టెక్సాస్: చంద్రుడు మీదకు రోవర్లను పంపిన నాసా.. ఇప్పుడు అక్కడ శాశ్వత మానవ బేస్(Moon Base)ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొత్తగా మూడు మిషన్లు చేపట్టనున్నట్లు నాసా వెల్లడించింది. మీడియా సమావేశంలో నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్మాన్ మాట్లాడుతూ.. పర్మనెంట్ బేస్ను చంద్రుడిపై నిర్మించేందుకు సుమారు 20 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతోందన్నారు. లూనార్ రోవర్లు, డ్రోన్లను అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రమాదకరమైన వాతావరణంలో ప్రయోగాలు నిర్వహించే రీతిలో అక్కడ ఏర్పాట్లను కల్పించనున్నారు.
చందమామపైకి మళ్లీ అమెరికా వెళ్తోందని, బయట ప్రపంచంలో మానవుడు ఏర్పాటు చేసుకోబోతున్న తొలి మానవ బేస్ అదే అన్నారు. 2028 నాటికి చంద్రుడిపై ఆస్ట్రోనాట్లను దింపాలని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దానికి తగిన ప్రణాళికలతో నాసా ముందుకు వెళ్తున్నది. బ్లూ ఆర్జిన్స్ కు చెందిన బ్లూ మూన్ మార్క్ 1 ఎండ్యూరెన్స్ ల్యాండర్ను పంపనున్నారు. మూన్ బేస్1 మిషన్లో భాగంగా ఆ ల్యాండర్ చంద్రుడిపై దిగనున్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆ ప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నాయి.
షాకల్టన్ కనెక్టింగ్ రిడ్జ్ ప్రాంతంలో ల్యాండర్ను దింపనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఆర్టెమిస్-2 మిషన్లో భాగంగా నలుగురు ఆస్ట్రోనాట్లు చంద్రుడిని చుట్టి వచ్చిన విషయం తెలిసిందే. మూన్ బేస్ 2 మిషన్లో సుమారు 1100 పౌండ్ల కార్గోను పంనున్నారు. ఆస్ట్రోబోటిక్ గ్రిఫిన్ ల్యాండర్ ద్వారా డెలివరీ చేస్తారు. ఇక మూన్ బేస్ 3 మిషన్లో భాగంగా లూనార్ వెర్టిక్స్ ను పంపనున్నారు. చంద్రుడిపై ఉన్న గురుత్వాకర్షణ గురించి ఆ మిషన్ స్టడీ చేస్తుంది. ఈ ప్రయోగంలో యురోపియన్, కొరియన్ స్పేస్ ఏజెన్సీ పేలోడ్స్ కూడా వెళ్తాయి.
మూడు దశల ప్రోగ్రామ్ ద్వారా.. రాబోయే మూడేళ్లలో చంద్రుడి ఉపరితలాన్ని నాసా సిద్ధం చేయనున్నది. చంద్రుడి ఉపరితలంపై తిరిగే ఓ వాహనాన్ని కూడా నాసా సిద్ధం చేస్తున్నది. లూనార్ సర్ఫేస్పై ఆస్ట్రోనాట్స్ తిరిగే అవకాశాలు ఉంటాయి. మూన్ బేస్ రెండో ఫేజ్లో 2029 నుంచి 2032 మధ్య పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించనున్నారు. దీనిలో భాగంగా ఓ పవర్ గ్రిడ్ను నిర్మిస్తారు. 2032 నుంచి మూడో ఫేజ్ను మొదలుపెడుతారు.