హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా మరింత పెంచామని, ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోసం 160 కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నామని వెల్లడించారు. అవసరమనుకుంటే అదనపు బలగాలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని సంజయ్కుమార్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తక్కువగా ఉన్నా.. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల్లో కేంద్ర, రాష్ట్ర బలగాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఎస్పీలు పోలింగ్స్టేషన్లను తనిఖీ చేస్తున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు డ్రోన్లతో నిఘా పెట్టి, పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిపారు. సీఏఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్మార్చ్లు నిర్వహిస్తూ ప్రజలకు భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. సరిహద్దులో మావోయిస్టు ప్రభావం ఉన్న ఒక్కో జిల్లాకు సుమారు 250 మంది చొప్పున కేంద్ర బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. అత్యవసరమైతే అటవీశాఖ సిబ్బందిని కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని సంజయ్కుమార్ జైన్ తెలిపారు. మావోయిస్టుల లొంగుబాటుకు వారి కుటుంబసభ్యులతో మాట్లాడటం, కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నట్టు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల కుటుంబాలకు వారి తలపై ఉన్న రివార్డును తక్షణమే అందించి, వారిపై ఉన్న కేసులు మాఫీ చేస్తామని చెప్పారు.