చతుర్థ స్కంధం చివర ‘భక్తకవి ప్రవర’ పోతన అమాత్యుని, రామభక్తి అనే గంధంతో గుబాళించే, ‘అంత్యానుప్రాస’నాద మాధుర్యంతో వీనులకు విందు కూర్చే అందమైన ‘కంద’ పద్యమనే కుంద (మల్లెపువ్వు) పరిమళాన్ని మునుముందుగా ఆస్వాదించి అటుపైన కథను అందుకుందాం.
కం॥ శర విదళిత సారంగా!
సరస దయాపాంగ! భక్తి జలధి తరంగా!
దురిత ధ్వాంత పతంగా!
వరజనకసుతానుషంగ! వననిధి భంగా!
మొక్కవోని ఒక్క బాణంతో అలవోకగా అపరంజి (బంగారు) లేడి రూపంలో ఉన్న నీచుడైన ఆ మాయా మారీచుని కూల్చినవాడా! శరణాగతులైన దీనులపై కరుణతో కూడిన కటాక్ష వీక్షణాలు కురిపించువాడా! భక్తజనుల అంతరంగాల్లో భక్తి తరంగాలను నిరంతరాయంగా పొంగి పొరలించువాడా! అఘ (పాప)మనే గహన (గాఢ) అంధకారాన్ని అణచివేసే ఆదిత్య (సూర్య) స్వరూపా! నీ ఉజ్జల కీర్తికి ఉనికిపట్టుగా జలనిధి (సముద్రం)పై వారధి (సేతువు) కట్టి జడబుద్ధి (అహంకారి) అయిన సముద్రుని మదమును దమింపజేసినవాడా! జానకీ మనోహరుడవైన ఓ పురుషవరా! రఘునందనా! సేతుబంధనా! నీకు వందన చందనాలు!
నారద మహర్షి ప్రాచీన బర్హితో… మహారాజా! కాలపుత్రిక జర పురంజనుని పురాన్ని బలవంతంగా ఆక్రమించి అనుభవించింది. ప్రజ్వారుడు ఆ పురాన్ని పూర్తిగా ప్రజ్వలింప (దగ్ధం) జేశాడు. పెంచుకొన్న మమత వల్ల ప్రేమబంధం తెంచుకోలేక భార్యాబిడ్డల భవిత (భవిష్యత్తు) గురించి అమితంగా అలమటించాడు పురంజనుడు. అంతలోనే ఎరుక (తెలివి) నశించి గొంతులో నుంచి వడివడిగా వింత సవ్వడి-గురక ఉరకలెత్తింది. బలదర్పం క్షీణించి సర్పం (ప్రాణం) ఒడలిని వీడి వెడలిపోగానే పురం (శరీరం) పురంజునుని (జీవుని) విడిచి పంచభూతాల్లో విలీనమైపోయింది.
ఇంతవరకు తనను కంటికి రెప్పవలె అంటిపెట్టుకొని చెంతనే ఉన్న తన పూర్వసఖుని, అవిజ్ఞాతుని (అచ్యుతుని) అంతకాలంలోనైనా చింతింపలేకపోయాడు జీవుడు పురంజనుడు. పూర్వం తాను దయమాలి చంపిన యజ్ఞపశువులు పరలోకంలో కోపంతో అతనిని గొడ్డళ్లతో ఖండఖండాలుగా నరికాయి. ఇలా బహుకాలం అనేక యాతనలు అనుభవించి అవసానకాలంలో అతివ (స్త్రీ)ను-భార్యను స్మరిస్తూ అసువులు (ప్రాణాలు) విడిచినందున మరుజన్మలో దక్షిణ భారతంలోని విదర్భరాజు పుత్రిక వైదర్భి (పురంజని)గా పుట్టాడు.
విదర్భ- అనగా విశేషంగా, విరివిగా దర్భలు కల అంటే కర్మకాండకు ప్రాముఖ్యం కలిగిన జన్మ. యుక్త వయస్కురాలైన వైదర్భికి మలయధ్వజుడనే పాండ్యరాజుతో పెండ్లి జరిగింది. ఆ పుణ్య దంపతులకు ఒక పుత్రిక, ఏడుగురు పుత్రులు కలిగారు. ద్రవిడ దేశం భక్తికి జన్మభూమి. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత- త్రి సుతాచార్యులకు (శంకర, రామానుజ, మధ్వాచార్యులకు) పుట్టినిల్లు. కాన, పుత్రిక అనగా భక్తి అని, పుత్రసప్తకం భక్తికి లక్షణాలైన శ్రవణ, కీర్తన, స్మరణాదులని, అగస్త్యుడు అనగా మనస్సని, పుత్రికను (భక్తిని) అగస్త్యునికిచ్చి వివాహం చేశారని
అధ్యాత్మపరంగా అర్థం చెప్పారు ఆచార్య శ్రీధర స్వామి.
రాజర్షి మలయధ్వజుడు రాజ్యాన్ని పుత్రరత్నాలకు పంచి ఇచ్చి వానప్రస్థుడై వనానికి వెళ్లాడు. మహారాణి సాధ్వి వైదర్భి (పురంజని) కూడా నెలరాజు వెన్నంటి వెళ్లే వెన్నెల వలె భక్తితో భర్తను అనుగమించింది. పతిని ఎడబాయక పరిచర్యలు చేసింది. సుదీర్ఘకాల తపస్సు ఫలించి మలయధ్వజునికి శ్రీహరి భగవానుని దర్శన భాగ్యం కలిగింది. ఆయన దుఃఖసాగరమైన సంసారం నుండి వైదొలగి విదేహముక్తి (సిద్ధి) పొందాడు. ఆ నిర్జన
అరణ్యంలో వైదర్భి (పురంజని) హృదయ విదారకంగా విలపించింది.
కట్టెలతో చితిపేర్చి పతి కళేబరాన్ని పెట్టి, అగ్ని రగిల్చి తాను సహగమనానికి పూనుకుంది. అంతలోనే పూర్వసఖుడైన అవిజ్ఞాతుడు గురు రూపంలో వచ్చి ఆమెకు (పురంజనునికి) స్వరూప బోధ చేశాడు- ‘వనితా! నన్ను గుర్తించలేదా? నీ పూర్వ మిత్రుణ్ని. మనిద్దరం మానస సరస్సులో సఖ్యతతో సుఖంగా నివసించే హంసలం. నీవు వైదర్భివి కావు. ఈ మలయధ్వజుడు నీకు మగడూ కాడు. నీవు పూర్వజన్మలో పురంజనుడవనే రాజువని, ఈ జన్మలో ఇతని భార్యవని భావించడం కూడా అసత్యమే! ఇదంతా నా మాయాసృష్టి. మన స్వరూపాన్ని చూడు- నేనే నీవు, నీవే నేను. అంతేకాని వేరు కాదు. పండితులు మనిద్దరిలో ఏ కొద్దిపాటి భేదమూ పాటించరు.’
నారద ఉవాచ- ప్రాచీనబర్హి మహారాజా! జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని (తత్తమసి- తత్, త్వం, అసి- ఆ పరబ్రహ్మవు నీవే అయి ఉన్నావు) బోధించే ఈ నిగూఢమైన అధ్యాత్మ తత్తాన్ని పురంజన మహారాజ కథ నెపంతో నీకు బోధించాను. అవిజ్ఞాతుని (ఈశ్వరుని) ఉపదేశం వలన తేరుకొని వైదర్భి రూపంలో ఉన్న పురంజనుడు అతని (ఈశ్వరుని) ఎడబాటు వలన కలిగిన తడబాటు (అజ్ఞానం) కారణంగా తాను కోల్పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందాడు. రాజా! ‘తాను ప్రకృతికి అతీతుడైన పరమాత్ముడే’ అన్న తెలివి కోల్పోయి పురుషుడు ప్రకృతి (సత్త, రజో, తమో) గుణాలలో ఆసక్తుడై కర్మలలో మునిగి తేలుతూ ఉంటాడు. ఆయా కర్మలకు తగినట్లు దేవ, మానవ, పశు రూపాలతో జన్మిస్తూ ఉంటాడు.
మ॥ ఎనయన్ క్షుత్పరి పీడఁగుంది శునకం బింటింటికిన్ బోవఁ బూ
నినఁదైద్దెవికమైన దండహతి గానీ, కాక చౌర్యాన్నమై
నను గానీ తగఁబొందు చందమున నెన్నన్ దైవ యోగంబు పెం
పున నీ జీవుడు దాఁ బ్రియాప్రియములం బొందుంద్రిలోకంబులన్
ఆకలి బాధకు తాళలేక గ్రామసింహం (కుక్క) వేళ-పాళ చూడకుండా వాడ-వాడకు, గడప-గడపకు తిరుగుతూ కర్మఫలంగా దండ ప్రహారమో (కర్రదెబ్బో), దొంగకూడో తిన్నట్లు జీవుడు కూడా దైవయోగంతో ఇష్ట, అయిష్టాలను నిర్దుష్టం (కచ్చితం)గా అనుభవిస్తాడు. బరువు మోసే బడుగు (బీద)వాడు తలమీది బరువును భుజం మీదికి మార్చుకున్నా ‘మోత మోసే రాత’ మాత్రం తప్పని విధంగా, జీవుల దుఃఖాలకు కూడా తాత్కాలికమైన ఉపశమనాలే తప్ప శాశ్వతమైన ప్రతిక్రియ (ప్రతీకారం, విరుగుడు) లేదే! (సశేషం)