నిజామాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలతో దూకుడు పెంచింది. అభ్యర్థిని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించగా గులాబీ పార్టీలోని సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ గాలి అనిల్ కుమార్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తవగా ఆదివారం కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గంప గోవర్ధన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి గాలిఅనిల్ కుమార్తోపాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా హాజరు కానున్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్యా గార్డెన్లో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయంతో కాంగ్రెస్, బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు కదం తొక్కాలని శ్రేణులను కోరారు.
జహీరాబాద్ లోక్సభ స్థానం గులాబీ పార్టీకి కంచుకోట లాంటిది. 2014, 2019లో వరుసగా ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ గెలుపొందింది. కేసీఆర్ ఆశీస్సులతో రాజకీయ రంగప్రవేశం చేసిన బీబీపాటిల్ సాంకేతికంగా మద్నూర్ వాసి అయినప్పటికీ ఆయనకు తెలుగు భాషనే రాదు. ఇక్కడ ప్రాంత ప్రజలతోనూ పరిచయాలు కూడా అంతగా లేవు. భౌగోళికంగానూ ఎలాంటి అవగాహన లేకపోయినా గులాబీ పార్టీ ఊపులో బీబీపాటిల్కు అదృష్టం కలిసి వచ్చింది. గులాబీ కండువా కప్పుకున్న వ్యాపారిని నమ్మి లోక్సభకు రెండుసార్లు కేసీఆర్ పంపిస్తే అక్కున చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి బీబీపాటిల్ బయటికి వెళ్లారు. బీజేపీకి ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు లీడర్లే దిక్కు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిని వెంటాడి చేర్చుకున్నది. కేసీఆర్ ఆదరిస్తే బీబీపాటిల్ మాత్రం కనీస నైతికతను ప్రదర్శించకుండా పార్టీ మారడంపై ఇప్పటికే జహీరాబాద్ నియోజకవర్గంలోని గులాబీ శ్రేణులంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మొన్ననే బీఆర్ఎస్ సమావేశంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తీవ్ర స్థాయిలో బీబీపాటిల్ చేసిన ద్రోహంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిన ఘటనను ఉదహరించారు. బీజేపీ, బీబీ పాటిల్కు సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ నేతలంతా శపథం చేస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకున్నది.