ముషీరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది వేడుకలకు నగరంలో అదిరిపోయేలా ఏర్పాట్లు చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గులాబీ శ్రేణులను ఆదేశించారు. త్వరలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ, వరంగల్ విజయగర్జన సభలను విజయవంతం చేయడానికి నియోజకవర్గాల వారిగా ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసుకోవాలని సూచించారు.
మంగళవారం ఏర్పాట్లపై తెలంగాణ భవన్లో నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యదవ్, మహ్మద్ అలీతో కలిసి ముషీరా బాద్, అంబర్పేట్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఇతర ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బూత్ కమిటీ, బస్తీ, డివిజన్ల కమిటీల ఏర్పాటు, రానున్న ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్దం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
ప్రతి కార్యకర్త పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనెలా చూడాలని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఆదేశించారు. ఏ మాత్రం ఏమరపాటు తగదని, ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కొవడానికి పార్టీ శ్రేణులను సన్నద్దం చేయాలని సూచించారు. త్వరలో జరుగనున్న ప్లీనరీ, టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు ప్రతి కూడలి, కీలకమైన ప్రాంతాలను పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ముస్తాబు చేయాలని కేటీఆర్ సూచించారు.
నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభకు కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానుల తరలింపు, వాహన వసతి వంటి అంశాల్లో ఎక్కడా లోటు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. అన్ని కమిటీల సభ్యులతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేయాల్సిందిగా కోరినట్లు చెప్పారు.
మంత్రి కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు ఇన్చార్జీ తలసాని సాయికిరణ్ యాదవ్, బండి రమేష్, మాజీ కార్పొరేటర్లు జీ.లాస్యనందిత, ముఠా పద్మ, ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్, వి.శ్రీనివాసరెడ్డి, ఎడ్ల హరిబాబు యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఆర్ మోజస్, బి.శ్రీనివాసరెడ్డి రాకేష్, వై.శ్రీనివాస్, వల్లాల శ్యామ్ యాదవ్, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.