హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు అతి త్వరలో దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించనున్నట్టు నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ తెలిపింది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలని, అట్టడుగువర్గాలకు కల్పించిన రిజర్వేషన్లను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కార్పొరేట్, పెట్టుబడి, దోపిడీ వర్గాలు వెనకుండి ఈ చర్చను నడిపిస్తున్నాయని పేర్కొన్నది. ‘సేవ్ కాన్సిట్యూషన్ సేవ్ రిజర్వేషన్స్’ పేరుతో గురువారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్ ఖాసీం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో అసమానతలు రూపుమాపడం చేతగాని పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ రూ పొందించిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. మనువాదాన్ని వ్యాప్తిచేసే ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగాన్ని శాశ్వతంగా రద్దు చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయని పేర్కొన్నారు.
నూతన పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని ఈ సందర్భంగా వక్తలు డిమాండ్ చేశారు. ఓటు ఓ గేమ్ చేంజర్ అని.. దానిపైనే మన భవితవ్యం ఆధాపడి ఉందని ప్రొఫెసర్ మురళీ దర్శన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగం వర్సెస్ మనువాదంగా ఉన్నాయని సీనియర్ అడ్వకేట్ మురళీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు/ కూటములు తమ మ్యానిఫెస్టోల్లో ప్రకటిస్తున్న అంశాలు, వాగ్దానాలు.. దళిత, బహుజన వర్గాలపై వా టి ప్రభావంపై చర్చించారు. సమావేశంలో డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్లు గడ్డం మల్లేశం, సీహెచ్ శ్రీనివాస్, గాలి వినోద్కుమార్, రచయిత్రి గడ్డం ఝాన్సీ, చింతా భవానీప్రసాద్, మహేశ్రాజ్ పాల్గొన్నారు.