S-400 Missile : ఇండియా– రష్యా మధ్య ఉన్న మైత్రి గురించి తెలిసిందే. రక్షణ, సాంకేతికత, చమురు, వ్యాపారం, వాణిజ్యం సహా అనేక అంశాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. ముఖ్యంగా భారత రక్షణ వ్యవస్థకు రష్యా తోడ్పాటునందిస్తూ వస్తోంది. ఇండియాకు అవసరమైన కొన్ని యుద్ధ విమానాలు, మిస్సైల్స్ వంటివి రష్యా సరఫరా చేస్తోంది. ఇండియాకు రష్యా అందిస్తున్న వాటిలో ఎస్–400 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కీలకమైనవి.
వీటిని అందించే విషయంలో 2018లో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందం మేరకు ఐదు ఎస్–400 క్షిపణి రక్షణ వ్యవస్థల్ని ఇండియాకు రష్యా అందించాలి. 2023 వరకు మూడు రక్షణ క్షిపణి వ్యవస్థల్ని అందించింది. ఇంకో రెండు ఎస్–400 మిస్సైల్స్ సిస్టమ్స్ ఈ పాటికే రావాలి. కానీ, రష్యాకు, ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా వీటిని సమయానికి అందించలేకపోయింది. దీంతో ఈ వ్యవస్థల్ని త్వరగా అందించాలని రష్యాను ఇండియా కోరింది. అంతేకాదు.. మరిన్ని ఎస్–400 మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు చేసేందుకు కూడా ఇండియా మొగ్గు చూపుతోంది.
ఈ అంశంపై రష్యాకు చెందిన ఎఫ్ఎస్వీటీఎస్ (ఫెడరల్ సర్వీసెస్ ఫర్ మిలిటరీ–టెక్నికల్ కోపరేషన్) సంస్థతో ఇండియా చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ కూడా వెల్లడించింది. రష్యా నుంచి ఇలాంటి మరింత అదనపు వ్యవస్థల్ని కొనుగోలు చేయాలని ఇండియా భావిస్తోంది. ఇక మిగిలిన ఎస్–400 మిస్సైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ను త్వరలోనే అందిస్తామని ఎఫ్ఎస్వీటీఎస్ చీఫ్ దిమిత్రీ షుగయేవ్ ఇటీవల తెలిపారు. నిజానికి ఇవి ఈ నెలలోనే రావాలి. కానీ, వచ్చే నవంబర్ నాటికి అందజేస్తామని తాజాగా రష్యా వెల్లడించింది. అలాగే, ఇండియా కోరినట్లు అదనపు మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని దిమిత్రీ తెలిపారు.
ఈ మిస్సైల్స్ సిస్టమ్స్.. రష్యా తయారు చేసిన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. అంటే శతృవులు ప్రయోగించి క్షిపణుల్ని గుర్తించి, గాలిలోనే ఈ వ్యవస్త నాశనం చేయగలదు. దూరం నుంచి వచ్చే ఎయిర్క్రాఫ్ట్స్, డ్రోన్లు, మిస్సైల్స్, ఖండాంతర క్షిపణుల్ని ఇది అడ్డుకోగలదు. ఇండియా తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో వీటిని కొనుగోలు చేస్తోంది.