Konda Vishweshwar Reddy | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ బతకాలంటే రేవంత్రెడ్డి పీసీసీ చీఫ్ కావాలని సపోర్టు చేసింది మా నాన్నగారే. ‘కొండను పిండి చేస్తాం.. చేవెళ్లలో గెలువనివ్వం అనడం డ్రామా’. రంజిత్రెడ్డికి టికెట్టు ఇవ్వడమే నాన్నకు, రేవంత్రెడ్డికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్కు నిదర్శనం. సునీతా మహేందర్రెడ్డి ఉంటె టఫ్ఫైట్ ఉంటుండె. రంజిత్రెడ్డి ఉండడం మనకు పెద్ద గిఫ్ట్. రేవంత్రెడ్డి మనకు ఇన్డైరెక్ట్గా సపోర్టు చేశాడని కూడా అనుకోవచ్చు.’ ఇది ఎవరో ఆషామాషీ వ్యక్తి అన్న మాటలు కాదు. సాక్షాత్తు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి కుమారుడు కొండా విశ్వజిత్ వ్యాఖ్యలు. పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిజమేనని కొండా విశ్వజిత్ మాటలతో తేటతెల్లమయ్యింది. బీజేపీని గెలిపించేందుకే రేవంత్రెడ్డి కొన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారనేది మరోసారి రుజువైంది.
ఇటీవల ఒక టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వజిత్ తన తండ్రికి, సీఎం రేవంత్రెడ్డికి మధ్య ఉన్న స్నేహాన్ని, తమకు రేవంత్రెడ్డి సహకరిస్తున్న తీరును సంపూర్ణంగా వివరించారు. సోషల్ మీడియాలో కొండా విశ్వజిత్ ఇంటర్వ్యూ వైరల్ అవుతున్నది. తన తండ్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి రేవంత్రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కేందుకు సహకరించారని, ఆ కృతజ్ఞతతోనే స్థానిక నేత పట్నం సునీతామహేందర్రెడ్డిని కాకుండా రంజిత్రెడ్డికి చేవెళ్ల టికెట్టు ఇచ్చి పోటీ చేయిస్తున్నారని, ఇలా చేయడం తమకు ఎంతో కలిసి వచ్చే అంశమని విశ్వజిత్ స్పష్టంచేశారు. రేవంత్రెడ్డి ఇటీవల చేవెళ్ల పర్యటన సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డిని గెలివనివ్వను, కొండను పిండి చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ‘కొండను పిండిచేస్తా’ అన్న మాటలు డ్రామా అని విశ్వజిత్ అభివర్ణించారు.
చేవెళ్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిగా రంజిత్రెడ్డి ఉన్నారని స్పష్టత రాగా.. ఇంకెక్కెడ ఇలాంటి అభ్యర్థులున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తున్నది. కరీంనగర్లో బండి సంజయ్కు సహకరించేందుకు వెలిచాల రాజేందర్రావును, మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ను గెలిపించేందుకు సునీతా మహేందర్రెడ్డిని నిలబెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని గెలిపించేందుకే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను నిలబెట్టారని, నాగేందర్ కనీ సం ప్రచారం కూడా సరిగా చేయడంలేదని కాంగ్రెస్ పార్టీ వారే ఆరోపిస్తున్నారు. వరంగల్లో కడియం కావ్యను రంగంలోకి దిం చడం బీజేపీతో రేవంత్రెడ్డికి ఉన్న ఒప్పందంలో భాగమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నల్లగొండ, పెద్దపల్లి, భువనగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా రేవంత్రెడ్డి ఒప్పందం చేసుకున్నారనే వాదనలున్నాయి.