యాచారం, మే 29: రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్మా బాధిత రైతులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసనలకు దిగనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద శనివారం ధర్నా చేపట్టనున్నట్టు కమిటీ సమన్వయకర్త సరస్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు ఈ ధర్నాలో పాల్గొననున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ నాలుగు గ్రామాల రైతుల మొర ఆలకించాలని సరస్వతి, తదితరులు కోరారు.