హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అమెండెడ్ భారత్నెట్ ప్రొగ్రామ్(ఏబీపీ) కింద టీ-ఫైబర్ ఇంటర్నెట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో టీ-ఫైబర్ ప్రాజెక్ట్పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు హాజరయ్యారు. ప్రోగ్రాం అమలు దిశగా సీఎం పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అమలు ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్ నిధుల విడుదలను వేగవంతం చేయడంపై ఈ వీసీలో చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్ ఆస్తులను డిజిటల్ భారత్నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై సమాలోచనలు చేశారు. వీటిపై సింధియా సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
టీ-ఫైబర్ నెట్వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ అర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనున్నది. మొదటి దశలో దెబ్బతిన్న నెట్వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఈ వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బీ అజిత్రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ డీ అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.