నందిపేట్, మార్చి 29: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సేవకుడిగా పనిచేస్తానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. శుక్రవారం ఆయన నందిపేట్లో ఎంపీ సురేశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డితోకలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని సాయిబాబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నందిపేట్, డొంకేశ్వర్ మండలాల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నందిగుడిలో ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర చేపట్టారు. మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ..లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. పార్లమెంట్ సమావేశాలు నడిచినప్పుడు ఢిల్లీకి, మిగతా రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు దురాశకుపోయి దుఃఖాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయారని అన్నారు. కల్యాణలక్ష్మి, తులం బంగారం, సీఎం సహాయనిధి చెక్కులు, రైతుబంధు, 24 గంటల విద్యుత్, రూ.2 లక్షల రుణమాఫీ పథకాలు అమలుచేయడంలేదని మండిపడ్డారు. వరికి రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పి ఇంతవరకు ప్రారంభించలేదన్నారు. కరెంట్ లేక బోరుబావులు వట్టిపోయి పంటలు ఎండిపోయి రైతన్నలు అరిగోస పడుతున్నారని అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. ఐదు రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డు ఐదేండ్లు గడిచిపోయిందని, ఇంకా రాలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని బాజిరెడ్డి సూచించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, ఎంపీపీ సంతోష్, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ నాయకుడు మచ్చర్ల సాగర్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.