శ్రీశుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! నిష్క్రియుడైన (క్రియలేని) పరమాత్మలో మాయాశక్తి వలన భాసించే (ఉన్నట్లుగా అనిపించే) క్రియకే ‘లీల’ అని పేరు. ఈ దృష్టిలో భగవంతుడేమి చేసినా, ఎంత చేసినా ఏమీ చెయ్యనివాడే. అదంతా లీలా మాత్రమే. క్రియకు లీలకు అజగజాంతరం (మేకకు మత్తేభానికి) ఉన్నంత భేదం! కర్తృత్వ, భోక్తృత్వ భావనలతో బిగువుగా, బిరుసుగా ఉండేది క్రియ. అది బంధకం (జీవుణ్ని సంసారంలో బంధించేది). అవి లేకుండా మృదువుగా, మనోజ్ఞంగా, సొగసుగా, సుందరంగా ఉండేది లీల. అది మోచకం (ముక్తినిచ్చేది).
‘ధరానాథా! ఈ ధర్మ తత్తసారాన్ని పూర్వం రాజసూయ యాగ కర్మానుష్ఠాన సమయంలో నీ తాత ధర్మజునికి మర్మమెరిగిన దేవర్షి నారదుడు నర్మగర్భంగా వివరించాడు. అది నీకు విశదీకరిస్తాను. వీనులకు విందు గొలిపే ఆ వృత్తాంతం పూనికతో వింటే నీ సందేహం నితాంతం సమసిపోతుంది.
క॥ జననాయక యీ యర్థము
ఘన యశుడగు ధర్మజునకుఁగ్రతుకాలమునన్
మును నారదుండు సెప్పెను
వినిపించెద వినుము చెవులు విమలత నొందన్
మహారాజా! ఆ రాజసూయ యాగంలో ప్రముఖ భాగంగా అగ్రపూజ అందుకొన్న అఖిలలోకారాధ్యుడైన అచ్యుత భగవానుని, చేది భూపాలుడైనా పసిబాలుడు (అజ్ఞాని), అయిన శిశుపాలుడు నిండుసభలో అసిధార (కత్తి అంచు) వంటి నిశిత (పదునైన) వాక్కులతో కసి-కసిగా నిందించాడు. దామోదర దేవుని దూషించడమే దమఘోష సుతుని (శిశుపాలుని) దైనందిన చర్య. శ్రీహరి నిర్వక్రమైన తన సుదర్శన చక్రంతో వాని శిరస్సును ఛేదించగా, స్వామి సమతకు-సమభావానికి నిలువెత్తు నిదర్శనమా అన్నట్లు వాని తేజస్సు వాత్సల్య విగ్రహుడైన వాసుదేవునిలో విలీనమై పోయింది. ఇది కని (చూచి) అచ్చెరువొందిన పాండవ అగ్రజుడు నారదుని- ‘మునివరా! అనిశమూ తగని తీరున హరిని తిట్టడమే పనిగా పెట్టుకొన్న ఈ దుష్టుని నోరు పడిపోలేదు సరి కదా, చెడిపోకుండా వీడు సవ్వడి లేకుండా వడి-వడిగా చక్రపాణి ఒడిలోకి చేరిపోగలిగాడే! ఎలాగో చెప్పండ’ని అర్థించాడు.
మహర్షి ఇలా ముచ్చటించాడు- సత్యభాషణా! దూషణ-భూషణాలు, తిరస్కార-పురస్కారాలు దేహానికే గాని దేహి (ఆత్మ)కి వర్తించవు. ‘దేహమే నేను’ అన్న అభిమానమున్నవానికే దండన-ఖండనాలు, పటు రోషోక్తులు, కటు వచనాలు ‘హింసగా’ అనిపిస్తాయి. దేహాభిమానికి దేహవధ అజరమూ (వృద్ధావస్థ లేని), అమరమూ (మరణము రాని) అయిన స్వ (ఆత్మ) వధగా తోస్తుంది. నీరజాక్షుడు నారాయణుడు నిరభిమాని. సంసారవైరి అయిన కంసారాతి (కంస శత్రువు) కృష్ణుని విషయంలో హింసా కల్పనకు ఏ అంశాన ఆస్కారం లేదు. ఆయన దోషులను దండించినా వారి హితం (శుభం, శుద్ధి) కొరకే గాని ద్వేషంతోను, కోపతాపాలతోను కాదు. దైత్యులను వధించినా వేదమర్యాద (ధర్మ) రక్షణకు, శిక్షణకే గాని భక్షణకు కాదు. వారి రజస్తమోగుణాలు హరించి వారిని ఉద్ధరించడానికే! భారతా! భగవంతుని బాహ్యక్రియలో తప్ప ఆయన భావం (హృదయం)లో ఏ మాత్రం విషమత్వం ఉండదు. అజితుడైన (అపజయం లేని) జనార్దనుడు జితక్రోధుడు, జిత మన్యువు- క్రోధాన్ని జయించిన వాడు. పురుషోత్తమ పరమాత్ముని ప్రబలమైన ప్రహారం (దెబ్బ)లో కూడా ప్రీతి ఓతప్రోతమై (పూర్ణమై) ఉంటుంది! వైకుంఠుడైన విష్ణువుచే వధింపబడిన విరోధులందరూ వైకుంఠానికి వెళ్లినవారే! అనఘా! ఆదిదేవుని-అచ్యుతుని అనుగ్రహం కన్నా ఆయన ఆగ్రహమే మిన్న అన్నది ఎన్నదగిన భాగవతుల అనుభవం! ‘అకర్త (కర్తృత్వం వహించనివాడు) సర్వలోక సంహర్త- (అన్నిలోకాలను సంహరించువాడు), అయినప్పటికీ అఘమునకు- పాపమును భర్త-భోక్త (అనుభవించువాడు) కాడు’ అని గీతావాణి.
ఆ॥ అలుకనైనఁ జెలిమినైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁదగిలి తలఁప నఖిలాత్ముడగు హరిఁ
జేరవచ్చు వేరుసేయఁ డతఁడు
ధర్మనందనా! వైరభావం- కోపంతో కాని, సఖ్యం- స్నేహంతో కాని, కామంతో కాని, బంధుభావం (చుట్టరికం)తో కాని, భయం- ఉద్వేగంతో కాని ఎలాగైనా సరే ఏలినవారిని (శ్రీహరిని) ఏమరుపాటు లేకుండా హృదంతరంలో నిరంతరం స్మరిస్తూ ఉన్నట్లయితే సర్వాత్మ స్వరూపుడైన వాసుదేవుని చేరుకోవచ్చు. ఆ దయామయుడు, హితవరుడు ఎవరినీ, ఎప్పుడూ పరుని (వేరు)గా చూడడు.
యుధిష్ఠరా! ధర్మజా! వైరానుబంధం- విష్ణువుతో విరోధం అనే అనుబంధం- సంబంధాన్ని పెంచుకొని ఆయనను అనతి కాలంలోనే అతిసులభంగా అందుకొన్న చందంగా నతులు, నుతులతో కూడిన చిరకాలపు భక్తి చేత కూడా ఆనంద స్వరూపుడైన నందననందనుని పదారవిందాములను పట్టలేమేమోనని ఇప్పట్టున నారాయణ పరాయణుడనైన నా మనసులో కూడా సందేహం పొడగట్టుతున్నది. వైరభావం (ద్వేషం)తో భగవంతుని యందు కలిగే తన్మయత్వం భక్తియోగంతో కలగదని దృఢమైన నిష్కర్షగా దేవర్షి నారదుల వారి ఉల్లము తేటతెల్లమయింది. అయితే ఎల్ల దేహధారులు (జీవులు) నల్లనయ్యను ద్వేషించాలనా అర్థం? అలా అనుకుంటే అది అపార్థం, అనర్థం మాత్రమే కాదు, అసమర్థం, అసంభవం కూడా! ‘ద్వేషేణాపి దదాతి యో నిజపదం తస్మై నమో విష్ణవే’- ఈ కైముతిక న్యాయానికి కైమోడ్పులు! ద్వేషబుద్ధితో రోషమూలకంగా స్మరించే వారికే ముక్తిని ప్రసాదించేవాడు ప్రేమపూర్వకంగా నిరంతరం స్మరించేవారికి ముక్తికి మించింది మరేదైనా ఇస్తాడా? అంటే, అవ్యాజము (నిష్కామ), అప్రతిహతము (విఘ్నాలకు లొంగని) అయిన అనన్య భక్తిని అనుగ్రహిస్తాడు. ఘోరమైన వైర (ద్వేష) మూలక స్మరణ కూడా మోక్షప్రదమని నిర్నిబంధంగా ఘోషించింది ఈ ధర (భూమి) మీద సనాతన భారత భాగవత ధర్మం మాత్రమే! ‘నమో ధర్మాయ మహతే నమో కృష్ణాయ వేధసే’- మహత్తర శక్తిగల ధర్మానికి నమోవాకాలు! విశ్వవిధాత జగద్గురువు శ్రీకృష్ణునికి వేనవేల వందనాలు!
క॥ వైరానుబంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరగ రాదని తోచును
నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్
(సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006