మండలానికి 205 మంజూరు..98 నిర్మాణాలు పూర్తి
బోథ్, ఏప్రిల్ 22: రైతులు పండించిన పంటను ఆరబెట్టుకోవడానికి వ్యవసాయ కల్లాల నిర్మాణాల వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం రాయితీని అందిస్తున్నది. మండలానికి 205 కల్లాల నిర్మాణం లక్ష్యం నిర్దేశించగా 98 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీ, ఓసీలకు 90 శాతం రాయితీపై నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్నది. 90 శాతం రాయితీ పొందుతున్న రైతులు పది శాతం భాగస్వామ్యం పని రూపంలో చెల్లించేలా (ఉపాధి హామీ కూలీ) వెసులు బాటు కల్పించింది. పంటలను ఆరబెట్టుకోవడానికి 50 స్కేయర్ మీటర్ల కల్లం నిర్మాణానికి రూ.54వేలు, 60 స్కేయర్ మీటర్ల కల్లం నిర్మాణానికి రూ.68వేలు, 75 స్కేయర్ మీటర్ల కల్లం నిర్మాణానికి రూ.80వేలు మంజూరు చేసింది. రైతులు పండించిన పత్తి, సోయాబీన్, కంది, పెసర, మినుము, శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, మక్క, మిర్చి పంటలు ఆరబెట్టుకోవడానికి వీలుగా కల్లాల నిర్మాణాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్నట్లుగా మిగిలిన వర్గాల వారికి వంద శాతం రాయితీ ఇస్తే మరికొంత మంది కల్లాల నిర్మాణానికి ముందుకు వచ్చే అవకాశం ఉందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి