బీసీ కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చి బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను వెంటనే సవరించి బీసీ కులగణనకు స్పష్టమైన విధానం ప్రకటించాలని కోరారు.
ఏప్రిల్ 1, 2025న ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తదుపరి జనగణనలో బీసీ కులగణన చేపడతామని నిర్ణయించి, ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారని శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న జనగణనలో బీసీల కులాల వివరాలను సేకరించడంపై కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శించారు.
ఏప్రిల్ 2026 నుంచి మొదటి దశ జనగణనలో కుటుంబాల లెక్కింపు చేపట్టిన సమయంలో ఓబీసీ కుటుంబాలను కూడా లెక్కించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేసినా కేంద్రం పట్టించుకోలేదని శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలతోపాటు ఓబీసీ కుటుంబాల వివరాలను కూడా సేకరించాలని ప్రతిపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేసినప్పుడు రెండో దశలో బీసీ కులగణన చేపడతామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ఆగస్టు 14న కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో 40 ప్రశ్నలు పొందుపరిచినా.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన కులం వివరాలు అడిగే విధానం ఉన్నప్పటికీ ఓబీసీలకు సంబంధించి ‘మీరు ఓబీసీనా? అయితే ఏ కులం?’ అనే ప్రశ్నను చేర్చలేదని ఆయన పేర్కొన్నారు.
బీసీ జాబితాను ప్రకటించకుండా, ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ నంబర్ కేటాయించకుండా బీసీ కులాల లెక్కలను ఏ విధంగా సేకరిస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ, బిహార్లో జరిగిన కులగణన విధానాలను కేంద్రం నమూనాగా తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర అగ్రకులాల జాబితాలను విడుదల చేసి.. ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ కేటాయించి శాస్త్రీయ పద్ధతిలో కులగణన నిర్వహించాలని సూచించారు.
బీసీ కులగణన చేపట్టడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మండల్ ఉద్యమం నుంచి ప్రస్తుత కులగణన వరకు బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు. కేంద్రం తక్షణమే గెజిట్ నోటిఫికేషన్ను సవరించకపోతే దేశవ్యాప్తంగా బీసీలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించేందుకు వచ్చేవారం ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలతో పాటు ఓబీసీ సంఘాలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.