ఈసీ, మూసీ వాగులపై వంతెనల నిర్మాణం
రూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
తీరనున్న రాకపోకల కష్టాలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మొయినాబాద్, జూలై 31 : ఎన్నో ఏండ్ల ప్రజల కల త్వరలోనే సాకారం కానున్నది. మొయినాబాద్ మండలాన్ని ఆనుకుని ఉన్న ఈసీ, మూసీ నదులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అంతేకాకుండా రూ.10కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ వంతెనల నిర్మాణం పూర్తయితే ఆయా గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తీరుతాయి. ఎట్టకేలకు సమస్యకు పరిష్కార మార్గం లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
చేవెళ్ల నియోజకవర్గం నుంచి మూసీ, ఈసీ ప్రవహిస్తుండగా, వాగులపై ప్రజలకు అవసరమున్న చోట్ల మొయినాబాద్, శంకర్పల్లి మండలాలను అనుసంధానం చేస్తూ వంతెన నిర్మాణాలు చేపట్టాలని ఆయా మండలాల ప్రజలు గత ప్రభుత్వాల హయాంలో ఎంత మొరపెట్టుకున్నా నిధులు మాత్రం మంజూరు కాలేదు. నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం పూర్తిగా, మిగతా మండలాల్లోని కొన్ని గ్రామాలు పాక్షికంగా జీవో 111 పరిధిలోకి వస్తాయి. ఈ జీవో ప్రజలకు పెద్ద శాపంగా మారింది. వర్షాకాలంలో వరదలు మూసీ, ఈసీ వాగుల్లో ప్రవహించినప్పుడు వాగులకు ఆనుకుని ఉన్న కొన్ని గ్రామాల ప్రజలు మరో మండలంలోని గ్రామాలకు వెళ్లాలంటే సుమారు 20 నుంచి 35 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. అలాంటి ఇబ్బందులు ఇక నుంచి తప్పనున్నాయి. వంతెనల నిర్మాణం జరిగితే ప్రజల రాకపోకలు సాగించవచ్చును. వాగులపై వంతెనల నిర్మాణానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రజల విజ్ఞప్తి మేరకు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
ఈసీ, మూసీ నదులపై వంతెన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు
మొయినాబాద్ మండలాన్ని తాకుతూ ప్రవహించే ఈసీ వాగు, మూసీ నదిపై వంతెనల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. మొయినాబాద్ మండలం చిన్నమంగళారం, శంకర్పల్లి మండలం మహారాజ్పేట గ్రామాల మధ్య ఉన్న మూసీ నదిపై వంతెనకు రూ.5 కోట్లు, మొయినాబాద్ మండలం నక్కలపల్లి, షాబాద్ మండలం హైతాబాద్ గ్రామాల మధ్య ఉన్న ఈసీ వాగుపై వంతెన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే యాదయ్య ప్రకటించారు.
ఎమ్మెల్యే చొరవతోనే.. : బట్టు మల్లేశ్, ఎంపీటీసీ, చిన్నమంగళారం
ఎమ్మెల్యే చొరవతోనే వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. చిన్నమంగళారం-మహారాజ్పేట గ్రామాల మధ్య ఉన్న మూసీ వాగుపై వంతెన నిర్మాణం జరిగితే శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
ఏండ్ల నాటి కల నెరవేరనుంది : గడ్డమీది సుకన్య, సర్పంచ్, చిన్నమంగళారం
గ్రామానికి అనుకుని ప్రవహిస్తున్న మూసీ వాగుపై వంతెన నిర్మాణం చేపడితే ఏండ్ల నాటి ప్రజల కల నెరవేరనుంది. ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల కృషి ఫలితంగా.. ఎమ్మెల్యే చొరవతో నిధులు మంజూరయ్యాయి. శంకర్పల్లి మండలానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి తప్పుతుంది.
ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయి : స్వప్నకుమారి, సర్పంచ్, నక్కలపల్లి
షాబాద్ వెళ్లాలంటే చుట్టూ 25 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. వంతెన నిర్మాణం చేపడితే షాబాద్, షాద్నగర్ వెళ్లడానికి దూర ప్రయాణం తగ్గుతుంది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.