పరమేష్ఠి, ప్రజాపతి అయిన బ్రహ్మకు పురాణ గాథలను బట్టి మానసికంగా, వాచికంగా మాత్రమే కాని కాయికంగా (విగ్రహపరంగా) విశేష పూజార్హత లేదు. ఆలయం కూడా ‘బ్రహ్మ కమలం’ వలె దుష్కరంగా దేశంలో ప్రాచీనమైన ఒక్క ‘పుష్కర’ (రాజస్థానం) క్షేత్రంలోనే ఉంది. భాగవత ‘అవతారిక’ (పీఠిక)లో పోతన మూర్తిత్రయంలోని నలువ (బ్రహ్మ)కు చెలువు మీరగ సమర్పించిన వాఙ్మయ (వాచిక) ఉత్పల- కలువ పూలమాలే ఈ హృద్యమైన పద్యం. తెనుగు పద్యానికి నిండైన సంగీత సాహిత్య శోభను గూర్చే అంత్యప్రాసల మండనా (అలంకారా)లతో కూడిన మృదుమధుర మంజుల సమాస గ్రథనం-కూర్పు మన పోతనలో మెండు.
ఉ॥ ఆతత సేవసేసెద సమస్త చరాచరభూత సృష్టి వి
జ్ఞాతకు భారతీహృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతానికర నేతకుఁగల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభప్రదాతకున్
‘సమస్త చరాచర భూతజాతానికి చెందిన చిత్రవిచిత్రమైన అశేష సృష్టి విధానం విశేషంగా నేర్చినవాడు, సర్వరస స్వరూపిణి అయిన సరస్వతీదేవి స్వాంతాని (మనస్సు)కి ఆసాంతం ఆహ్లాదం కలిగించువాడు, ఆదిదేవుడైన మాధవుని దయతో సంకల్ప మాత్రం చేతనే నాలుగు ముఖాలతో నాలుగు వేదాలు ధరించి, వాటి పదార్థ పరమార్థ నిర్ణయం చేసిన మేటి వాక్పటిమ గలవాడు, సురజ్యేష్ఠుడు కాన పితామహునిగా పెద్దరికంతో బృందారక (దేవతా) బృందానికి నాయకుడై నడిపించేవాడు, కల్మష (పాప) విజేత కాన నుతించేవారి కలుషా (పాపా)లను కడిగివేయువాడు, నతించే- నమస్కరించే వారిని కాపాడేవాడు, నిఖిల ముని నికరా (బృందా)నికి సకల శుభాలు కలిగించేవాడు అయిన ధాత (సర్వధారి)కు, విధాత (సర్వకర్త)కు- బ్రహ్మదేవునికి ఆతత- విస్తృతమైన సేవలు సమర్పించుకొంటున్నాను.
మ॥ దివిజానీక విరోధి మ్రొక్కెఁగని వాగ్దేవీ మనోనేతకున్
సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ సత్తపో
నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్
వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్
నారదుడు ధర్మరాజుకు వివరిస్తున్నాడు… నరనాథా! ఖిన్నులై శరణాపన్నులైన విబుధుల (దేవతల) విన్నపం విన్న విధాత మనసు కరగగా ఉన్నపళాన మందరగిరి దరికి వచ్చి కఠిన తపస్సు గావిస్తున్న కనకకశిపుని కన్నాడు. చీమలు అతని మేనులోని మజ్జా, మాంస, చర్మాలను కొరుకుచూ రక్తం పీలుస్తున్నాయి. అట్టి దేహం మీదే పుట్టలు పెరిగాయి. గడ్డి దుబ్బులు కట్టాయి. పుట్టలో ఉన్నా, మిన్నులో దట్టమైన కారుమబ్బుల మాటున దాగిన ఇన (సూర్య) బింబం వలె ఉన్న అసురుని కని అచ్చెరువొందాడు అరవిందభవుడు- బ్రహ్మ. ముచ్చటపడ్డాడు. మందహాసం చేస్తూ ఇలా అన్నాడు- అన్నా! కశ్యప పుత్రా! ఇట్టి కఠిన తపం మునుపెన్నడూ కన్నదీ విన్నదీ కాదు. ఇకముందు కూడా ఎందునా ఉండబోదు. వంద దివ్య వత్సరాలు తపస్సు చేసి మాకు కనువిందు చేశావు.
బక్కచిక్కిన నీ బొందిలో బొమికలు మాత్రమే మిగిలాయి. అయినా, బృందారక వైరీ (దేవ విరోధీ)! ఇంతదాకా నీలో అసువులు (ప్రాణాలు) ఎలా నిలిచాయో అని నాకు విసుమానం (విస్మయం) కలుగుతోంది. వత్సా! నిన్ను మెచ్చాను. నీ మీది వాత్సల్యంతో వచ్చాను. నీ ఇచ్చ వచ్చిన వరాలు అడిగి పుచ్చుకో. దైత్యపతీ! లెమ్ము లెమ్ము. నా దర్శనం వమ్ము కాదు’ అని పలికి పితామహుడు మంత్రజలం చల్లగా ఆ ప్రభావంతో పూర్వగీర్వాణుడు (అసురుడు) అపూర్వ గర్వాతిరేకంతో అపరంజి (బంగారు) వన్నెగల వజ్రం వంటి దేహంతో ఎండుకట్టెల నుంచి భగ్గున మండుతూ పైకి లేచిన పావకుని (అగ్ని) వలె ప్రకాశించాడు.
నారద ఉవాచ- అవనీనాథా! ఆకసంలో అంచ వాహనంపై అలరారుతున్న విరించి (బ్రహ్మ)ని గాంచిన అమర విరోధి (దానవుని) ఆనందానికి అవధుల్లేవ్.
వీణాపాణి, అలివేణి, విద్యలరాణి వాణీదేవి మనోనాథుడు, హృద్యమైన విశిష్ట విద్యానందాలను ప్రసాదించు వాడు, లోనమ్మి నమస్కరించే వారిని అన్నివిధాల ఆదుకునేవాడు, ఉత్తమ తాపస బృందాల డెందాలలోని అభీష్టాలను అనుగ్రహించేవాడు, ఈ విశాల విశ్వాన్ని విరచించినవాడు, వివిధ ప్రాణుల తలరాతలను రాసే మహావిద్యలో విశారదుడు అయిన విరించి (బ్రహ్మ)కి నెన్నుదురు నేలకు సోకునట్లు నమస్కరించాడు వెన్ను (విష్ణు)ని విరోధి.
కం॥ కోరిన వారల కోర్కులు
నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియనన్యుల్
నేరరు కరుణాకర! నేఁగోరెద, నీ విచ్చెదేనిఁ గోరిక లభవా!
కన్నులు చెమ్మగిల్లి తనువు తన్మయత్వంతో రంజిల్లగా అంజలి ఘటించి కంజగర్భు (బ్రహ్మ)ని వినుతించి ఇలా విన్నవించాడు-
‘ఓ కరుణాకరా! కోరిన వారి కోరికలు నేర్పుగా తీర్చి కాపాడటంలో మేటివైన నీకు సాటిరాగల వారెవ్వరూ లేరు. విధాతా! నాకు వరాలు ఇస్తానంటేనే వేడుకుంటా!’- అంత్యప్రాసల లాస్య విన్యాసాలతో చతురాస్యు (బ్రహ్మ)ని వర్ణిస్తూ కాశ్యపుడు- హిరణ్యకశిపుడు పఠించిన అమూల్యమైన సువర్ణ మత్తేభ వృత్తం అమూలకం. ‘ననామ శిరసా భూమౌ’ (నేలకు తల తగిలించి నమస్కరించాడు)- అని మాత్రమే ఉన్న మూలానికి ఇది ఇంపొసగెడి పెంపుదల. సంస్కృతంలోని- ‘యది దాస్యస్యభిమతాన్ వరాన్మే వరదోత్తమా’ అనే పంక్తికి పై కందపద్యం అందమైన అనువాదం.
రజోగుణ దూషితుడైన దైత్యరాజు- ‘నువ్వు ‘కాదు లేదనక’ ఇస్తానంటేనే నేను అభ్యర్తిస్తా’ అని పెచ్చరిల్లిన రాజసంతో పితామహుని హెచ్చరిస్తున్నట్లుగా ఉచ్చస్వరంతో ఇలా
ఉచ్చరించాడు..
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006