pothana bhagavatam | సచ్చరిత్రుడు, పరమ పవిత్రుడు, భాగవతోత్తముడు అయిన పుత్రుడు ప్రహ్లాదుని పట్ల హరి భక్తుడని పగ పెంచుకొని కనకకశిపుడు మనసులో కనికరం లేకుండా కన్నకొడుకును కసితో క్రూరంగా కడతేర్చటానికి కసాయి భటులను ఆజ్ఞాపించాడని పలికిన నారద మహర్షిని చూచి ధర్మరాజు ఆశ్చర్యచకితుడై ఇలా అడిగాడు…
‘పరమర్షీ! ప్రహ్లాదుడు ప్రభా విశాలుడు. పసివాడైనా ఇంపెసలారే (మంచి) ప్రభ పస గలవాడు. పద్మనాభుని పద పద్మ చింతనాలోలుడు. దీన దయాపరుడు. గురు, సాధు పురుషులకు శిరసు వంచి వందించు వినయశీలుడు. దివ్య శోభా సంపన్నుడు. సజ్జన నుతి ప్రశంసా పాత్రుడు. మాయా మోహ బంధాలనే తీగలను మొదలంటా తెగ నరికిన మహానుభావుడు! మహామునీ! లోకంలో పుత్రులు, పెద్దలు చెప్పిన సుద్దులు నేర్చినా నేర్వకపోయినా తండ్రులు వారిని పోషిస్తూనే ఉంటారు. నెయ్య (స్నేహ)పు మాటలతో తమ దారికి మళ్లించడానికి పూనుకుంటారు కాని, వారితో కయ్యం పెట్టుకుంటారా? ప్రహ్లాదుని వంటి పుత్రరత్నం పుట్టినందుకు ప్రీతి చెందక, అతనిని పలు రీతుల బాధలు పెట్టే ప్రయత్నం చెయ్యడానికి ఆ కన్నతండ్రికి మనసెలా ఒప్పింది?’ నారదుడు ఇలా వివరించాడు…
ఉ॥ ‘బాలు బ్రభావిశాలు హరి పాదపయోరుహ చింతన క్రియా
లోలు గృపాళు సాధు గురులోక పదానత ఫాలు నిర్మల
శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహ వల్లికా
జాలు నదేల తండ్రి వడి జంపగ బంపె? మునీంద్ర! సెప్పవే?’
ధర్మజా! పుత్రుని ప్రవృత్తి ప్రవర్తనను పరిశీలించి, వీడు అసుర కులంలో పుట్టినా భాసుర (ప్రబల)మైన ఆసుర స్వభావం ఇసుమంతైనా లేకుండా దీనునిగా, పౌరుష హీనునిగా భూసుర శుద్ధ సత్త గుణపూర్ణుడైన బ్రాహ్మణ బాలకుని లక్షణాలతో భాసిస్తున్నాడని దైత్యరాజు దిగులుపడ్డాడు. చదివిస్తే చురుకుతనం చేకూరి కరకెక్కి (కఠినుడై) అక్కరకు రాకపోతాడా అని ఆశతో కొడుకుని అక్కున చేర్చుకొని ‘బాబూ! చదువు చాలా ముఖ్యం. చదువురానివాడు విజ్ఞుడు కాలేడు. అజ్ఞానిగా ఉండిపోతాడు. చదివితే మంచి చెడు వివేకం కలుగుతుంది. కాన, కుమారా! గురువుల దగ్గర నిన్ను చదివిస్తా. రమ్ము నాయనా! చక్కగా చదివి చతురుడవు కమ్ము’ అని పలికి ఆశీర్వదించాడు. ‘విద్యా ధనమేవ ధనం’ విద్యయే వాస్తవ ధనం. ‘విద్యా విహీనః పశుః’ విద్య రానివాడు వింత పశువు. అనవద్యమైన విద్య విలువను వర్ణించే హృద్యమైన ఈ కంద పద్యం పోతనగారి సొంతం! అయితే ఇక్కడ విద్య చదువు అంటే నైతికతతో కూడిన సనాతన భారతీయ ధార్మిక విద్య. ఈ విద్యలో ప్రహ్లాదుడు పుట్టుకతోనే పండితుడు. ఇక అతనిని అసురరాజు చదివించేదేముంది?
కం॥ ‘చదువని వాడజ్ఞుండగు
జదివిన సదసద్వివేక చతురత గలుగుం
జదవగ వలయును జనులకు
జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ!’
నారద ఉవాచ రాజా! హిరణ్యకశిపుడు వెంటనే రాజపురోహితుడైన శుక్రాచార్యుని కుమారులను, ప్రచండ వితర్కు (తర్కశాస్త్ర నిష్ణాతు)లైన చండ, అమర్కులను రప్పించి, మెండుగ సత్కరించి వారితో ఇలా పలికాడు. గురుపుత్రులు, దయా సింధువులైన మీరు మాకు అత్యంత ఆప్తులు, ఆత్మబంధువులు, వందనీయులు. నా ఆత్మజుడు పుత్రుడు అజ్ఞానంతో అంధుడై అలమటిస్తున్నాడు. ఎప్పుడూ అలసుని వలె సోమరిలాగా, స్తబ్ధతతో ఉంటాడు. మా పౌరుషం, ప్రతాపం, మా వీరావేశం లేశం (కొంచెం) కూడా లేనివాడు. గురుపుత్రులారా! దయతో మా మాట మన్నించి, వీణ్ని చదివించి, నీతి చతురునిగా చేసి నన్ను, నా వంశాన్ని నిలబెట్టి మాకు మనఃప్రీతి కలిగించండి.’ తోటి అసుర కుమారులతోపాటే కూర్చోబెట్టినా గురువులు ప్రత్యేక శ్రద్ధతో ప్రహ్లాదుని చదివించ సాగారు. ప్రధానమైన శాస్త్రాలు పఠింపజేశారు. ఏకసంథాగ్రాహి అయిన ప్రహ్లాదుడు పురుషోత్తముని మీది పూర్ణభక్తితో అన్ని శాస్ర్తాలలో ఆరితేరాడు. ఆచార్య పుత్రులు తనకు ఆసక్తి లేని అసత్యాలైన, మిథ్యా భూతాలైన అనాత్మ విద్యలు బోధించినా కాదని ఆక్షేపించక, చెప్పినట్లే చదివి అవన్నీ సాధించాడు. ఇలా కొంతకాలం గడవగా కొమరునికి చదువు ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని అంతరంగంలో చింత కలుగగా అమరారి ఆనందంతో భవ మహార్ణవ తారకుడు (సంసారమనే మహాసముద్రాన్ని దాటించేవాడు), కామ రోష లోభాది విరోధి వర్గ పరిహారకుడు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అంతశ్శత్రువులను అంతమొందించినవాడు), కేశవ చింతనామృతాస్వాద కఠోరకుడు (నీరజాక్షుని నిరంతర ధ్యానమనే అమృతాన్ని ఆస్వాదించడంలో నిష్ఠ కలిగినవాడు), కలుష జాల మహోగ్రవనీ కుఠారకుడు (కలుషా పాపా లనే కారడవిని ఖండించే కుఠారం గొడ్డలి వంటివాడు) అయిన ప్రహ్లాద కుమారకుని కొరకు కబురు పంపాడు. చండామర్కులతోపాటు చెంతకు చేరిన పుత్రుని చూచి దితిపుత్రుడు రమ్మని చేరదీసి అతి వాత్సల్యంతో ఒడిలో కూర్చోబెట్టుకొని, వత్సా! బడిలో ఉత్సాహంగా ఏలుబడి (రాజ్యపాలన)కి కాబడిన (అవసరమైన) రాజనీతి శాస్త్రం అధ్యయనం చేశావా? వేదాలు వల్లించావా? చట్టాలు శాస్త్రాలు చదివావా? ఇంపుగా సంవిత్ జ్ఞాన సంపన్నుడవయ్యావా? అని అడిగి మరల ఆసక్తిగా ఇలా అన్నాడు…
కం॥ ‘అనుదిన సంతోషణములు
జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్
తనయుల సంభాషణములు
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్’
కుమారా! తనయుల తియ్యని మాటలు అనయము (సదా) తల్లిదండ్రులకు తేనెల ఊటలు. వారి వచ్చీరాని పలుకులు పంచదార చిలకలు. ఎంత విన్నా విసుగనిపించని వీనుల విందులు (మనసుకు ఎంతో పసందులు). పరిశ్రమ, పరితాపాల వలన కలిగే కష్టాలను మరపించే ఇష్టమిష్టాన్న మధుర పదార్థ రూపాలు.’ ‘వత్సా! గురువులు నేర్పిన పాఠాలలో నువ్వు మెచ్చిందీ, నీకు బాగా నచ్చిందీ, మంచి అనిపించిందీ, అంచితంగా నోటికి వచ్చిందీ ఏదో ఎంచుకొని, నాకు వినిపించి మురిపించు తండ్రీ!’ అని కోరిన తండ్రితో చిన్నారి పాపడు తడుముకోకుండా ఇలా నుడివాడు.
ఉ॥ ‘ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలం
ద్రెళ్లక వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవ
ర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునం
దుల్లము జేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!’
“ఓ దైత్యరాజ ప్రముఖా! పితృదేవా! నాకు నచ్చిన విషయం ఒక్కటే. అదేదోకాదు, సర్వశాస్త్ర సారభూతమైన కరుణామయ నారాయణ చరణ శరణాగతి! సర్వ సాధన చరమ పరిణతి (అంతిమఫలం) అయిన భగవచ్చరణ రతియే సర్వ జీవులకు అంతిమగతి! మూఢులైన మానవులంతా సంసారమనే గాఢ (చిమ్మ) చీకటి నూతిలో దిగబడి, కొట్టుమిట్టాడుతూ బయటపడలేక ఉక్కిరిబిక్కిరవుతూ, ‘మీరు వేరు, మేము వేరు’ అన్న భేద భ్రమతో మతిచెడి ప్రవర్తిస్తున్నారు. అలాకాక, ‘వాసుదేవస్సర్వమితి’ ‘అంతా వాసుదేవుని విచిత్ర లీలా విలాసమే’ అని తెలుసుకొని, మాధవుని యందు మది నిలిపి అడవిలో నివసించడం మంచిది అని నా తుది తీర్పు!” (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Read More :
పోతన భాగవతం | ప్రజ్ఞానమే ప్రహ్లాదం
పోతన భాగవతం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!
పోతన భాగవతం | వైరులూ హరి వారలే!
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి
పోతన భాగవతం | భద్రమైన గురుబోధ
పోతన భాగవతం | పరివర్తన చెందడానికే!