బేల, మే 4 : పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. మండలంలోని పాఠన్ గ్రామంలో శ్మశాన వాటికతో పాటు గ్రామంలో రూ.25లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును, కొబ్బాయిలో శ్మశాన వాటికను బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 70 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ ఎస్ ప్రభ్తుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు.
గ్రామం అభివృద్ధి చెందాలంటే ముందుగా రోడ్డు సౌకర్యం ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీలో చాలా విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడి మధ్య విభేదాలు, వర్గపోరు నడుస్తున్నదని అన్నారు. ఇలాంటి నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. పార్టీ సిద్ధాంతాలకు టీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ప్రజల సంక్షేమానికి పని చేస్తుందని పేర్కొన్నారు. పాఠన్లో ఈ ఏడాది 50 డబుల్ బెడ్రూం ఇండ్లు, వచ్చే ఏడాది మరో 50 ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపించుకొని మరిన్ని అభివృద్ధి పథకాలను పొందాలని సూచించారు. అనంతరం బేల మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కాప్సిలో నెలరోజులుగా కొనసాగుతున్న నానాజీ మహారాజ్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. విజేతగా నిలిచిన పాండ్ర కవడ జట్టుకు ఎమ్మెల్యే జోగు రామన్న రూ. 50 వేలు, రన్నరప్ జట్టుకు రూ. 25 వేలు జిల్లా గ్రంథలయా సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, మూడో స్థానంలో నిలిచిన కిన్వట్ జట్టుకు బహుమతిగా రూ. 15 వేలు గోడే మధుకర్, జక్కుల మధుకర్ అందించారు.
కాప్సి రైతు వేదిక , నానాజీ మహారాజ్ కమ్యూనిటీ షెడ్, పల్లె ప్రకృతి వనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్,టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యాక్షుడు గంభీర్ ఠాక్రే, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్యాం ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్, ఎంపీడీవో భగత్ రవీందర్, టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు రుక్సానా బేగం, నాయకులు మంగేశ్ ఠాక్రే, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, ఫయాజుల్లా ఖాన్, మస్కేతేజ్రావు, విశాల్గోడే, పురుషోత్తం, మధుకర్, జితేందర్, సంతోష్, దిలీప్ ,విపిన్, ఎంపీడీవో రవీందర్, మండల వ్యవసాయాధికారి విశ్వమిత్ర,ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జైనథ్, మే 4: దళితుల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో రూ.25లక్షలతో అంబేద్కర్ భవన నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో దళితబంధు, దళితబస్తీ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, సర్పంచ్ దేవన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి ఉన్నారు.