తొలగిన యురేనియం పీడ
కేంద్రంపై అవిశ్రాంత పోరాటం చేసిన తెలంగాణ
తవ్వకాలను అనుక్షణం అడ్డుకున్న స్థానికులు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో హర్షాతిరేకాలు
ఇక ప్రశాంతంగా నల్లమల అటవీ ప్రాంతం
మహబూబ్నగర్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎట్టకేలకు నల్లమలవాసుల పోరాటం ఫలించింది. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. చెంచులు, వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషికి ఫలితం దక్కింది. యురేనియం తవ్వకాలు ఆపేస్తున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో నల్లమల వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఉన్న ఊరు.. పొలాలు, గొడ్డూ గోదా.. చెట్టూ చేమ అన్నీ వదిలీ కట్టుబట్టలతో సొంతూరు వదిలి పోవాల్సిందేనా.. అనే ఒత్తిడితో జీవిస్తున్న నల్లమల వాసులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోరాటం వల్ల భద్రత, భరోసా కలిగింది. నల్లమలలో చెంచులు, వన్యప్రాణాల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పోరాటం ఫలించింది. తమను ఎక్కడ వెళ్లగొడుతారో అని భయపడిన గిరిపుత్రులకు ప్రభుత్వం అండగా నిలిచింది. నల్లమలలో తవ్వకాలు జరిపే తీరుతామని కేంద్రం భీష్మించినా.. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నది. యురేనియం తవ్వకాలు ఆపేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో నల్లమలవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
అపార ఖనిజ నిక్షేపాలకు కేంద్రం
నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం సహా అపార ఖనిజ నిక్షేపాలున్నాయని 1995లో గుర్తించిన కేంద్రం యురేనియం తవ్వకాల కోసం 2012లో ప్రయత్నాలు ప్రారంభించింది. బోర్వెల్స్, డ్రిల్లింగ్ చేస్తూ గిరిపుత్రులకు నిద్రలేని రాత్రులు లేకుండా చేసింది. హెలికాప్టర్లు, పెద్ద పెద్ద రిగ్గులను నల్లమలకు తరలించి డ్రిల్లింగ్ చేస్తూ చెంచుల గుండెల్లో గునపాలు దించేందుకు కేంద్రం ప్రయత్నించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సమైక్య రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి తవ్వకాలకు ప్రయత్నించగా.. ఈ అంశాన్ని గుర్తించిన టీఆర్ఎస్ స్థానిక నేత గువ్వల బాలరాజు ఉద్యమ నేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్పటి మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా గళం వినిపించారు. యురేనియం అన్వేషణకు నల్లమల అటవీప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్)లో సుమారు 400కు పైగా డ్రిల్లింగ్లు చేశారు. దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైనది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత..
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాటం ప్రారంభించింది. అప్పటినుంచే యురేనియం గో బ్యాక్ అంటూ స్థానికులు పెద్దఎత్తున వ్యతిరేకించారు. 2014లో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు యురేనియం ప్రాజెక్టు రానివ్వమని ప్రకటన చేశారు. 2015 నుంచి 2017 వరకు అటవీప్రాంత వాసులు పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు. యురేనియం తవ్వకాలపై విప్ గువ్వల బాలరాజు అసెంబ్లీలో రెండుసార్లు ప్రసంగించారు. బోర్లు వేసి పరిశోధనకు అటామిక్ మినరల్స్ డెవలప్మెంట్(ఏఎండీ) చేసిన ప్రయత్నాన్ని అనుమతుల నిరాకరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది. అయినా కేంద్రం మొండిగా సర్వేకు అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు, పర్యావరణ ప్రేమికులు, చెంచులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అమ్రాబాద్, పదర మండలాల్లో సుమారు 70గ్రామాల పరిధిలో 65వేల మంది అన్యాయమైపోతారని పోరాటం సాగించారు. ఈ తవ్వకాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ కేంద్రానికి నివేదిక అందించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చేసిన పోరాటం, స్థానికుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో కేంద్రం దిగి వచ్చి తవ్వకాలు పూర్తిగా ఆపివేస్తున్నట్లు ప్రకటించింది.
కొత్త ఇండ్ల నిర్మాణం నిలిపేశారు
యురేనియం తవ్వకాలు చేపడితే రేడియేషన్ ప్రభావం వల్ల ఈ ప్రాంతం నాశనమవుతుంది.. మంచి నీళ్లు కూడా విషపూరితమవుతాయి.. వన్యప్రాణులు చనిపోతాయని స్థానికులకు అర్థమైపోయింది. కేంద్రం ఎలాగైనా తమను ఖాళీ చేయిస్తుందని భయభ్రాంతులకు గురై చాలామంది కొత్త ఇండ్ల నిర్మాణం నిలిపేశారు. ఈ ప్రాంత యువతకు కనీసం పెండ్లి సంబంధాలు కూడా పెద్దగా రాలేదు. 2017లో స్థానిక ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. దీంతో జనాల్లో నమ్మకం ఏర్పడింది. పెద్ద ఎత్తున అడవిలో రోడ్లు వేశారు. తాజాగా ఫరహాబాద్ వ్యూ పాయింట్ వద్ద 120 డ్రిల్లింగ్లు చేశారు. అయితే వరుసగా పలువురి ప్రకటనలతో స్థానికులకు కాస్త ఊరట లభించింది. యురేనియం తవ్వకాలను జరుపబోమని అటవీ శాఖ ద్వారా వచ్చిన ప్రకటనతోపాటు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో స్థానికులకు భరోసా ఏర్పడింది. అమ్రాబాద్, పదర మండల ప్రజలు, చెంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తరిమేస్తారని భయపడ్డాం
నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే అడవిని నమ్ముకున్న మా చెంచుజాతిని తరిమేస్తారని, మా జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని భయపడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలను వ్యతిరేకించి అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపి తవ్వకాలను నిలిపేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది.