సికింద్రాబాద్/ బొల్లారం : కంటోన్మెంట్ఎమ్మెల్యే సాయన్న సోమవారం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సాయన్న…..తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా బస్తీల్లో నివసించే ప్రజల ఇండ్లకు వెళ్లాడు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు కళ్యాణలక్ష్మి పథకం కింద ధరఖాస్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు చెక్కులు మంజూరయ్యాయి. ఎప్పటి మాదిరిగానే క్యాంపు కార్యాల యానికి లబ్ధిదారులను పిలిపుంచుకుని చెక్కులను అందజేసే ఎమ్మెల్యే సాయన్న..ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకుని నేరుగా లబ్ధిదారుల ఇండ్లవద్దకు వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవడంతో పాటు కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ నేపథ్యంలో బోర్డు పరిధిలోని ఏడు, ఎనిమిది వార్డుల్లోని 8మంది లబ్ధిదారులకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న అంద జేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లీళ్లకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం, ఏడో వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేజ్ పాల్, నేతలు నివేదితా, ముప్పిడి మధుకర్, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.