శ్లో॥ ప్రహ్లాద భాగధేయం నిగమ మహాద్రేర్గుహాన్తరా ధేయం
నరహరి సదాభిధేయం విబుధ విధేయం మమాను సంధేయమ్ (లీలాశుకః)
ప్రహ్లాదుని భాగ్యవిశేషమును, వేద గుహయందు వసించునదియు, నరసింహ నామం కలదియు, విద్వాంసులకు తెలియదగినదియు అగు వెలుగును ఆశ్రయించెదను)
ఉ॥ కమ్మని తేటతెల్గు నుడికారము లేరిచి కూర్చి చాకచ
క్యమ్ముగ కైతలల్లు ‘మొనగాడు కవీశ్వరు’లెంత మంది లో
కమ్మున లేరు నీవలె నొకండును భక్తి రసామృత ప్రవా
హమ్ముల కేతమెత్తిన మహాకవి యేడి తెలుంగు గడ్డపై?
తెలుగుదనం తేటపడే తియ్యందనాల నుడికారం- పదబంధాలు, పలుకుబడులు ఏర్చి, కూర్చి కావ్యకళా కౌశలంతో శ్రావ్యంగా కవితలల్లే కవి తల్లజులు (శ్రేష్ఠులు) భువిలో ఎందరు లేరు? కాని, బమ్మెర పోతన వలె భక్తి రసామృతం ఓతప్రోతం (నిండు)గా కమ్మని కైతల (కవిత్వ) ధారలకు ఏతమెత్తిన ప్రాతఃస్మరణీయ కవినేత ఈతడు తప్ప మరొకడేడి?’- ‘కరుణ శ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పై పద్యం భాగవత సప్తమ స్కంధానికి నిలువుటద్దంగా కొలువుదీరి నిలుస్తుంది.
విశుద్ధ భక్తి అనే ‘మందార మకరంద మాధుర్య’మయమైన ఈ సుందర స్కంధం పరమ భాగవతుడైన ప్రహ్లాదునికి పరిపూర్ణంగా సమర్పితమైన సాధు (ఉత్తమ) సుగంధ ప్రబంధం! భగవద్, భాగవతుల అవిరల (నిరంతర), అవ్యాజ (నిష్కామ), ఆత్మీయ ప్రేమ బంధం! షష్ఠ స్కంధానికి లక్షణం విలక్షణమైన ‘పుష్టి’. వశిష్ఠ నప్త (మునిమనుమడు) అయిన వ్యాసుడు ‘పోషణం తదనుగ్రహః’ అని
నిర్వచిస్తూ ‘పుష్టి’ అనగా అశేషమైన భగవదనుగ్రహ విశేషమని విశ్లేషణాత్మకంగా వివరించాడు.
ఆదిదేవుడు అరవిందాక్షుడు జీవులందరి మీద సమంగా అనుగ్రహం కుమ్మరిస్తున్నప్పటికీ వారిపై దుఃఖాలు ఎందుకు ముమ్మరంగా వచ్చిపడుతున్నాయి?- అన్న ప్రశ్న సహజంగా పుడుతుంది. ఈ కష్టాలకు కారణం జీవుల ఊతులు- అనగా కర్మవాసనలే కాని దయా దాక్షిణ్యమూర్తి అయిన దామోదర భగవానుడు కాదు. చర్విత చర్వణంగా (పదే-పదే) ఆచరించే కర్మల తాలూకు ముద్రలు- సంస్కారాలు, మనసులో అంకితమైపోతాయి. వాటికే వాసనలని పేరు. జన్మ- జన్మల నుంచి అంటకాగుతూ తమ వెంట పడి వస్తున్న, వంత పలుకుతున్న వాసనలను జీవులు అంత తేలికగా విడిచి పెట్టలేరు. ప్రబలమైన ఈ బలహీనతే అన్ని బాధలకు కారణం.
అచ్యుతుని అనుగ్రహం పొందడం ఒక ఎత్తయితే దానిని చ్యుతి (వ్యర్థం) కాకుండా అన్వర్థం- సద్వినియోగ పరచుకోవడం మరో ఎత్తు. స్వామికృపను సార్థకం చేసుకున్న సాధకుడు తనలోని కామక్రోధాది వికారాలను, వాసనలను జయించి శిష్టుడు, పుష్టుడు (బలిష్టుడు) పూర్ణుడు అవుతాడు. అలాకాక, ఆదిదేవుని అనుగ్రహాన్ని అపవ్యయం (దురుపయోగం) చేసుకునే అపమార్గ గామి అయిన మానవుడు దుష్టుడు, భ్రష్టుడు, నీచుడు, నికృష్టుడు అవుతాడు. బ్రహ్మదేవుడు తనకు ప్రసాదించిన సకల శక్తియుక్తులను, సంపదలను స్వార్థానికి, భోగ విలాసాలకు వ్యయం చేసి హిరణ్యకశిపుడు
దైత్యుడయ్యాడు. అతని పుత్రుడు ప్రహ్లాదుడు తన శక్తిని, సమయాన్ని భక్తి కోసం వినియోగించి దైత్యర్షి- దేవుడుఅయ్యాడు.
సప్తమ స్కంధంలో పదైదు (15) అధ్యాయాలు. ఈ రూపంగా ఈ స్కంధం భక్తి వేదాంత పంచదశి! ఐదేసి-ఐదేసి అధ్యాయాల మూడు ప్రకరణాలు (విభాగాలు). వీనిలో వరుసగా అసుర (అశుభ), సుర (శుభ), నర (శుభాశుభ) అనే మూడు విధాల వాసనలు వర్ణించబడినాయి. ‘ఊతివత్ కర్మవాసనాః’- సాలీడు గూడు అల్లునట్లు ఈ కర్మవాసనలే జీవులకు స్థూల, సూక్ష్మ శరీరాల ఆకృతులను
(రూపాలను) అల్లుతాయి. ‘వాసనలు అనేవి శుభ, అశుభ అనే రెండు మార్గాల ద్వారా ప్రవహిస్తున్నాయి. పురుషుడు(జీవుడు) ప్రయత్నపూర్వకంగా అశుభమార్గాన్ని నిరోధించి శుభమార్గానికి వానిని మళ్లించాలి’ అని ముక్తికోపనిషత్తు. హిరణ్యకశిపుడు అసుర వాసనకు, ప్రహ్లాద యుధిష్ఠిరులు దైవ, మానవ వాసన (స్వభావా)లకు సంకేతాలు-ప్రతీకలు. వైకుంఠవాసులు, విష్ణుపార్షదులై (ద్వార పాలురై) ఉండి కూడా జయ-విజయులు విష్ణువు యొక్క అంతరంగ భక్తులైన సనత్కుమారులను తిరస్కరించి, వారి శాపం వలన అశుభ వాసనల అసుర (రాక్షస) జన్మలు పొందారు. నారద మహర్షి మహదనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు మాతృగర్భంలో ఉండగానే శుభవాసనా వాసితుడై జన్మించి ఐదేళ్లకే మహాభక్తుడయ్యాడు. కాన, బుద్ధిమంతుడు అనుక్షణం మహాపురుషుల అనుగ్రహప్రాప్తి కోసం ప్రయత్నపరుడు కావాలి. దుర్జేయమైన స్వభావ (వాసన) విజయమే నిజమైన జీవన సాఫల్య పురస్కారం! ఇలా, పరిశీలనాత్మకంగా పరికిస్తే భాగవత కథలన్నీ ఆత్మతత్తాన్ని- పరమార్థాన్ని ప్రతిబింబించే ప్రసన్న గంభీరమైన ప్రతీకలుగా పరిణమించి ప్రకాశిస్తాయి.
ఆనవాయితీని అనుసరిస్తూ అమాత్యుడు పోతన స్కంధ ఆరంభంలో తన ఆరాధ్య దైవం దశరథనందనుని కందపద్యంలో నుతించి వందనాలు అర్పించాడు. సప్తమ స్కంధం ఆద్యంతం నారద-యుధిష్ఠిర సంవాదరూపంగా సాగుతుంది. ప్రారంభంలో పరీక్షిత్తు శుకమునితో ఇలా విన్నవించాడు- మహర్షీ! పరమాత్మ పరమానంద స్వరూపుడు, అఖిల భూతప్రియుడు, సర్వసముడు అని అన్నారే! ఒకరిని చేరదీయడం రాగకార్యం. ఒకరిని చంపడం, చంపించడం, చెరుపు చెయ్యడం ద్వేషకార్యం. మునిచంద్రా! చక్రధారి (విష్ణువు), శక్రు(ఇంద్రు)ని కోసం అసురులను వెంబడించి హతమార్చడం రాగద్వేష లక్షణం కాదా?
భక్తుడైన వృత్రాసురుని కూడా వధింపజేశాడే! పరమాత్మ పూర్ణకాముడు, అకాముడు. ‘నానవాప్త మవాప్తవ్యం’ (గీత)- అతనికి పొందనిది కాని, పొందవల్సింది కాని లేనేలేదు. తాను సర్వలోక మహేశ్వరుడు, మృత్యువుకే మృత్యువు! కాన, నిర్భయుడు. అట్టివాడు ఏమి ఆశించి దేవతలను చేరదీశాడు? ఎలాంటి భయం శంకించి దానవుల పట్ల పగబూనాడు. గురుదేవా! రాగద్వేషాలు రజోగుణం నుంచి పుడతాయి. అవి ఉంటే శాంతి ఉండదని, శాంతి లేనిచో సుఖం, ఆనందం సిద్ధింపదని అంటారే, మరి నారాయణుడు నిత్యానంద స్వరూపుడెలా అవుతాడు? ఈ రెంటికీ సమన్వయం కుదరడం లేదు. ఆచార్యా! సముడైన స్వామి సృష్టిలో విషమత్వం (హెచ్చుతగ్గులు) ఎందుకు? పిల్లి, ఎలుకలు రెంటిలో పరమాత్మ ఉన్నప్పుడు పిల్లి ఎలుకను ఎందుకు చంపి తింటుంది? నిత్య నిరంజన మూర్తి అసురులను అంతమొందించి, అమరులను ఆదరించడం ఎంతో వింతగా ఉంది. ఈ సందేహాన్ని తమరే తొలగించాలి. ‘సంశయంబు నాకు జనియించె మునినాథ! ప్రజ్ఞమెరసి తెలియఁ బలుకవయ్యా!’ (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పోతన భాగవతం | ప్రచేతసుల పరమపద ప్రాప్తి
మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?