార్షిక పరీక్షలప్పుడు పిల్లలు సహా టీచర్లకూ ఉండే టెన్షన్ ఇవన్నీ కూడా మేం మాట్లాడుకుంటూ ఉంటం. కాబట్టే మా ఇద్దరు పిల్లలకు మేం విశ్వాసం ఇవ్వగలిగినం సర్వీస్ కమిషన్ పరీక్షల విషయంలో. అదే విశ్వాసం మీకూ కల్పించాలని ఈ చిరు ప్రయత్నం.
మన రాష్ట్రంలో, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ‘లీక్’లు జరుగుతూ ఉంటయి. కారణం, షార్ట్కట్స్ ద్వారా ఎదిగిపోవాలనుకునే మనుషుల తత్వం. ప్రపంచమంతా ఎక్కడైనా అదే మనుషులు కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటయి. పరీక్ష పత్రాల లీక్ మాత్రమే కాదు… కాసులు పండించే వ్యాపార రహస్యాలను అస్మదీయులకు లీక్ చేయించి ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరులుగా నిలబట్టే పార్టీలు, ప్రభుత్వాధినేతల గురించి మనం వింటూ ఉన్నం. అదానీ రూపంలో తాజాగా మరోసారి అనుభవంలోకి కూడా వచ్చింది మనకు.
ఇదంతా టీఎస్పీఎస్సీకి సంబంధించి ‘లీక్’ వ్యవహారాన్ని జస్టిఫై చేయడానికో, లేదా తప్పు జరగలేదని దబాయించడానికో చెప్పడం లేదు. కొందరు సర్వీస్ కమిషన్ ఉద్యోగులు చేసిన దుర్మార్గం లక్షలాది మంది నిరుద్యోగులకు అశనిపాతమైంది. ఇది చాలా బాధాకరం. మొదటే చెప్పినట్టు సమాజంలోని వ్యక్తుల అవలక్షణాలు, అనైతికత ఎంతటి దారుణ పరిణామాలకు తావు ఇస్తుందో కదా!
అదానీ వ్యవహారం వ్యవస్థీకృత నేరం… కానీ ప్రస్తుత పేపర్ లీక్ కొందరు వ్యక్తుల దుర్మార్గం. మనమందరం ఊరట చెందవలసిన విషయం ఏమంటే సదరు వ్యక్తులు ఆ వ్యవస్థను ఖరాబు చేయలేదు. టీఎస్పీఎస్సీ జాగరూకత కారణంగా నష్టం అత్యంత పరిమితమైనది.
ఏఈ పేపర్ లీక్ ఒక దారుణం. ఇందులో మరో మాట లేదు. ఇప్పటికే నిందితులను రిమాండ్కు తరలించిన్రు. ‘లీక్’ గురించి మొదట పోలీసులకు కంప్లెయింట్ చేసింది కమిషన్ చైర్మన్ జనార్ధనరెడ్డినే! ప్రతిపక్షాలు కాదు. రెండంటే రెండే రోజుల్లో నిందితులను న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టిన్రు పోలీసులు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించే చర్యలకు ప్రభుత్వం పూనుకున్నది. ఎందరో మిత్రులు నా దృష్టికి తీసుకువచ్చిన అంశాలను నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తున్న, వారు రెస్పాండ్ అవుతున్నరు కూడా.
మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి మిత్రులారా! తెలంగాణ జన సమితి బాధ్యుడిగా ఉన్నపుడు నేనూ, కోదండరాం సర్ అప్పటి వ్యవసాయ, సహకార శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ బి.జనార్ధన్ రెడ్డిని కలిసినం, వ్యవసాయ సమస్యలపై వినతి పత్రంతో. తిరిగి వెళ్లేటప్పుడు కోదండరాం అన్నరు.. ‘జనార్ధన్ రెడ్డి మంచి మనిషి, సిన్సియర్ ఆఫీసర్’ అని. ఉన్నత విద్యాశాఖ సెక్రెటరీగా ఉన్నప్పుడు, జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నపుడు కూడా కలిసిన కొన్ని ప్రతిపాదనలతో. ఆయన పనితీరును నిజాయితీని శంకించవలసిన పనిలేదు. ఇపుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా కూడా ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నరు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్లో ఎన్నో సంస్కరణలు చేపట్టిన్రు. నిన్న రాత్రి ఆయన ప్రెస్ మీట్ చూసినవారికి అర్థమవుతుంది. ఆయన ప్రతిమాటలో తొణికిసలాడిన విశ్వాసం, జరిగిన దారుణం పట్ల బాధ కూడా గమనించిన వారికి ఆయన కళ్లు చెప్పిన మాటలు వినపడే ఉంటయ్!
జనార్ధన్ రెడ్డి మీడియా సమావేశం లైవ్ చూస్తున్న మా అమ్మాయి నవ్య అన్నది- ‘he looks not only accountable but also very ethical, naanna’ అని! తన గ్రూప్ పరీక్షల పర్యవసానం, తన భవిష్యత్ ఏమవుతుందో అన్న ఆందోళన నవ్యలో లేశమాత్రం కనిపించలేదు నాకు. ఈ ఆశ మీ అందరిలో ఉండాలని నా ప్రార్థన. అందుకే ఈ లేఖ!
జనార్ధన్రెడ్డి పిల్లలు గ్రూప్-1 రాసిన్రని అబద్ధాలు ప్రచారం చేసిన్రు సమాజం పట్ల ఏ మాత్రం పట్టింపు లేని నాయకులు. ఆయన నిన్న చెప్పిన్రు మీడియా సమావేశంలో ‘మీరు పరీక్ష రాస్తానంటే రాయండి కానీ నేను చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటా. రెండిటిలో ఏదో ఒకటే జరగాలి, నిర్ణయం మీదే’ అన్నరు తన పిల్లలతో.ఇంతకంటే ఏం నిజాయితీ ఆశించగలం?
ఇంక పేపర్ లీక్ వెనుక స్వయానా ముఖ్యమంత్రి ఉన్నరని ఆరోపించే ప్రతిపక్ష నాయకులకు నా ప్రగాఢ సానుభూతి. ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయితే పేపర్ ‘లీక్’ చేసుకొని సంపాదించవచ్చు అనుకునే చిల్లర, చీప్, వల్గర్ ఆలోచనలు ఉన్నవారు అసలు రాజకీయాలకు పనికిరారు. రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, వారి కుటుంబాలకే అది మంచిది కాదు. అవినీతి చేయగలిగే పనికి అడ్డువస్తే కుటుంబాలనూ విచ్ఛిన్నం చేసుకునే కాలకూటమంటి మనస్తత్వాలు కలవారే నేడు యువతను రెచ్చగొడుతున్నరు. బరువూ, బాధ్యతా లేనివారు ఏమైనా మాట్లాడగలరు. బండి సంజయ్ లాంటి అసాంఘిక శక్తుల పట్ల జాగరూకత అవసరం. ‘యువతకు ఉద్యోగాలు వస్తే బీజేపీ నుంచి దూరం జరుగుతరు’ బండి సంజయ్ మొన్నామధ్య అన్న ఈ మాటలు మీకు గుర్తు చేస్తున్న. ‘కంటివెలుగు ద్వారా చూపు వస్తే ఎన్నికల గుర్తులను ఓటర్లు సరిగా గుర్తిస్తే మాకు ఓట్లు పడవు’ అని కూడా అన్నారాయన.
మీరు గమనించాల్సిందేమంటే.. మీ భవిష్యత్తు ఏ మాత్రం బాగుపడినా, మీలో చైతన్యస్థాయి పెరిగినా, మీ జీవన ప్రమాణాలు బంగారంలా అయినా మొదటి నష్టం బీజేపీకి. చైతన్యశీలమైన, అభివృద్ధి చెందుతున్న ప్రదేశాల్లో బీజేపీ ఎదగలేదు. తేటనీటిలో కాదు కమలం విరబూసేది, కేవలం బురదలోనే. కాబట్టే అందరిమీదా బురదజల్లి ఎదుగుదామని వారి ప్రయత్నం.
మీరు మంచి పౌరులుగా ఎదిగి ఇంటికి, రాష్ర్టానికి, దేశానికి పేరు తేవాలి. అనివార్యంగా దుష్ట నాయకుల గురించి మాట్లాడవలసి వచ్చింది గానీ లేకపోతే ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు. ప్రజలకు, నిరుద్యోగ యువతకు పార్టీలు ఉండవు. అందరూ మన బిడ్డలే.
జనార్ధన్రెడ్డి లాంటి సమర్థుడు, నిజాయితీపరుడి నేతృత్వంలో సర్వీస్ కమిషన్ దీక్షతో పనిచేస్తున్నది. కొందరి స్వార్థం కారణంగా మీరందరికీ వాటిల్లిన క్షోభకు చింతిస్తూ ఉండటమే కాక, న్యాయం చేకూర్చే పనిలో ఉన్నది. మీరందరూ సంతృప్తి చెందే నిర్ణయాలు వెలువడతయి. సందేహం ఎంతమాత్రమూ వద్దు. రాజకీయ నిరుద్యోగుల రెచ్చగొట్టే మాటలు ఆలకించవద్దు, ఆందోళన వద్దు.
మీరు శ్రద్ధగా చదువుకోండి, ఉద్యోగ ప్రయత్నాల్లో సీరియస్గా నిమగ్నమై ఉండండి. ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించండి. రాష్ట్ర నిర్మాణంలో పాలుపంచుకోండి. తెలంగాణ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏలుబడిలో తెలంగాణ బిడ్డలకు, అందునా రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన యువతకు అన్యాయం జరగదు.
Good luck for
your bright future.
With lots of love.
జనార్ధన్రెడ్డి లాంటి సమర్థుడు, నిజాయితీపరుడి నేతృత్వంలో సర్వీస్ కమిషన్ దీక్షతో పనిచేస్తున్నది. కొందరి స్వార్థం కారణంగా మీరందరికీ వాటిల్లిన క్షోభకు చింతిస్తూ ఉండటమే కాక, న్యాయం చేకూర్చే పనిలో ఉన్నది. మీరందరూ సంతృప్తి చెందే నిర్ణయాలు వెలువడతయి. సందేహం ఎంతమాత్రమూ వద్దు.
రాజకీయ నిరుద్యోగుల రెచ్చగొట్టే మాటలు ఆలకించవద్దు, ఆందోళన వద్దు.
శ్రీశైల్రెడ్డి పంజుగుల: 90309 97371