శా॥ గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్
రేలన్ ఘస్రములం దమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ
వ్యాళాదిత్య నరాదిజంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శ
స్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే.
హిరణ్యకశిపుడు హిరణ్యగర్భుని (బ్రహ్మదేవుని) ఇలా (హిరణ్యాక్ష) వరాలు వేడుకొన్నాడు- ‘విధాతా! గాలిలో కానీ, నేల మీద కానీ, నిప్పులో కానీ, నీళ్లలో కానీ, నింగిలో కానీ- పంచభూతాల్లో ఏ ఒక్కదానితో కూడా నేను వంచనచే పంచత్వం (మరణం) పొందరాదు. రాత్రి కానీ, పగలు కానీ- చీకటిలో కానీ, వెలుగులో కానీ నాకు చావు రాకూడదు. సాటి దైత్యదానవులచే కానీ, మాటున ఇంద్రాది దేవతలచే కానీ, సింహ శార్దూలాది క్రూరమృగాలచే కానీ, నక్రాది (మొసళ్లు మొదలైన) అవక్ర జలచరాలచే కానీ, నరులచే కానీ, నాగేంద్రులచే కానీ నాకు నిధనం (మృత్యువు) సంభవింపరాదు. ఎవరితో ఎట్టి సమరంలోనైనా ఎదురులేని శౌర్యంతో నేను అమరుణ్నై ఉండాలి. ఏ అస్త్రం చేత కానీ, శస్త్రం చేత కానీ నేను సంహరింపబడరాదు. సురజ్యేష్ఠా! త్రిలోకాలలో నాకు మరణం లేని జీవనం ప్రసాదించు ప్రభూ!’
మూలంలో ఉన్న ‘స్రష్టా! నీ సృష్టిలోని ఏ ప్రాణిచే కానీ’, ‘లోపల కానీ, వెలుపల కానీ’, ‘ప్రాణం ఉన్నదానిచే కానీ, ప్రాణం లేనిదానిచే కానీ’ నేను చావరాదు- అన్న సమయాలు (షరతులు) ఈ సందర్భంలో తెనుగు భాగవతంలో తెనిగింపబడలేదు. కానీ, దైత్యవధ తర్వాత ‘సంహార పద్ధతి వర్ణన’ ప్రసంగంలో మాత్రం పోతన, విరించి (బ్రహ్మ) ఇచ్చిన ఈ వరాలు కూడా పాటిస్తూ నృసింహుడు అమరవిరోధిని వధించాడని వక్కాణించాడు.
హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని ‘యద్యపి లోకే మరణం శరణం’- ఈ మృత్యులోకంలో సర్వప్రాణులకు తప్పని ‘శరణ’(గతియైన)మైన ‘మరణం’ రాకుండా వరమివ్వమని ‘వరణం’ చేశాడు. అది జీవులకు అతి దుర్లభమైనా ప్రసన్నుడైన పితామహుడు కరుణతో ప్రసాదించానని ‘హామీ’కూడా ఇచ్చాడు. అసురులందరూ ఇలాగే మృత్యువులేని జీవితం వరంగా కోరినవారే. దానవులకే కాదు, మానవులకు మాత్రం మరణించాలని ఉంటుందా?
కం॥ ముదిసెను దంతావళియును
ముదిసెను కేశములుఁ దనువు ముదిసెం దనకున్
ముదియనివి రెండు చిక్కెను
బ్రదికెడి తీపియును విషయపక్ష స్పృహయున్
‘పళ్లు రాలిపోయాయి. వెంట్రుకలు తెల్లబడి పోయాయి. శరీరం శిథిలమైపోయింది. ప్రాణాల మీది తీపి, ఇంద్రియ సుఖాల పట్ల కోరిక,- దేవయానీ! ఈ రెండూ మాత్రం ముదియకుండా- ముసలికాకుండా ఉన్నాయి’ అని నవమ స్కంధంలో యయాతి మహారాజు తన రెండు యవ్వనాల అనుభవసారాన్ని దేవయానికి వినిపిస్తాడు. అయినా, మరణం లేని జీవనం సాధ్యమా? అంటే, రాజస స్వభావం- దేహాభిమానం, ‘దేహమే నేను’ అన్న భావం ఉన్నంత వరకు ఇది అసాధ్యం. శుద్ధ సత్త బుద్ధితో- ‘నాహం దేహః జన్మమృత్యూకుతోమే’- నేను దేహం కాదు. జన్మ మరణాలు నాకు ఎక్కడివి? అన్న ఉత్తమ బుద్ధి- ఆత్మజ్ఞానం మదిలో ఉదయించి పదిలమైనప్పుడే ఇది సాధ్యం. అట్టి విశుద్ధ విజ్ఞానం లేకుండా ఇట్టి అమృతఫలం పొందాలనుకోవడం కేవలం అత్యాశ, అడియాస, అవివేకం! భౌతిక దేహంతో స్వర్గప్రాప్తే దుర్లభమైనప్పుడు అపవర్గ (అమరత్వ) ప్రాప్తిని గురించి ఇంక పలికేదేముంది? చిత్తం ఐహిక భోగాల యందు అనురక్త- ఆసక్తమైనట్లుగా పరబ్రహ్మ యందు పాదుకుంటే- లగ్నమైతే, ఎవని భవబంధాలు భగ్నం కాకుండా ఉంటాయి? బ్రహ్మానుభవం లేకనే బ్రహ్మను గురించి కేవలం పలకడంలో ప్రవీణులు, విషయ సుఖాల పట్ల విశేష- అధిక, రాగం కలవారు చొక్కపు అజ్ఞానులే! అట్టివారు నిక్కముగా జనన మరణాలలో చిక్కి ఇక్కట్లు పడుతూ ఉంటారు.
‘దేహాత్మ జ్ఞానవద్ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకమ్, ఆత్మన్యేవ భవేద్యస్య సనేచ్ఛన్నపి ముచ్యతే’– ‘నేను దేహమును’ అని దృఢంగా తలచునట్లు, ‘నేను ఆత్మను’ అని గాఢంగా విశ్వసిస్తే వాంఛ లేకున్నా నిశ్శ్రేయస్సు- మోక్షం వస్తుందని వరాహోపనిషత్తు వక్కాణించింది. అయితే, అలాంటి సద్బుద్ధి- ఆత్మబుద్ధి రాజస స్వభావం కల్గిన ఈ దైత్యవిభునికి ఎక్కడినుంచి వస్తుంది? మరి హిరణ్యగర్భుని హామీ ఏమైనట్లు?
ఈ సందర్భంలో సంస్కృత భాగవతంలో బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునితో పలికిన గుంభన (రహస్య)మైన మాట ఒకటుంది- ‘అసురేశ్వరా! నీవు మరణశీలివి, (మర్త్యస్య తే అమర్త్యస్య), నేను అమరుణ్ని. కాన, నా దర్శనం వ్యర్థం మాత్రం కాదు’ అని. కథ వినిపిస్తున్న నారదముని కూడా ధర్మరాజుతో- భగవత్ స్వరూపుడైన బ్రహ్మదేవుని వర ప్రదానం వృథా కాదనే అన్నాడు. ఇందులో దాగిన పరమార్థాన్ని పోతన అమాత్యుడు పితామహుని (బ్రహ్మ)చే హిరణ్యకశిపునికి హితావహం (క్షేమకరం)గా పలికించాడు. వరం అనుగ్రహించి విధాత ఊరుకొనక దేవ విరోధితో సన్నాయి నొక్కులు నొక్కుచూ..
శా॥ అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్,
మున్నెవ్వారలుఁ గోర రీవరములన్, మోదించితిన్ నీ యెడన్
నన్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సం
పన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైకశీలుండవై!
‘అన్నా! కశ్యప కుమారా! నీవు అందుకోవాలని ఆశిస్తున్న ఈ వరాలు ఎంతవారికైనా పొందరానివి. మున్నెన్నడూ- గతంలో ఇట్టి వరాలు ఎవరూ కోరనూ లేదు, నేను ఇవ్వనూ లేదు. తపస్సుతో నన్ను మెప్పించావు కాన నీవు కోరినవన్నీ ఇస్తున్నాను. భౌతికంగా మాత్రమే కాక, నైతికంగా కూడా నేర్పరివై, బుద్ధిమంతుడవై, సౌశీల్యంతో, సౌమనస్యం- మంచిమనసుతో ఈ క్షణం నుంచి క్రమశిక్షణతో స్వ-పర రక్షణ శీలం కలిగి క్షేమంగా జీవించు’ అని దీవించి నిష్క్రమించాడు.
రాజస ప్రవృత్తికల అసురరాజుకిదెలా బోధపడుతుంది? పడకనే తికమకపడి తానిక అజరామరుణ్ణని అహంకరించాడు. దానితో గరుడ, గంధర్వాది దేవతాగణాన్నంతటినీ బాధించసాగాడు. ఇంత బతుకూ బతికి ఇంటి వెనుక చచ్చాడన్నట్లు హిరణ్యకశిపుడు చావు తెలివితో విరించినే వంచించానని ఎంచి సురశరణ్యుడైన హరిమాయకు గురియై, తను కోరిన వరాలలోనే తన చావును వరించాడు! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More : వరించి వచ్చిన విరించి
పోతన భాగవతం | దెయ్యాలూ వేదాలు వల్లిస్తాయి!
పోతన భాగవతం | వైరులూ హరి వారలే!
పోతన భాగవతం | దీని భావమేమి శుక మునీంద్ర
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి
పోతన భాగవతం | భద్రమైన గురుబోధ
పోతన భాగవతం | పరివర్తన చెందడానికే!