హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఉలిక్కిపడింది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగమేఘాల మీద బుధవారం హైదరాబాద్ జిల్లా పరిధిలోని పలు ఖాళీ స్థలాలను పరిశీలించారు. దీంతో రెండున్నరేండ్లయినా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా నిర్మించలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఒప్పుకున్నట్టయింది.
సచివాలయంలో మీడియాతో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నిర్మించిన ఇండ్ల కంటే వచ్చే రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మించకపోతే తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా? అని వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ ఇన్నర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.