పోతన భాగవతం | భగవంతునికి భక్తునికి మధ్యవర్తి అయిన నారద మహర్షి కర్మాసక్తుడైన ప్రాచీన బర్హికి ఆత్మధర్మాన్ని బోధించాడు- ‘రాజా! కర్మలే దుఃఖాలకు మూల కారణాలు. జ్ఞానహీనమైన కర్మ తనవంటి మరో కర్మను కాల్చలేదు. ఎందుకని? ఆ రెండూ అవిద్యా (అజ్ఞాన) మూలకాలే కనుక. కల్లుకుండను కల్లుతో ఎన్నిమార్లు కడిగినా అది చెల్లుతుందా? పరమార్థ స్వరూపమైన ఆత్మకు కలిగే అన్ని అనర్థాలకి అనన్య (ఏకైక) కారణం అవిద్య (తన స్వరూపం తాను విస్మరించడం) మాత్రమే!
సారి (కృష్ణ పరమాత్మ) యందలి పరమప్రేమ రూపమైన పరాభక్తి అవిద్య వలన కలిగిన సంసారాన్ని సమూలంగా పెకలిస్తుంది. సదా ముదావహమైన చిదానంద కృష్ణుని కథా సుధాపానం వలన ఏర్పడే నిర్మల, నిర్భర (అతిశయ, అనన్య) భక్తి శాశ్వత జ్ఞాన వైరాగ్యాలను కలిగించి దుర్భర సాంసారిక వ్యథలను విధిగా సమసింపజేస్తుంది. జ్ఞాన వైరాగ్యాలు భక్తి మాత యొక్క అనుంగు బిడ్డలని భాగవత సిద్ధాంతం. రాజేంద్రా! వేదానికి కర్మకాండ యందే పరమ తాత్పర్య (లక్ష్య)మని వాదించు మలిన మనస్కులకు వేదమర్మ (రహస్య)మైన ఆత్మధర్మం (తత్తం) తెలియరాదు. ప్రాచీన అగ్రాలైన పవిత్రా (దర్భ)లను పృథివీ మండలమంతా పరచి మహాయజ్వ (బహు యజ్ఞకర్త)ననే అహంకారంతో, అవినయంతో ఇహపరలోక కామ పూరణం కొరకు యథేచ్ఛగా పశుమారణం చేశావు. సర్వకర్మలలో ఏది ఉత్తమమో భగవదాయత్తము కాని (భక్తి తెలియని) నీ చిత్తమునకు ఇప్పటికీ తెలియదు. విద్యలలో అనవద్య (దోషరహిత)మైన విద్య ఏదోకూడా అద్యావధి (నేటి వరకు) నీవు ఎరుగవు’ అని అంటూ నయ విశారదుడు నారదుడు ప్రాచీన బర్హికి దయతో కర్మ, విద్యలు రెంటినీ నిష్కర్షగా ఇలా నిరూపించాడు.
ఉ॥ తోయరుహోదరాయ! భవదుఃఖహరాయ! నమోనమః పరే
శాయ! సరోజకేసర పిశంగ వినిర్మల దివ్య భర్మ వ
స్ర్తాయ! పయోజ సన్నిభ పదాయ! సరోరుహ మాలికాయ! కృ
ష్ణాయ! పరాపరాయ! సుగుణాయ! సురారిహరాయ! వేధసే!
రాజా! శ్రీహరికి సంతోషం కలిగించేదే సర్వోత్తమ కర్మ! శ్రీపతి యందు సతి (పతివ్రత) వంటి మతిని (చిత్తమును) నిలుపునట్లు చేసేదే అతి ఉత్తమ విద్య! ‘పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి!’, ‘చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు!’ అని భాగవతంలో బాల ప్రహ్లాదుని ప్రౌఢ వచనాలు! మైత్రేయుడు.. ‘దేవర్షి నారదుడు ప్రాచీనబర్హికి ఇలా ‘జీవేశ్వర’ తత్తాన్ని బోధించి, కర్మ గురించి అతని సంశయాన్ని బాధించి (తొలగించి), అతనిని రాజర్షిగా శోధించి (సంస్కరించి), తను సంకల్పించింది సాధించి సిద్ధలోకానికి వెళ్లిపోయాడు. ప్రాచీనబర్హి ప్రజాపాలనను పుత్రులకు అప్పగించి, తపస్సుకై కపిలాశ్రమానికి వచ్చి విషయాసక్తి వీడి, భక్తియోగంతో ముకుందునిలో మనసు నిలిపి లింగశరీరం భంగమై పోగా ముక్తి పొందాడ’ని మైత్రేయుడు విదురునికి వివరించాడు.
ప్రాచీనబర్హి పుత్రులు ప్రచేతసులు, ప్రేమతో ఉమాపతి ఉపదేశించిన రుద్రగీతాన్ని- రమాపతి స్తోత్రాన్ని జపిస్తూ పదివేల సంవత్సరాలు తపించి ఎలా సద్గతి పొందారో తెలుపమని విదురుడు అడుగగా మైత్రేయుడు ఇలా చెప్పాడు- విదురా! పరమ భాగవతులైన ప్రచేతసుల తపోనిష్ఠకు సంతసించి పురుషోత్తముడు ప్రత్యక్షమై కృపావృష్టి కురిపిస్తూ వారితో మధురంగా ఇలా ముచ్చటించాడు- ‘తాపస శ్రేష్ఠులారా! మీరందరూ సమాన భావంతో నన్ను సేవించారు. మీ పరస్పర స్నేహానికి నేను సంతృప్తి చెందాను. కండు మహర్షి వలన ప్రమ్లోచ అప్సరస కన్నకూతురు మారిష. అమృత సూతి-చందురుని అనుగ్రహంతో అమృతం తాగి పెరిగిన అపురూప సుందరి. మీ నాన్నగారి ఆనతో ప్రజాసృష్టికి పూనుకొన్న మీరు ఆమెను ప్రేమతో పెండ్లాడండి. ఈ సాధ్వి మీ అందరినీ సమానమైన ప్రేమతో సేవిస్తుంది. మీకు కోరినట్లు కీర్తిమంతుడైన కుమారుడు కలుగుతాడు. పుణ్యాత్ములారా! నా అనుగ్రహంతో అనేక దివ్య వత్సరాలు ఇహ, పర సుఖాలు అనుభవించి, నా యందలి భక్తి వలన చిత్తశుద్ధి పొంది నన్ను చేరుకుంటారు. సర్వకర్మలు నాకు సమర్పించి, నా అమృత కథలు వింటూ కాలం గడిపే సజ్జన గృహస్థులకు వారి ఇళ్లు, వాకిళ్లు, గుళ్లు, గోపురాల కన్నా పదిలాలు, పవిత్రాలు! అంతేకాని, ఎంత మాత్రం వారికి సంకెళ్లు కాజాలవు! నన్ను పొందిన వారికి ఎందునా శోక మోహాలు, హర్ష విషాదాలు చెందవు.’ ఇలా ప్రేమతో పలికిన పరమాత్ముని దర్శించి తమ రజస్తమోగుణాలు తొలగిపోగా పులకించి ప్రచేతసులు ప్రాంజలులై పురుషోత్తముని గద్గద స్వరంతో ఇలా ప్రస్తుతించారు.
భాగవత కథా ప్రారంభానికి ముందు పోతన తెలుగులో కృష్ణాంకితంగా అత్యంత హృద్యమైన షష్ఠ్యంత (షష్ఠీవిభక్తితో అంతమయ్యే) పద్యాలు రచించి కథానాయకుని నుతించి, నతులొనర్చినట్లు, ఇక్కడ ప్రచేతసుల స్తుతిలో కూడా సంస్కృతంలో చతుర్థ్యంతాల ఉత్పలాల (కలువల)తో ఉజ్జలమైన మాలను గుచ్చి ఉరుక్రముని (విష్ణుని) ఉరస్సీమ (వక్షఃస్థలం)ను అలంకరించి, నమస్కరించాడు. ‘కమలనాభా! నీ నాభి నుంచే బ్రహ్మాండమనే పద్మం ఉద్భవించింది. నీకు కైమోడ్పులు! జన్మాది దుఃఖాలను హరించే జనార్దనునికి జేజేలు! జీవుని వలె పరతంత్రుడు కాక సాక్షి రూపాన సర్వతంత్ర స్వతంత్రుడై విరాజిల్లు విష్ణుమూర్తికి వేల వందనాలు! పద్మపు పుప్పొడి వలె పసుపు పచ్చని పసిడి వస్త్రధారి-పీతాంబరునికి పరశ్శత ప్రణామాలు! పద్మాల వంటి పవిత్ర పాదాలవానికి, పద్మమాలాధరునికి, కార్య (జగత్తు) కారణము (ప్రకృతి)ల కంటె విలక్షణునికి, సర్వ కల్యాణగుణాభిరామునికి, సర్వదానవహరునుకి, సృష్టిస్థితిప్రళయకరునికి, సత్యానంద స్వరూపుడైన శ్రీకృష్ణునికి శతకోటి వందనాలు!’
ప్రచేతసుల నుతులు మెచ్చి, ప్రణతులు స్వీకరించి పరమాత్మ పరంధామానికి పయనమయ్యాడు. పూర్వం శివదూషణ చేసిన దక్షుడు తన పూర్వదేహం వదిలి మారిషా- ప్రచేతసులకు పుత్రుడయ్యాడు. ప్రచేతసులు వైరాగ్యం పొంది తమ పత్నిని పుత్రునికి అప్పగించి, సన్యసించి, ఆత్మవిచారణకై పశ్చిమ సముద్ర తీరంలోని జాబాలి ఆశ్రమానికి వెళ్లారు. అచ్చటికి నారదమహర్షి విచ్చేయగా ప్రచేతసులు సంతసించి ప్రపన్నులై-శరణువేడి, గృహాసక్తి వలన మరుగున పడిన పరమాత్మ తత్తాన్ని ప్రకాశింప చెయ్యమని ప్రార్థించారు. సురర్షి నారదుని అనుగ్రహ భాషణంతో సురవందితుని- మురహరుని, లక్ష్మీవరుని స్వరూప, స్వభావ, మహిమా ప్రభావ ప్రాభవాలను తనివి తీర విని, గ్రహించి, అనుభవించి పులకించి ప్రచేతసులు హరిమందిరానికి (వైకుంఠానికి) వేంచేశారని మైత్రేయుడు విదురునికి వివరించి చెప్పినట్లు శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి వినిపించాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
ఎవరైనా మరణిస్తే పది రోజులు ఎందుకు మైల పాటించాలి.. ఇది ఆచారమా? మూఢ నమ్మకమా?
మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?