Hanamkonda | దామెర, మే 4: పాపం పసిపాప.. ఆడజన్మగా పురుడుపోసుకోవడమే ఆ పసికందు చేసుకున్న నేరం. మాతృప్రేమతో కన్నతల్లి ముర్రుపాలు తాగి వెచ్చని పొత్తిళ్లలో హాయిగా నిదురోవాల్సిన ఆ శిశువు.. పురిట్లోనే పేగుబంధానికి దూరమైంది. నెత్తుటి మరకలు కూడా శుభ్రం చేయని స్థితిలో.. బొడ్డుపేగునూ కోయకుండా ఉన్న ఆ పసిప్రాణి.. ఎర్రటెండలో రోడ్డు పక్కన మట్టికుప్పలో.. కొన ఊపిరితో కదలాడుతూ మానవత్వం ఉన్న మనుషుల కంటపడింది. అంతే.. ఆ శిశువును వారు అక్కున చేర్చుకున్నారు. గంటల వ్యవధిలో దవాఖానకు తరలించి పసిప్రాణాన్ని కాపాడారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ ఆడబిడ్డకు నూరేళ్ల ఆయుష్షు పోశారు. ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ పెద్దచెరువు వద్ద శనివారం చోటుచేసుకుంది.
వరంగల్-భూపాలపట్నం జాతీయ రహదారిపై కల్వర్టుల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఊరుగొండ పెద్ద చెరువు పక్కనే ఉన్న కేఎస్ఆర్ స్కూల్ ఎదురుగా రోడ్డు పక్కన డ్రైవర్ ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్ను ఆపాడు. ఆ రోడ్డు పక్కన కదులుతున్న నవజాత శిశువును గమనించాడు. వెంటనే శిశువు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. మట్టిలో బొడ్డు పేగు కూడా ఊడకుండా ఉన్న ఆడశిశువుపై కొద్దిగా మట్టిచల్లి ఉంది. మట్టిలో ఉన్న శిశువును చేతుల్లోకి తీసుకుని కొద్దిదూరంలోనే ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు కేకలు వేస్తూ విషయం చెప్పాడు.
వెంటనే స్థానికులు, కూలీలు ఎస్సై అశోక్కు సమాచారం అందించగా.. ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిశువును టవల్తో శుభ్రం చేసి పోలీసు వాహనంలోనే ఆరెపల్లిలోని ఎన్ఎస్ఆర్ అపోలో దవాఖానకు తరలించారు. వైద్యులు శిశువును శుభ్రం చేసి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు శిశువును 108లో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం బాగుందని ఎంజీఎం వైద్యులు తెలిపారు. ఆడశిశువును వదిలేసిన ప్రాంతంలో పింక్ పంజాబీ ప్యాంట్ను గుర్తించామని, ఆధారాల కోసం సీసీ పుటేజీలను పరిశీలిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నామని పరకాల రూరల్ సీఐ రంజిత్రావు, ఎస్సై అశోక్ తెలిపారు.