హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖను అవినీతిరహితంగా తీర్చిదిద్దాలంటే ఆ శాఖ ప్రక్షాళన జరుగాలని, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను సమర్ధంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆమె బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావుతోపాటు పలువురు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖలో అవినీతి, ఆఫీసు నిర్వహణలో లోపాలు, ఆలయాలవారీగా జరుగుతున్న అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి కొండా సురేఖ ఆయా కథనాలను చూపిస్తూ.. ‘ఇందులో వాస్తవమెంత? వీటిపై విచారణ చేపట్టారా? ఒకవేళ విచారణ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నార’ని అధికారులను ప్రశ్నించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన అవినీతిని తాను సహించకుండా అక్కడి ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేసిన సంగతిని ఆమె గుర్తుచేశారు.
ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో మతపరమైన ఉద్యోగాల నియామకంలో జరిగిన అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో నియామకాలు, పరీక్షల నిర్వహణ ఎలా జరుగుతున్నాయని మంత్రి ఆరా తీశారు. ఆలయాలకు సంబంధించిన బడ్జెట్ విషయంలో కూడా మంత్రి కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలిసింది. దేవాలయాలవారీగా సమీక్ష చేసిన మంత్రి కొందరు అధికారుల పనితీరుపై మండిపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనాలపై దృష్టి పెట్టి, లోపాలు ఎక్కడ ఉన్నా వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న అంత్య పుష్కరాల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్న సురేఖ.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో చెల్లించి వారికి అండగా నిలబడుతున్నదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండాసురేఖ అన్నారు. బుధవారం బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్ క్యాంపు కార్యాలయంలో 12 మంది అర్చక మాజీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు అర్చక సంక్షేమ నిధి నుంచి రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ మొత్తం రూ.71,20,000 చెక్కులు అందించారు.