Congress | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లానే ఇప్పుడు పదవులు గ్యారెంటీ అని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎరవేస్తున్నారా? లోక్సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, నామినేటెడ్ పోస్టుల ఆశపెట్టి మొండి‘చెయ్యి’ చూపుతారా?’ అని కాంగ్రెస్ నేతల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికెళ్లినా అక్కడి నేతకు రేవంత్రెడ్డి పదవుల ఎర వేస్తున్నారు. పోస్టులు వస్తాయన్న ఆశతోనైనా గెలుపు కోసం కృషి చేస్తారన్న ఆలోచనతోనే రేవంత్ ఇలాంటి హామీలు గుప్పిస్తున్నాడు తప్ప ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ అంటాడేమోనని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్రెడ్డి వెళ్లిన సందర్భంలో అక్కడ అభ్యర్థి టీ జీవన్రెడ్డిని గెలిపిస్తే కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అవుతాడని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకొస్తే కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది తప్ప ముఖ్యమంత్రులు కాదన్నది కాంగ్రెస్ నాయకులకు తెలియంది కాదు. మరి జీవన్రెడ్డికి కేంద్ర మంత్రి పదవి అని ఏ ధీమాతో హామీ ఇచ్చారో రేవంత్కే తెలియాలి. ఇక రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటికీ ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగే పక్షంలో ఇప్పటిదాకా ప్రాతినిధ్యం లభించని జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం ఉంటుంది తప్ప ఇప్పటికే ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలకు కాదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ సీఎం రేవంత్రెడ్డికి అత్యంత ప్రతిష్ఠాత్మకం. ఇక్కడ మహబూబ్నగర్, నాగర్కర్నూల్లో పార్టీ అభ్యర్థులు గెలువని పక్షంలో సీఎం రేవంత్రెడ్డి సీటుకు ఎసరు పెట్టేందుకు మంత్రివర్గ సహచరులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పసిగట్టిన రేవంత్రెడ్డి, ఇప్పటికే బాహాటంగానే తనను రాజకీయంగా బలహీన పర్చేందుకు సొంత జిల్లాలోనే పార్టీ అభ్యర్థులు గెలువకుండా కుట్ర పన్నుతున్నారని పలుమార్లు ఆరోపించారు. ఎలాగైనా మహబూబ్నగర్ ఎంపీ సీటు గెలవాలని భావిస్తున్న రేవంత్రెడ్డి, ఎన్నికల ప్రచార సభలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఇప్పటికే రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండటంతో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. ఇక ఈ జిల్లా నుంచి మూడో వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే, ప్రాతినిధ్యం లభించని జిల్లాల ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? ఇందుకు పార్టీ అధిష్ఠానం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రేవంత్రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడైన చామల కిరణ్కుమార్రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలువాలంటే మొన్నటిదాకా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మనస్ఫూర్తిగా కృషి చేయాలి. పైగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా సీఎం పదవి ఆశించి భంగపడిన నాయకుడే. ఈ నేపథ్యంలో భువనగిరి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సందర్భంలో ‘నాతో పాటు సీఎం అయ్యే అర్హత పార్టీలో ఎవరికైనా ఉంది అంటే అది కోమటిరెడ్డి వెంకట్రెడ్డికే’ అంటూ రేవంత్రెడ్డి ఆయనను మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేశారు. భువనగిరిలో తన మిత్రున్ని గెలిపించుకునేందుకే రేవంత్రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భువనగిరి నుంచి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు రాజగోపాల్రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు.
భువనగిరి ఎంపీ టికెట్ తన భార్య లక్ష్మి కోసం రాజగోపాల్రెడ్డి చివరిదాకా ప్రయత్నించి భంగపడ్డారు. ఈ నేఫథ్యంలో ప్రస్తుత అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి విజయానికి రాజగోపాల్రెడ్డి కృషి చేస్తారో? లేదోనన్న అనుమానంతో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతను ఆయనకే అప్పగించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి తనకు హామీ ఇచ్చినట్టు రాజగోపాల్రెడ్డి బాహాటంగానే చెప్పుకొంటున్నారు.
సీఎం ప్రస్తుతానికి తన వద్ద ఉంచుకున్న హోంశాఖ తనదేనంటూ ఎన్నికల ప్రచార వేదికలపైనే రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కొన్ని జిల్లాలకు మంత్రివర్గంలో చోటే లభించని నేపథ్యంలో నల్లగొండ జిల్లాకు మూడో మంత్రి పదవి ఇవ్వడం ఎలా సాధ్యం?, ఒకే కుటుంబంలో అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవులిస్తే, ఇతర సీనియర్ నాయకులు ఊరుకుంటారా? అధిష్ఠానం అందుకు సమ్మతిస్తుందా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఓవైపు ఎంపీ అభ్యర్థులకు కేంద్ర మంత్రి పదవులు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి పదవుల ఎర వేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, తాజాగా సిద్దిపేట ఎన్నికల ప్రచార వేదికపై మరో సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్కు మంచి పదవి ఇస్తానని ప్రకటించారు. పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు రోజు నామినేటెడ్ పదవులు ఇస్తున్నట్లు మీడియాకు అనధికార ప్రకటన విడుదల చేశారు కానీ, అధికారికంగా ఎవరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న పార్టీ నేతలు, ఎంపీ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి వేస్తున్న పదవుల ఎరను నమ్మడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తున్నది. లోక్సభ ఎన్నికలు ముగిశాక రేవంత్రెడ్డి ప్రాధాన్యాలు మారిపోతాయని, దీంతో తమ పరిస్థితి ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ చందమే అవుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.