Ground Water | హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు లోలోతుకు పడిపోయాయి. నిరుడు ఏప్రిల్తో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో దాదాపు 1.74 మీటర్ల లోతుకు జలాలు తగ్గిపోయాయి. ఈ మేరకు భూగర్భజలశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికనే స్పష్టం చేస్తున్నది. నిరుడు ఏప్రిల్లో భూగర్భజలాల 8.77 మీటర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్లో రాష్ట్ర సగటు భూగర్భజల మట్టం 10.51మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నాటికి 891మి.మీ.వర్షపాతానికిగాను 930మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.
అంటే మొత్తంగా 4శాతం వర్షపాతం అధికంగా నమోదయింది. అయినప్పటికీ నిరుడు ఇదే సమయంతో పోల్చినప్పుడు 1.74మీటర్ల మేర భూగర్భజలాలు ఇప్పటికే తగ్గిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భజలమట్టం మార్చి నెలలో 9.69మీటర్లు ఉండగా, ఏప్రిల్లో అది 10.51మీటర్లు నమోదు కాగా, నెలలోనే దాదాపు 0.82మీటర్ల మేరకు భూగర్భజల మట్టం తగ్గిపోయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కేవలం 3జిల్లాల్లోనే సగటు భూగర్భ జలమట్టం 0.15 మీటర్లు పెరగగా, మిగతా అన్ని జిల్లాల్లో భూగర్భజలమట్టం సగటును 0.28మీటర్ల లోతుకు పడిపోయింది.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3.88మీటర్లు, నల్గొండ 3.76, జోగులాంబ గద్వాల జిల్లాలో 3.51మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే 25శాతం మేరకు అత్యధిక వర్షపాతం నమోదయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సైతం 3.59మీ టర్ల మేరకు భూగర్భజలమట్టం పడిపోవడం గమనార్హం.